Thursday, April 30, 2020

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయము :-నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

వైశాఖ పురాణం 9 వ అధ్యాయము

                                 వైశాఖ పురాణం 

తొమ్మిదవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
                         

                              సతీదేహ త్యాగము

అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శ్రుతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజిట్లు పలికెను. శ్రుతదేవ మహామునీ! యిక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవుటవలన ముమ్మారు చాతకముగను, జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా! పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను, పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగ నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా. అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను. అని అడిగిన శ్రుతకీర్తిని మెచ్చి శ్రుతదేవుడిట్లు పలికెను. రాజా! వినుము, ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడీ లోకములన్నిటిని సృష్టించెను. వాని స్థితిని యిహలోక సంబందము, పరలోక సంబందము అని రెండు విధములుగ నేర్పరచెను. ఇహలోక సంబందములుగ జలసేవ, అన్నసేవ, ఔషధసేవయని యిహలోకస్థితికి మూడు హేతువులు నేర్పరచెను. ఇవి మూడును యిహలోకస్థితికి సర్వలోకములకును ముఖ్యహేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మమార్గసేవయను మూడును ముఖ్యహేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరచిన విధానములని వేదములయందు చెప్పబడినది.

ఇంటియందుండి సంపాదించుకున్న ఆహారపదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగ యిహలోకమున మనము పరలోకస్థితికై సంపాదించుకొన్న సాధు, విష్ణు, ధర్మమార్గసేవలు ఉపయోగపడుచున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైనకార్యము మన మనస్సునకు యిష్టమైనను దాని వలన నేదో యొక అనర్ధము కలుగుచున్నది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైనదానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన యితివృత్తమును వినుము. పార్వతీ! యీ  కథ పాపములను పోగొట్టును, వినువారికి ఆశ్చర్యమును, ఆనందమును కలిగించును.

పూర్వము దక్షప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదలచెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునకిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసమునకు వచ్చెను. అట్లు వచ్చిన దక్షప్రజాపతిని జూచి "నేను దేవతలందరికిని గురువును. వేదములు వివరించు త్రికాలాబాధితమైన వాడను, చంద్రుడు, యింద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చువారు. అనగా సేవకప్రాయులు, ప్రజాపతులలో నొకడైన దక్షప్రజాపతియు తనకు పిల్లనిచ్చిన మామయై గౌరవార్హుడైనను, పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో నొకనిని జూచి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరము కాదు. యజమాని సేవకుని జూచి లేవరాదు. భర్తభార్యను జూచి లేవరాదు. గురువు శిష్యుని జూచి లేవరాదు అని పండితుల మాటకదా! దక్షప్రజాపతి పిల్లనిచ్చిన మామ యగుటచే పూజ్యుడే. కాని యిచటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదగుటచే సర్వోన్నతుడు, సర్వోత్తముడు, దేవదేవుడునగు తాను(శివుడు) లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని జూచి గురువు లేచినట్లుగ, భార్యను జూచి భర్త లేచినట్లుగ, సేవకుని జూచి యజమాని లేచినట్లుగ ధర్మవిరుద్దముగ నుండును. కావున తాను లేచినిలుచుండి గౌరవించుట దక్షప్రజాపతికి శ్రేయస్కరము గాదు. లేచినచో యజమానులు మున్నగువారు లేచి సేవకాదుల గౌరవించుట వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి సంతతి మున్నగు వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామయగు దక్షప్రజాపతి వచ్చినను, మామగారుగా పూజ్యుడైనను, దక్షుని శ్రేయస్సును కోరిలేవలేదు.

కాని పరమేశ్వరునంతటి వాని యాలోచనాశక్తిని, ఔన్నత్యమును గమనింపజాలని దక్షప్రజాపతి ధర్మసూక్షమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొనజాలని యతడు శివుని యెదుటనే యిట్లనెను. ఓహో! ఎంతగర్వము ఓహోహో యేమి యీ గర్వము! దరిద్రుడు. తనను తాను తెలిసికొనజాలని అవివేకి యీ శివుడు. ఇతనికి తనకంటె మామమాన్యుడను వివేకములేని అవివేకి యీ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా! ఈశ్వరుడను పదమున నైశ్వర్యమును కలిగియున్నాడు. ఇతని యైశ్వర్యమెంత గొప్పదో కదా! వయస్సెంతయో తెలియదు. శుష్కించిన ఒక్క యెద్దు వీని యైశ్వర్యము. పాపము కపాలమును, యెముకలను ధరించి వేదబాహ్యులగు పాషండులచేత పూజింపబడువాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళమేమియుండును? లోకములు, శాస్త్రములు లోకములు చర్మధారణము నంగీకరింపవు. దరిద్రుడై చలికి బాధపడుచు నితడు అపవిత్రమగు గజచర్మమును ధరించును. నివాసము శ్మశానము అలంకారమాసర్పము. ఇది యితని యైశ్వర్యము. ఇట్టి యీతడీశ్వరుడు పేరు శివుడు. శివశబ్దార్థము నక్క. ఆ నక్క తోడేలును జూచి పారిపోవును. 'శివాయను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞడను పేరు కలదు. కాని మామను చూచి నమస్కరింప వలయునను జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారము నెప్పుడును విడువడు. వీని కులమేమియో తెలియదు మరియు నితడు పరమేశ్వరుడు. సజ్జనులితనిని దైవముగ నంగీకరింపరు. దురాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగావిని నేనతనికి నా కుమార్తెయగు సతీదేవినిచ్చి మోసపోతిని. ధర్మవ్యతి రిక్తమైన ప్రవర్తన గల యితనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీనియింటనే యుండి యీ సుఖముల ననుభవించుచుండుగాక. ఇట్టి యితడు, వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరును మాకు మెచ్చదగినవారు కారు. నీచ కులము వానియొద్దనున్న పవిత్ర కలశము విడువదగినదైనట్లుగ వీరు నాకు విడువ దగినవారు" అని బహువిధములుగ పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని, అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన యింటికి మరలి పోయెను.

యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో గలసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే యుండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరును దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారుణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు వారు వీరననేల అందరును వచ్చిరి.

పుణ్యాత్మురాలగు సతీదేవి స్త్రీ సహజమగు చాంచల్యముచే ఆ యజ్ఞమును జూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావము ననుసరించి యజ్ఞమునకు వెళ్లదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు ఓ సుందరీ నీ తండ్రియగు దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా! ఆ నీ తండ్రి చేయు నిందను విని గృహస్థధర్మము ననుసరించి సహింపవలయును. నేను నిందను విని సహించినట్లు నీవు సహించియుండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరుగదు. నిశ్చయము అని శివుడెంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగనైన తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యెను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభరూపమున వచ్చి యామె నెక్కించుకొని యజ్ఞశాలకు తీసికొని వెళ్లెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెననుసరించి వెళ్లినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్లి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్లెను.

యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవరును పలకరింపలేదు. దానిని సతిదేవిని గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి యచట నున్న సభ్యులు ఆమెను జూచియు పలుకరింపక మౌనముగ నుండి దక్షుడును యజ్ఞమున చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను నుద్దేశించి ఆహుతుల నిచ్చెను.

తండ్రి చేసిన ఆకృత్యమును గమనించి కన్నీరు నించిన సతీదేవి యిట్లు పలికెను. తండ్రీ! ఉత్తముల నవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త-లోకభర్త. అందరికిని ప్రభువు. అతడు నాశరహితుడు ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగ నీయకపోవుట యుక్తము కాదు సుమా. ఇట్టి బుద్ది నీకే కలిగినదా? ఇట్టి దుర్బరబుద్దినిచటివారు కలిగించారా? ఇచటి వారెవరును నీవు చేయు పని మంచిది కాదని చెప్పక పోవుటయేమి? విధివిధానము వీరికి విముఖమైయున్నదా? అని సతీదేవి పలికెను.

సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచటనున్న భృగుమహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరచుకొనిరి. కొందరు చంకలు కొట్టుకొనిరి. మరికొందరు పాదములను, తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగ సభలోనివారు దక్షుని సమర్థించుచు, సతీదేవిని పరిహసించుచు విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడును ఆమెను, శివుని బహువిధముల నిందించెను.

రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృనిందను విన్నందులకు ప్రాయశ్చిత్తముగ యజ్ఞశాలలోని వారందరును చూచుచుండగా యజ్ఞవేదికలోనున్న అగ్నికుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును జూచిన వారందరును హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమధులు పరుగునపోయి పరమేశ్వరునకా విషయమును దెలిపిరి.

వైశాఖ పురాణం తొమ్మిదవ అధ్యాయము సంపూర్ణము

         🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

13వ దినము, అయోధ్యకాండ

13వ దినము, అయోధ్యకాండ
అందరూ రాముడిని చేరుకోవడం కోసమని అయోధ్య నుంచి బయలుదేరారు. కాని, అందరి కంటే ముందు కైకేయ బయలుదేరింది. తాను ఎవరికోసమైతే ఈ పని చేసిందో, ఆ భరతుడే తనని కాదన్నప్పుడు ఆమెను ఆవహించిన మొహం పోయింది. తన తప్పుని తెలుసుకుంది. అలా కొన్ని లక్షల సైన్యంతో బయలుదేరి వాళ్ళు గంగా నదిని చేరుకున్నారు. అప్పుడు ఆ నిషాద రాజైన గుహుడు వాళ్ళని చేసేసరికి, ఒక పెద్ద సముద్రము వచ్చినట్టు, కోవిదార వృక్షము చిహ్నముగా ఉన్నటువంటి  సైన్యం వచ్చి నిలబడింది.

అప్పుడు గుహుడు తన బంధువులని, సైన్యాన్ని, యువకులని పిలిచి " భరతుడు ఇంత సైన్యంతో వచ్చాడంటే, కచ్చితంగా మనందరినీ చంపడం కోసమైనా వచ్చి ఉండాలి, లేదా 14 సంవత్సరాల తరువాత రాముడు తిరిగి వస్తే ఆయన పరాక్రమము ముంది నిలబడలేనని, ఇదే అదునుగా ఒక్కడె ఉన్న రాముడిని, లక్ష్మణుడిని సంహరించడం కోసమైనా వచ్చి ఉండాలి. రాముడు నాకు పరమ మిత్రుడు, ఆయనని మనం రక్షించుకోవాలి. ఇంత పెద్ద సైన్యాన్ని మనం ఎదిరించలేము, కాకపోతే మన సహాయం లేకుండా వీళ్ళు ఎవరు గంగని దాటలేరు. అందుకని 500 పడవలని ఈ సైన్యం అంతా వెళ్ళడానికి సిద్ధం చెయ్యండి. మీరందరూ కూడా ఒక్కొక్క పడవలో 100 మంది చొప్పున కవచాలు కట్టుకొని, ఆయుధాలు పట్టుకొని నిలబడండి. నేను ఏమి ఎరుగని వాడిలా భరతుడి దెగ్గరికి వెళ్ళి, నువ్వు రాముడిని కలుసుకోడానికి వెళుతున్నావ, రాముడిని సంహరించడానికి వెళుతున్నావ అని అడుగుతాను. ఒకవేళ రాముడిని సంహరించడానికే భరతుడు వచ్చి ఉంటె, పడవలలో గంగని దాటిస్తామని చెప్పి, పడవ ఎక్కించి, గంగ మధ్యలో ముంచేద్దాము. ఒకవేళ రాముడిని కలుసుకోవడానికే భరతుడు వచ్చి ఉంటె, రాముడు ఎక్కడున్నాడో చెప్పి, వాళ్ళతో నేను కూడా వెళతాను " అన్నాడు.  

అప్పుడాయన కొంత మాంసము, పుష్పములు, ధాన్యములు, కందమూలములు, తేనె పట్టుకొని భరతుడు విడిది చేసిన గృహం దెగ్గరికి వెళ్ళాడు. గుహుడు రావడాన్ని చూసిన సుమంత్రుడు లోపలికి వెళ్ళి భరతుడితో " భరతా! నువ్వు రాముడు ఎక్కడున్నాడో అని వెతుకుతున్నావు కదా, రాముడు ఎక్కడున్నాడో గుహుడికి తెలుస్తుంది. రాముడికి గుహుడి మీద అపారమైన ప్రేమ, అలాగే గుహుడికి రాముడి మీద అపారమైన భక్తి " అని చెప్పగానే భరతుడు గుహుడిని లోపలికి ప్రవేశపెట్టమన్నాడు.


యదా తుష్టః తు భరతః రామస్య ఇహ భవిష్యతి |
సా ఇయం స్వస్తిమయీ సేనా గంగాం అద్య తరిష్యతి ||
లోపలికి వెళ్ళిన గుహుడు తాను తీసుకువచ్చిన వాటిని అక్కడ పెట్టి "నువ్వు ఈ రాజ్యాన్ని దశరథ మహారాజుగారి వల్ల పొందావు, ఇంకా నీ తృప్తి తీరక రాముడిని చంపుదామని వచ్చావ, లేకపోతే రాముడిని కలుసుకుందామని వచ్చావ, నాకు మనస్సులో శంకగా ఉంది. నిజం చెప్పు భరతా, ఎందుకు వచ్చావు ఇక్కడికి " అని అడిగాడు.

అప్పుడు భరతుడు " నువ్వు అన్నమాట వలన నాకు బాధ కలిగినా, నీ అమాయకత్వం నాకు తెలుస్తోంది. నేను ఈ గంగ దాటి భారద్వాజ ఆశ్రమానికి వెళ్ళి, ఆ ఆశ్రమం దెగ్గరలో ఉన్న రాముడిని కలుసుకోవాలని అనుకుంటున్నాను " అన్నాడు.

" సరే నువ్వు రాముడిని కలుసుకోవాలని వచ్చావు, మరి నీ వెనకాల ఇంత సైన్యం ఎందుకు వచ్చింది " అని గుహుడు భరతుడిని ప్రశ్నించాడు.

అప్పుడు భరతుడు ఆకాశమంత నిర్మలమైన మనసుతో " ఒక తమ్ముడు ఒక అన్నగారిని రాజ్యం కోసం చంపేటటువంటి దురాలోచన ఎన్నడూ రాకుండుగాక, ఒక తమ్ముడు అన్నగారి గురించి ఎప్పుడన్నా ఆలోచిస్తే, అన్నగారి కాళ్ళుపట్టి నమస్కరించడానికి మాత్రమే ఆలోచించేటటువంటి సౌజన్యము నిలబడుగాక " అన్నాడు.

ఈ మాటలు విన్న గుహుడు " ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నీకే చెల్లిందయ్యా ఈ మాట చెప్పడం. నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ఇద్దరూ కలిస్తే, చూసి మురిసిపోవాలని ఉంది, దెగ్గరుండి గంగని దాటించి నేను మీతో వస్తాను. రాముడు ఇక్కడే పడుకొని వెళ్ళాడు, నన్ను తన తల మీద మర్రి పాలు పోయమన్నాడు, జటలు ధరించి, నార చీరలు కట్టుకొని వెళ్ళాడయ్యా  రాముడు " అని అన్నాడు.

ఆ రాత్రి భరతుడు రాముడి గురించి ఆలోచిస్తూ, తన వల్ల రాముడు ఇన్ని కష్టాలు పడుతున్నాడని బాధపడుతూ ఉండడం వలన నిద్రపట్టక గుహుడిని పిలిచి, నాకు రాముడి గురించి ఏదైనా చెప్పు అని అడిగాడు. అప్పుడా గుహుడు " రాముడు ఇక్కడికి వచ్చి ఇంగుది వృక్షం కింద కూర్చున్నాడు. అప్పుడు నేను ఆయనకి అన్నము, కందమూలాలు, తేనె మొదలైనవి తీసుకువెళ్ళాను, అప్పుడు రాముడు ' నేను క్షత్రియుడిని, ఒకరికి మేము ఇవ్వాలి, ఇతరుల దెగ్గర మేము తీసుకోకూడదు, మా తండ్రిగారికి ఇష్టమైన ఆ గుర్రాలకి కొంచెం దాణ పెట్టు. ఆ గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకురా, అవి తాగి పడుకుంటానయ్యా ' అన్నాడు. అప్పుడు నేను గంగ నుంచి కొన్ని నీళ్ళు తీసుకువచ్చి వాళ్ళకి ఇచ్చాను. సీతారాములు తాగగా మిగిలిన నీళ్ళని లక్ష్మణుడు కళ్ళకి అద్దుకొని తాగాడు. అప్పుడు నేను రాముడిని లోపల హంసతూలికా తల్పం మీద పడుకోమనగా, ఆయన, నేను ఇప్పుడు ఒక తాపసిలాగ బతకాలి అని చెప్పి, లక్ష్మణుడు తీసుకొచ్చిన దర్భగడ్డి  మీద పడుకున్నాడు. రాముడు పడుకోయేముందు, లక్ష్మణుడు సీతారాముల పాదములు కడిగి, తడిగుడ్డతో తుడిచాడు. అప్పుడు సీతమ్మ రాముడి భుజాన్ని తలగడగా చేసుకొని పడుకుంది. నేను కాపలా కాస్తాను నువ్వు పడుకో లక్ష్మణా అంటె, ఆయన నన్ను, ఎలా పడుకోమంటావు గుహా ఇంత దారుణమైన దృశ్యం చూశాక, అని నీ తమ్ముడు లక్ష్మణుడు ఏడిచాడయ్యా. ఇదుగో ఈ గడ్డి మీదే సీతారాములు పడుకున్నారు " అని గుహుడు సీతారాములు పడుకున్న గడ్డిని భరతుడికి చూపించాడు.

అప్పుడు భరతుడు, సీతారాములు పడుకున్న ఆ గడ్డి దెగ్గరికి వెళ్ళి చూడగా, ఒకవైపు గట్టిగా ఒత్తుకొని, గడ్డి భూమిలోకి నొక్కుకొని ఉంది. ఇది రాముడు పడుకున్న చోటని భరతుడు గ్రహించాడు.
మన్యే సాభరణా సుప్తా సీతా అస్మిన్ శయనే తదా |
తత్ర తత్ర హి దృశ్యంతే సక్తాః కనక బిందవః ||
అలాగే, సీతమ్మ పడుకున్న వైపు బంగారు రవ్వలు పడిఉన్నాయి. సీతమ్మ కట్టుకున్న పట్టుచీర కొంగు యొక్క దారములు ఆ గడ్డికి చుట్టుకొని ఉన్నాయి. ఎక్కడో రాజభవానాల్లో పడుకోవలసిన సీతారాములు, ఇంతమంది ఆటవికులు చూస్తుండగా గడ్డి మీద పడుకోవలసి వచ్చిందని, దీనికంతటికి తనే కారణమని భరతుడు నేలమీద పడి మూర్చపోయాడు.

తరువాత భరతుడు " ఈ క్షణం నుంచి 14 సంవత్సరాల పాటు నేను కూడా పట్టుబట్ట కట్టను. నార చీరలే కట్టుకుంటాను, జటలు ధరిస్తాను. నేను కూడా కందమూలములు, తేనె తింటాను " అని ప్రతిజ్ఞ చేశాడు. వెంటనే నార చీరలు ధరించి, భరతుడు ఆ రాత్రికి రాముడు పడుకున్న చోటనే పక్కన భూమి మీద పడుకున్నాడు.

మరునాడు ఉదయం అందరూ గంగని దాటి ముందుకి బయలేదేరారు. అలా కొంత దూరం ప్రయాణించాక వారు భారద్వాజ ఆశ్రమాన్ని చేరుకున్నారు. అప్పుడు సైన్యాన్ని కొంత దూరంలో ఉంచి, భరతశత్రుఘ్నులు వశిష్ఠుడితో కలిసి ఆ ఆశ్రమంలోకి ప్రవేశించారు. (ఒకసారి భారద్వాజుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి నీ కోరిక అని అడిగాడు. నాకు వేదం చదువుకోడానికి 100 సంవత్సరాల ఆయుర్దాయం కావాలని భారద్వాజుడు అడిగాడు, బ్రహ్మగారు సరే అన్నారు. అలా ఆయన బ్రహ్మగారి దెగ్గర 3 సార్లు ఆయుర్దాయం పుచ్చుకున్నాడు. అలా 4వ సారి కూడా తపస్సు చెయ్యగా, బ్రహ్మగారు ప్రత్యక్షమై, వేదాలు ఎంత ఉంటాయో తెలుసా చూడు అని చూపిస్తే అవి పర్వతాల అంత ఎత్తు ఉన్నాయి. నువ్వు 300 సంవత్సరాల్లో చదివింది 3 గుప్పిళ్ళంత. వేదం అనంతం, దాన్ని ఎంతకాలం చదివినా అది తెలిసేది కాదు, పూర్తిగా చదవగలిగేది కాదు. అందుకని నువ్వు చదివినదానితో తృప్తిపడు అన్నారు బ్రహ్మగారు, అలా బ్రహ్మగారిచె ఆయుర్దాయాన్ని పొందిన మహానుభావుడు భారద్వాజుడు).

ఎదురుగా వస్తున్న వశిష్ఠుడిని చూసి భారద్వాజుడు గబగబా వచ్చి అర్ఘ్య పాద్యములు ఇచ్చారు. తరువాత ఒకరిని ఒకరు కుశల ప్రశ్నలు అడిగారు. అప్పుడు భారద్వాజుడు, నువ్వు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చావు అని అడుగగా, నేను రామ దర్శనానికి వచ్చానని భరతుడు చెప్పాడు. ( భారద్వాజుడు త్రికాలవేది, దశరథుడు మరణించాడని ఆయనకి తెలుసు)

అప్పుడు భారద్వాజుడు " మీ తండ్రిగారు 14 సంవత్సరాలు రాముడిని అరణ్యాలకి పంపించి నీకు రాజ్యం ఇచ్చారు. ఆ రాజ్యాన్ని పరిపాలించుకునే స్థితిలో నువ్వు ఉన్నావు, అయినా కాని ఇంత సైన్యాన్ని తీసుకొని అరణ్యానికి వచ్చావు. మహా పాపకార్యమైన రామ హత్య కోసమని నువ్వు వచ్చావని నాకు మనసులో శంకగా ఉంది " అని అన్నాడు.

హతొ అస్మి యది మాం ఎవం భగవాన్ అపి మన్యతె |
మత్తొ న దొషం ఆషంకెర్ న ఎవం మాం అనుషాధి హి ||
ఈ మాటలు విన్న భరతుడు కన్నీరు కారుస్తూ " మహానుభావ! నా దౌర్భాగ్యమయ్య, నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను చూసి రాముడిని చంపడానికి వచ్చావ అంటారు. నేను రాముడిని చంపడానికి రాలేదు. నువ్వు అడిగిన ప్రశ్న చేత నేను చచ్చిపోయాను మహర్షి. ఈ మాట గుహుడు అడిగాడంటే అర్థం చేసుకోవచ్చు, కాని ఇంత గొప్ప మహర్షులు మీరు కూడా ఈ మాట అన్నారంటే నేను బ్రతకడం ఎందుకు. నేను ఎన్నడూ రాజ్యం కావాలని, రాముడు అరణ్యవాసం చెయ్యాలని కోరలేదు, కాని నా మీద ఉన్న విపరీతమైన ప్రేమ చేత మా అమ్మ నేను లేనప్పుడు రెండు వరాలు అడిగింది. రాముడికి పట్టాభిషేకం చేయించాలని అరణ్యానికి వచ్చాను. నేను రాముడిని చంపేంత దుర్మార్గుడిని కాదు మహర్షి " అని ఆయన పాదముల మీద పడి ఏడ్చాడు.

అప్పుడు భారద్వాజుడు " నువ్వు ఎటువంటివాడివో నాకు తెలుసు భరతా, నువ్వు ఇటువంటి దురాలోచనలు చెయ్యవని తెలుసు, అయినా నేను నిన్ను ఎందుకడిగానో తెలుసా. నీ శీలం ఎటువంటిదో లోకానికి చెప్పడం కోసమని నేను ఈ మాట అడిగాను. నువ్వు నీ మాటయందు నిలబడెదవు గాక " అని ఆశీర్వదించిన పిమ్మట " నాయనా! ఈ రాత్రికి నా ఆతిధ్యాన్ని స్వీకరించు " అన్నాడు.

అప్పుడు భరతుడు " మీరు నాకు అర్ఘ్యం, పాద్యం ఇచ్చారు, నాకు ఇంతకన్నా ఏమి కావాలి, నాకు ఏమి వద్దు అన్నాడు ". మరి నీ సైన్యాన్ని ఎక్కడ పెట్టావు అని భారద్వాజుడు అడుగగా, సైన్యాన్ని ఇక్కడికి తీసుకువస్తే ఆశ్రమం పాడవుతుందని వాళ్ళని దూరంగా పెట్టాను అని భరతుడు అన్నాడు.

అప్పుడు భారద్వాజుడు " అంత దూరంగా ఎందుకు పెట్టావయ్య, ఇవాళ నేను ఆతిధ్యం ఇవ్వాలని అనుకుంటున్నాను, కావున నువ్వు నా ఆతిధ్యాన్ని తీసుకొని వెళ్ళాల్సిందే. నీ గుర్రాలకి, ఏనుగులకి, ఒంటెలకి, సైన్యానికి, పురోహితులకి, మంత్రులకి, నీ తల్లులకి ఎటువంటి ఆతిధ్యం ఇవ్వాలో అటువంటి ఆతిధ్యం ఇస్తాను " అన్నాడు.

ఆహ్వయె విష్వ కర్మాణం అహం త్వష్టారం ఎవ చ |
ఆతిథ్యం కర్తుం ఇగ్చ్ఛామి తత్ర మె సంవిధీయతాం ||
ఆహ్వయె దెవ గంధర్వాన్ విష్వా వసు హహా హుహూన్ |
తథైవ అప్సరసొ దెవీర్ గంధర్వీహ్ చ అపి సర్వషహ్ ||
ఇహ మె భగవాన్ సొమొ విధత్తాం అన్నం ఉత్తమం |
భక్ష్యం భొజ్యం చ చొష్యం చ లెహ్యం చ వివిధం బహు ||
తత్ర రాజ ఆసనం దివ్యం వ్యజనం చత్రం ఎవ చ | భరతొ మంత్రిభిహ్ సార్ధం అభ్యవర్తత రాజవత్ ||
అప్పుడా భారద్వాజ మహర్షి ఆచమనం చేసి విశ్వకర్మని, త్వష్టని ప్రార్ధన చేసి " ఇక్కడికి  రాజకుమారులైన భరత శత్రుఘ్నులు వచ్చారు, వారి వెనకాల సేనాబలం వచ్చింది. పురోహితులు, మహర్షులు వచ్చారు. వీళ్ళల్లో ఎవరెవరు ఎటువంటి భవనములలో నివసిస్తారో అటువంటి భవనములను ఓ విశ్వకర్మ! నువ్వు నిర్మించెదవుగాక." ( రాజులు నివసించేవాటిని హర్మ్యములు, బాగా డబ్బున్నవాళ్ళు ఉండేవాటిని ప్రాసాదములు అని అంటారు)

విశ్వకర్మ ఉత్తరక్షణంలో ఎవరికి కావలసిన భవనాన్ని వాళ్ళకి నిర్మించాడు .

తరవాత ఆయన కుబేరుడిని, బ్రహ్మగారిని ప్రార్ధన చేసి " కుబేరా! నీ దెగ్గర ఉన్న వేలమంది అప్సరసలని పంపించు, ఓ బ్రహ్మదేవ!, నీ దెగ్గర ఉన్న అప్సరసలని కూడా పంపించాలి, వారితో పాటుగా నారదుడు, తుంబురుడు, హుహు అనే దేవగాయకులు రావాలి. అలాగే ఇక్కడ పాయసం ఏరులై ప్రవహించాలి. పులియ పెట్టిన పళ్ళనుంచి, పిండి నుంచి, బెల్లం నుంచి పుట్టిన కల్లు(సుర) ఇక్కడ నదులుగా ప్రవహించాలి. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు తినడానికి కావలసిన ఆహారం గుట్టలు గుట్టలుగా పడిపోవాలి, పర్వతాలలా అన్నపురాసులు ఏర్పడాలి, వాటితో పాటు కూరలు, పచ్చళ్ళు, పులుసులు కావాలి. ఇవన్నీ తిన్నాక జీర్ణం అవ్వడానికి సొంఠి, లవంగం, ఇంగువ కలిగిన యవ్వనపు పెరుగు కావాలి. ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు కావాలి. అన్నంలో కలుపుకోడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి .

వీటితో పాటు అందరూ మొహం కడుక్కోవడానికి చూర్ణములు( powder & paste ) కావాలి, వంటికి, జుట్టుకి రాసుకునే ఆమలకం( ఉసిరికాయలతో చేసిన ముద్ద ), సున్నిపిండి, నూనె మొదలైనవి మంచి మంచి బంగారు పాత్రలలో కావాలి. కొన్ని వేల మంది అప్సరసలు వచ్చి, ఒక్కొక్క సైనికుడిని పీఠం మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి, నలుగు పెట్టి స్నానం చేయించాలి. ఇక్కడున్న వాళ్ళలో బాగా గెడ్డాలు పెంచుకున్న ఋషులు, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళు గెడ్డం దువ్వుకోడానికి మంచి దువ్వెనలు రావాలి. వీళ్ళు ఇవన్నీ తిన్నాక ఇంకా తినాలనిపిస్తే, తొందరగా జీర్ణం అవ్వడానికి ఔషదాలు కావాలి, అందుకని ఓ సోముడా!, చంద్రుడా! మీరు ఇవి సిద్ధం చెయ్యండి.

అప్సరసలు నాట్యం చెయ్యాలి, ఇప్పటికిప్పుడు ఇక్కడ పెద్ద పళ్ళతో వెలగ చెట్లు, పనస చెట్లు పుట్టాలి, ఎక్కడెక్కడినుంచో చిలుకలు రావాలి. కుబేరుడి రథమైన చైత్రరథం రావాలి, మామిడి చెట్లు పుట్టాలి, కుంకుడు చెట్లు పుట్టాలి, వీటితో పాటు ఎవరికి ఎంత వేడి కావాలో, అంత వేడితో నీళ్ళు పుట్టాలి, అందరికి కట్టుకోవడానికి బట్టలు, తొడుక్కోవడానికి చెప్పులు కావాలి. భరతుడి కోసం ఒక బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి " అని ప్రార్ధించాడు.

అప్పుడా గుర్రాలు, ఏనుగులు తమ జీవితంలో తిననటువంటి భోజనం చేశాయి. ఒక్కక్కడికి నలుగురు అప్సరసలు నలుగు పెట్టి స్నానం చేయించారు. భరతుడు తన మంత్రులతో కలిసి ఆ హర్మ్యంలోనికి ప్రవేశించాడు. అందులో ఒక పెద్ద వేదిక, దాని మీద కనకపు సింహాసనం, దాని మీద ఒక పెద్ద గొడుగు ఉన్నాయి. లోపలికి వెళ్ళిన భరతుడు ఆ సింహాసనం మీద రాముడు కూర్చున్నట్టు భావించి, కిందన ఉన్న పాదపీఠానికి తల తగిలేటట్టు నమస్కారం చేసి, చామరాన్ని ఒకసారి విసిరి, ఇవన్నీ రాముడికి చెందవలసినవి అని, మంత్రి కూర్చునే చోట కూర్చున్నాడు.

అప్పుడా సభలోకి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు, అలాగే నారదుడు, తుంబురుడు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు. ఏదన్నా తాగడానికి ఉంటె బాగుండు అని భరతుడు అనుకున్నాడు, అంతే, వెంటనే అక్కడ ఒక పాయసపు నది ప్రవహించింది, అందరూ ఆ నది నుంచి ఎంత కావాలో అంత పాయసాన్ని బంగారు పాత్రలలో ముంచుకొని తాగారు .

అందరూ అన్నిటినీ బాగా అనుభవించారు. సైనికులందరూ బాగా తినేసి, తాగేసి పడుకుంటే అప్సరసలు వచ్చి వాళ్ళ కాళ్ళు పట్టారు. అప్పుడా సైనికిలు " మనం వెనక్కి అయోధ్యకి వెళ్ళద్దు, ముందు చిత్రకూట పర్వతాలకి వద్దు, ఇక్కడే భారద్వాజ ఆశ్రమంలో ఉండిపోదాము " అని సంతోషంతో కేకలు వేస్తున్నారు. ఏనుగులు, గుర్రాలు కూడా ఆనందపడ్డాయి.

మరునాడు తెల్లవారే సరికి అన్నీ అదృశ్యమయిపోయాయి.

తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయ వచ్చి భారద్వాజ మహర్షి పాదాలకి నమస్కారం చేశారు. అప్పుడు భారద్వాజుడు భరతుడిని దెగ్గరికి పిలిచి " వీళ్ళు ముగ్గురూ మీ అమ్మలు కదా, వీళ్ళల్లో ఎవరు ఎవరో నాకు చెప్తావ " అన్నాడు.


అప్పుడు భరతుడు " సుమిత్ర చెయ్యి పట్టుకొని ఉన్న ఈ అమ్మ, సింహంలా నడవగలిగినవాడు, అదితి ధాతని కన్నట్టు రామచంద్రుడిని కన్నతల్లి, మా అమ్మ కౌసల్య. వీరులు, పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్నులను కన్నతల్లి ఈ సుమిత్ర.. రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైనది, కట్టుకున్న భర్త మరణించడానికి కారణమైన దుష్టచరిత్ర కలిగినటువంటిది, ఎప్పుడూ కోరికలు కోరుతూ, క్రోధంగా ఉండేటటువంటి ఈ కైకేయ నా తల్లి " అని అన్నాడు.

న దొషెణ అవగంతవ్యా కైకెయీ భరత త్వయా |
రామ ప్రవ్రాజనం హ్య్ ఎతత్ సుఖ ఉదర్కం భవిష్యతి ||
దెవానాం దానవానాం చ ఋ్ఇశీణాం భావితాత్మనాం |
హితమెవ భవిశ్యద్ధి రామప్రవ్రాజనాదిహ ||
అప్పుడు భారద్వాజుడు " ఈవిడ రాముని యొక్క అరణ్యవాసమునకు కారణమైన మాట వాస్తవమే. కాని రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకి, ఋషులకి రక్షణ అనేది కలగడం జెరగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్టు దేవతలు కైకేయ చేత పలికించారు. అందుచేత నువ్వు ఇంక ఎన్నడూ కైక యందు దోషం పట్టకు " అన్నాడు.

భారద్వాజుడి మాటలు విన్న భరతుడు " సరే మీరు చెప్పినట్టే ప్రవర్తిస్తాను, రాముడు ఎక్కడున్నాడో మీరు మాకు సెలవియ్యండి" అన్నాడు.

" అయితే నువ్వు ఇలా దక్షినాభి ముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే, అక్కడ ఒక ఇరుకైనటువంటి దారి వస్తుంది, అందులోనుంచి జాగ్రత్తగా ఏనుగుల్ని, గురాలని నడిపించుకుంటూ వెళ్ళితే, అక్కడ చిత్రకూట పర్వతం మీద, మందాకినీ నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు " అని భారద్వాజ మహర్షి చెప్పారు. 


అందరూ భారద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవడానికి బయలుదేరారు. ఈలోగా ఆ చిత్రకూట పర్వతం దెగ్గర రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకి చూపిస్తూ " సీతా! నువ్వు లక్ష్మణుడు నాపక్కన ఉండగా, ఈ నదిలో స్నానం చేస్తూ, ఈ వనాలని, ఈ వనంలోని మృగాల అందాలని, ఇక్కడి పర్వతాల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు అయోధ్య జ్ఞాపకం రావడం లేదు. 14 సంవత్సరాలు చిటికెలో గడిచిపోతాయి అనిపిస్తుంది " అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు, తాను వేటాడి తీసుకువచ్చిన జంతువు మాంసాన్ని కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, ఇది చాలా బాగుంది, సీతా నువ్వు కూడా తిను అన్నాడు. అలా తాను తెచ్చిన మాంసాన్ని సీతారాములు భుజిస్తుండగా, చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నావదినలని సంతోష పెట్టానని, వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు.


రాముడి దర్శనం చేసుకోవాలని భరతుడు వేగంగా ముందుకి వెళుతున్నాడు. అప్పుడు ఆయనకి కొంత దూరంలో పొగ కనిపించింది, అలాగే చెట్లకి గుడ్డలు కట్టి ఉన్నాయి. లక్ష్మణుడు రాత్రి పూట మందాకిని నుంచి నీరు తెచ్చేటప్పుడు దారి మరిచిపోకుండా ఉండడానికి ఇలా చెట్లకి గుడ్డలు కట్టడాని భరతుడు గ్రహించాడు. ఇంక రాముడు ఎంతో దూరంలో లేడని భరతుడు ఆ ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు.

మనం పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి*

మనం పుణ్యకార్యాలు ఎందుకు చేయాలి*

ఒక వ్యక్తి జీవించి ఉన్నంత వరకు బంధాలు బాధలు ఉంటాయి...
ఎలా అంటే ఒక దీపం వెలిగేటప్పుడు దానికి చమురు (నెయ్యి లేదా నూనె) కావాలి,
ఎక్కువ గాలి ఉండకూడదు, అలా అని అస్సలు గాలి లేకుండా కూడా ఉండకూడదు.. ప్రతిదీ దానికి ప్రాణ సంకటమే ...
అదే ఇక సారి దీపం ఆరిపోతే ఇక దానికి గాలితో కానీ చమురుతో కానీ దేనితో పని లేదు..
అక్కడితో దాని కధ ముగిసింది అని అర్థం ...

అలాగే ఒక వ్యకి జీవించి ఉన్నంత వరకు ప్రతిదీ కావాలి , ప్రతీది అవసరమే ...
ఒక సారి జీవం పోగానే ఈ ప్రాపంచిక విషయాలు బంధాలు అవసరం లేదు,

వారు చేసిన పుణ్యం తప్ప ఏది కూడా ఉండదు, 
ఎవరు వెంట కూడా వెళ్ళలేరు,
అక్కడితో ఆ వ్యక్తి కధ ముగిసినట్టే,...

*దీనిని పట్టి మనకు అర్థం ఏమవుతుందంటే ... ఈరోజు మనం పెంచుకున్న బంధాలు, ప్రేమలు, కోపాలు , తాపాలు, అన్ని అశాశ్వతమైనవే, కేవలం మనము చేసిన సేవనే మన వెంట వస్తుంది అని అర్థమవుతుంది, కాబట్టి నిత్యం మనం , పుణ్యకార్యాలు చేయాలి అని పురాణ వచనం🙏*

*మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం !!*_

_*అవగాహనే మనసుకు మంచి మందు. అవగాహన అంటే మనసుకు విషయం సంపూర్ణంగా, సమగ్రంగా, సమూలంగా అర్ధంకావడం. మనకు బాల్యం నుండి మనసును పోల్చుకోవడం, పోటీపడటం అలవాటుగా మారింది. అదే అలవాటుతో దేవుడు, సాధన, ముక్తి వంటి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మనసు పోల్చుకోవడం, పోటీ పడటం చేస్తోంది. నిజానికి మన జీవనం సాఫీగా సాగటానికి ఎవరితోనూ పోటీ పడక్కర్లేదు. మనతో మనం సక్రమంగా ఉంటే సరిపోతుంది. మన గుణాలను దాటటానికి, ప్రవృతిని మార్చుకోవడానికి అనుదినం మనతో మనమే పోటీపడాలి. మనలో వచ్చే మార్పే శాంతికి సోపానం. మనలో ఆధ్యాత్మిక ఎదుగుదలకు శాంతే కొలమానం. దీన్ని ఎవరినీ అడిగి తెలుసుకోవాల్సిన పనిలేదు. మనం నిత్యజీవితంలో ఎంత శాంతిగా ఉంటున్నాం, ఎన్ని విషయాల్లో శాంతిగా ఉంటున్నామనేది ఎవరిది వారికే తెలిసే విషయం !*

Wednesday, April 29, 2020

రాహుకాల నిమ్మకాయల దీపం................!!

రాహుకాల నిమ్మకాయల దీపం................!!

నిమ్మకాయ దీపం అనేది కుజదోషం,కాలసర్ప దోషం, వ్యాపార, కుటుంబ, ఆర్ధిక భాదలతో సతమతం అయ్యే వారికి చక్కని తరుణోపాయం.

 ఈ నిమ్మకాయ దీపారాధన వలన శక్తి స్వరుపినైన అమ్మవారు అనుగ్రహించి ఈతి భాదలను తొలగిస్తుంది.
నిమ్మకాయలంటే శక్తి స్వరూపిణి పార్వతి దేవికి చాలా ఇష్టం . 

నిమ్మకాయలతో చేసిన దండను పార్వతి దేవికి ...గ్రామ దేవతలైన మైసమ్మ , ఎల్లమ్మ ,పోచమ్మ ,  మారెమ్మ,పెద్దమ్మ, మొదలైన శక్తి దేవి అవతారాలకు మాత్రమే వేస్తారు.గ్రామ దేవతల దేవాలయాల్లో ఈ నిమ్మకాయల దీపం వెలిగించాలి.
ఎటువంటి పరిస్థితుల్లోనూ మహాలక్ష్మి , సరస్వతి మరియు ఇతర దేవాలయాల్లో ఈ నిమ్మకాయ దీపాలను వెలిగించకూడదు .

ఒక వేళ వెలిగిస్తే ఆ ఇంట సంతోషం ఉండదు .సంసారం లో ఎప్పుడు గొడవలు ఉంటాయి , ఆర్ధిక వ్యవహారాల్లో నష్టం కలుగుతుంది ,భార్య భర్త , పిల్లలు ,స్నేహితులు,బంధువుల మధ్య తగాదాలు ఎక్కువ అవుతాయి.

పార్వతి దేవాలయాల్లో నిమ్మకాయలతో చేసిన దీపాలను దేవి వారాలుగా పరిగిణించే  మంగళవారం,శుక్రవారాల్లో రాహుకాల సమయాలలో మాత్రమే వెలిగించాలి.
మంగళవారం రాహుకాలం మధ్యాహ్నం
3 గంటల నుండి 4:30 గంటల వరకు ...
శుక్రవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యహ్నం 12 గంటల వరకు .
మంగళవారం వెలిగించే దీపాల కన్నా శుక్రవారం వెలిగించే దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది . ఎందుకంటే మంగళ వారం వెలిగించే దీపం రజోగుణం కలిగి ఉంటుంది. శుక్రవారం వెలిగించే దీపం సత్వ గుణాన్ని కలిగి ఉంటుంది.

శుక్రవారం రోజు దేవికి వెలిగించే దీపం మనస్సుకు ప్రశాంతతను కలిగిస్తుంది .

శుక్రవారం రోజు దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగించి పెరుగు అన్నం,లేదా పెసరపప్పు ,లేదా పానకం లేక మజ్జిగ లేక
పండ్లను దేవికి నైవేద్యము పెట్టి తరువాత సుమంగళికి ఇవ్వాలి.

కుదిరితే పసుపు , కుంకుమ , పూలు , గాజులు, జాకెట్టు ముక్క ,చీరలు ఇస్తే దేవికి చాలా ఇష్టం .
తాంబూలం దానం మరియు శక్తికి తగినట్లుగా దక్షిణ ఇచ్చి సుమంగళికి నమస్కారం చేయాలి.ఇలా చేస్తే తలచిన కార్యాలు ఎటువంటి ఆటకం లేకుండా శుభప్రదంగా త్వరగా నెరవేరతాయి.
నిమ్మకాయల దీపం వెలిగించేటప్పుడు గమనించవల్సిన అంశాలు:-
మచ్చలు లేని వాడిపోని తాజా నిమ్మకాయలను ఆకుపచ్చని రంగుతో ఉన్న వాటిని ఉపయోగించాలి.
బహిష్టు సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు .

మహిళలు 4వ రోజు తల స్నానం చేసి 5 వ రోజు స్నానం చేసి నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు .
మైలతో ఉన్నప్పుడు కూడా నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు.
ఇంట్లో పండుగ సమయం ,పెద్దల తిధి కార్యాలు ఉన్న రోజున నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు .
పిల్లల పుట్టిన రోజునాడు ,పెళ్లి రోజున గాని నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు .

అంటే నిమ్మకాయ దీపంతో పాటు ప్రమిద దీపం వెలిగించకూడదు .
వేరే ఊరు వెళ్లినప్పుడు మిత్రుల మరియు బంధుల ఇంట్లో నిమ్మకాయల దీపాలను వెలిగించకూడదు .
ఆడపిల్లలు ,అక్క ,చెల్లిళ్ళ ఇంటికి లేదా పుట్టింటికి వెళ్లినప్పుడు నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదు.
స్త్రీలు పట్టుచీర కట్టుకొని దేవికి నిమ్మకాయల దీపాన్ని వెలిగిస్తే త్వరగా దేవి అనుగ్రహం కలిగి అన్నీకార్యాలు ఎలాంటి లోపాలు లేకుడా జరిగిపోతాయి .

చీర ఎరుపు,పసుపు రంగు కలిగినవి వాడుతే మరి మంచిది.
స్త్రీలు మామూలు చీరలు ధరించి నిమ్మకాయల దీపాలను వెలిగిస్తే వారి కార్యాలకు మధ్యమ స్థాయి ఫలితాలు లభిస్తాయి .
పొరపాటున కూడా గంజి వేసిన బట్టలను ధరించి పూజలు చేయరాదు.
ఆధునిక వస్త్రధారణతో నిమ్మకాయ దీపాలు వెలిగిస్తే ఫలితం లభించదు.
దీపం క్రింద తమలపాకు,లేదా ఏదేని ధాన్యపు గింజలను వేసి కుంకుమ బొట్టు పెట్టి దీపారాధన చేయాలి.
నిమ్మకాయ దీపం వెలిగించిన తర్వాత మైసాక్షి ,లోబాన్ ,సాంబ్రాణి పొగ దూపం తప్పక వేయాలి .

పూజకు ఎర్రని పూలనే ఉపయోగించాలి.
బెల్లంతో చేసిన పరమాన్నం నైవేద్యం పెట్టాలి.

Tuesday, April 28, 2020

భక్తి - భగవంతుడు..

భక్తి  -  భగవంతుడు..

పూర్వం ఒక ఊరిలో అయోద్యుడు అనే బద్దకస్తుడు ఉండేవాడు. ఏపని చేసేవాడు కాదు. తినడం తిరగడం.. ఇంతకుమించి ఏపని రాదు. పైగా అమాయకుడు. ఇంట్లో వారు భరించలేక ఏదన్నా ఆశ్రమం చూసుకొని వెళ్ళమన్నారు. 

సరేనని ఏదన్నా  ఆశ్రమంలో చేరడానికి బయలుదేరి చాలా ఆశ్రమాలు చూశాడు. ఎక్కడా నచ్చలేదు. చివరకు ఓ ఆశ్రమానికి వచ్చాడు. ఆ  ఆశ్రమంలో గురువుగారు కొద్దిగా లావుగా ఉన్నారు. 
ఆహా ఇక్కడ భోజనం బాగాదొరుకుతుందనుకుంటా ..
గురువుగారు బాగా లావుగా ఉన్నారుఅనుకున్నాడు. 

ఇంతలో శిష్యులు వచ్చారు. వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు. అయితే సందేహం లేదు ఇక్కడ చేరితే మూడుపూటల భోజనం దొరుకుతుంది అనుకోని గురువుగారి పాదాల మీద పడి ఇక్కడే ఉండిపోతానన్నాడు. సరే అన్నాడు గురువుగారు. 

అయితే నాకు మూడుపూటల భోజనం కావాలి అన్నాడు అయోద్యుడు.  నాయనా! చక్కగా సేవ చేస్తూ రెండుసార్లు మాత్రమె ఇక్కడ భోజనం తీసుకోవాలి అన్నారు. కాదు గురువుగారు నేను ఆకలికి ఉండలేను అన్నాడు. సరే ఉదయం ప్రసాదం కొద్దిగా ఎక్కువ తిను అంటే సరేనన్నాడు.

ఏదో తెలిసిన సేవ చేస్తూ చాలీచాలని ఆహారం తింటూ ఉండగా  ఒక రోజు ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఉపవాసం ఉండాలి అన్నారు గురువుగారు.  అమ్మో ఉపవాసం నావల్ల కాదు గురువుగారు... ఉండలేను అన్నాడు  ఈ శిష్యుడు. సరే అయితే ఇక్కడికి దూరంగా ఉన్న చెరువు వద్దకి వెళ్లి వండుకుతిను. కావాలంటే సరంజామా నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు గురువుగారు. 

సరేనని సరంజామా తీసుకున్నాడు శిష్యుడు. నాయనా వండిన ఆహారం స్వామికి నైవేద్యం పెట్టి ఆ తరువాతే నువ్వు తినాలి సరేనా. అని గురువుగారు అనగా అలాగే గురువుగారు అని వెళ్లి చెరువు దగ్గర చెట్టు క్రింద వంట చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి..ఇలా పిలిచాడు

రాజా రామ్ ఆయియే, రఘురామ్ ఆయియే.. ముఝే భూక్ లాగాయియే అంటూ పాడడం మొదలు పెట్టాడు. ఎంతకీ స్వామి రాడే.. (ఇతని ఉద్దేశ్యం లో స్వామివారే స్వయంగా వచ్చి తింటారని అనుకుని ఎదురుచూస్తూ ఉన్నాడు. అంతటి అమాయకుడు అయోద్యుడు.. కపటం, కంఫ్యూషన్ లేదు మనస్సులో)  ఎంతకీ రాకపోయేసరికి బాగా ఆలోచించి ఇలా అన్నాడు .
 
"దేవాలయంలో అయితే ప్రసాదాలు, నైవేద్యాలు పెడతారు...ఇక్కడ ఏముంది.. కుదిరి కుదరని వంట తప్ప"  అక్కడైతే బాగా పెడతారని అనుకుంటున్నావేమో స్వామీ.. ఈరోజు ఏకాదశి అక్కడ ఏమి ఉండదు. ఏమి పెట్టరు. ఇక్కడికి కూడా రాలేదనుకో ఇది కూడా ఉండదు..అని మళ్ళీ పాడడం మొదలు పెట్టాడు. ఇది కూడా అయిపోతుందని.. శ్రీరాముడు నవ్వుకుని ఉండబట్టలేక సీతాసమేతంగా వచ్చాడు.

శ్రీరాముడిని చూశాడు సంతోషించాడు. కానీ పక్కనే సీత ఉంది. సీత వంక ప్రసాదం వంక పదేపదే చూస్తూ ఉండగా..  శ్రీరాముడు మేము వచ్చాము సంతోషమేగా అంటే...అయోద్యుడు  సీత వంక చూస్తూ ఆ ఆ సంతోషమే.. నాచేత ఇవాళ  ఏకాదశి ఉపవాసం చేయించాలనుకున్నట్లు ఉన్నారు. రండి కూర్చోండి అని ఇద్దరికి వండిన ఆహారం పెట్టాడు. చక్కగా భోజనం చేసి సీతారాములు వెళ్లిపోయారు. అయోద్యుడు ఆ రోజు ఉపవాసం తోనే ఉండిపోయాడు.

కొన్ని రోజులు గడిచాక మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు అయోద్యుడికి   మొన్న ఇచ్చినట్లే ఈసారి కూడా కిలో బియ్యం పప్పులు దినుసులు ఇచ్చారు. అప్పుడు.. గురువుగారు ఇవి సరిపోవడం లేదండి... ఇద్దరొచ్చారు ఇంకాస్త కావాలి అంటే.. వీడికి సరిపోతున్నట్లు లేదు ఇంకో కేజీ ఇచ్చి పంపండి అని శిష్యులతో  గురువుగారు చెప్పారు.   యధావిధిగా  అయోద్యుడు అక్కడకు  వెళ్లి వంట చేసి.. నైవేద్యం పెట్టి,.. మొన్న ఇద్దరు వచ్చారు కదా.. అందుకని ఇలా పిలిచాడు.

రాజారామ్ అయియే, సీతారాం ఆయియే మేరా భోజన్ కో భోగ్ ధరాయియే అంటూ పాడాడు. ఈసారి సీతారాముల తో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. ఈసారి లక్ష్మణుడు వంక ..భోజనం వంక.. చూస్తూ ఉండగా.. శ్రీరాముడు.. మేము వచ్చాము నీకు సంతోషమేగా అంటే లక్ష్మణుడి వంక.. భోజనం వంక..చూస్తూ ఆ సంతోషమే స్వామి అంటూ ఈ వారం కూడా నాకు ఉపవాసమే  అనుకుంటూ... రండి కూర్చోండి అన్నాడు. భోజనం పెట్టాడు .వారు ముగ్గురు తిన్నారు వెళ్లారు. 

మళ్ళీ ఏకాదశి వచ్చింది. అయోద్యుడు  గురువుగారితో ఇది కూడా సరిపోదండి ముగ్గురు వచ్చారు అన్నాడు. వీడు రాత్రికి  కూడా తింటున్నాడేమో అనుకోని మరో కేజీ   అదనంగా  ఇచ్చి పంపారు. మళ్ళీ వండాడు. ఈ సారి పాట మార్చి పాడాడు.. రాజారామ్ ఆయిఏ, సీతారాం అయిఏ, లక్ష్మణ్ సాత్ అయిఏ మేరా భోజన్ కో భోగ్ ధరాయిఏ..అంటూ పిలిచాడు

ఈ సారి సీతారాములు, లక్ష్మణుడు వచ్చారు. వీళ్ళతోపాటుగా హనుమాన్ వచ్చాడు. మేము వచ్చాము. నీకు ఆనందమేగా అని అడిగారు. ఆ..ఆ.. ఆనందమే కానీ అంటూ హనుమాన్ వంక..భోజనం వంక ..చూసిఈఏకాదశికి కూడా నాకు ఉపవాసమే...
అనుకుంటూ  రండి కూర్చోండి అని వడ్డించాడు. 

అందరూ కూర్చొని తృప్తిగా తినేసి వెళ్లిపోతూ ఉండగా స్వామి ఏమనుకోనంటే ఒకమాట అడగవచ్చా? ఈసారి ఎంతమంది వస్తారు? నేను వంట చేయటానికి అని అనగా శ్రీరాముడు నవ్వి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు..

మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు..ఈసారి రవ్వ 10కిలో, బియ్యం పదికిలో, పచారి పదికిలో కావాలి అన్నాడు అయోద్యుడు. గురువుగారికి వీడేమైనా అమ్ముకుంటున్నాడా అనే సందేహం వచ్చినా..వాడు అడిగింది ఇచ్చి తరువాత చుద్దాం ఏమి చేస్తున్నాడో అని శిష్యులతో వాడు ఆడిగినవి ఇచ్చి పంపండి  అన్నాడు. 

అలాగే గురువుగారి ఆజ్ఞప్రకారం  అన్నీ  పది కిలోల చొప్పున ఇచ్చి పంపి ..గురువుగారి దగ్గరికి వచ్చారు శిష్యులు. వీడు అమ్ముకుంటున్నట్లు ఉన్నాడు.. ఎక్కడ అమ్ముతున్నాడు? ఏదుకాణంలో అమ్ముతున్నాడు...?చుద్దాం పదండి అని గురువుగారి తో  సహా 
శిష్యులు అయోద్యుడికి   వెనుక బయలుదేరారు.

ఎప్పటిలానే అయోద్యుడు చెరువు దగ్గరకు వెళ్లి సామాను అంత అక్కడ పడేసి చెట్టుక్రింద కూర్చొని రాజారామ్ అయిఏ, సీతారాం ఆయిఏ, లక్ష్మణ్ సాత్ అయిఏ, హనుమాన్ సాత్ ఆయిఏ మేరా భోజన్ కో భోగ్ ధరాయిఏ.. అని పాట పాడాడు. 

ఈసారి సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్,భరత శత్రుఘ్నులు, కౌశల్య సుమిత్ర కైకేయి సపరివారమంతా వచ్చేశారు. అయోధ్యా మేమొచ్చేశాం సంతోషమేగా.. ప్రసాదం ఏది ఎక్కడుంది? అని అడిగాడు శ్రీరాముడు. 

అప్పుడు అయోద్యుడు.. ఎప్పుడూ నేను వండితే మీరు తినేసి వెళ్లిపోతున్నారు. కొద్దిగా కూడా ఉంచడం లేదు. నాచేత నాలుగు ఏకాదశి ఉపవాసాలు చేయించారు. ఈసారి మీరే వండండి.. సామానంత అక్కడే ఉంది అన్నాడు... శ్రీరాముడు నవ్వి సరేనని.. శ్రీరాముడు కూరగాయలు కొస్తూ ఉన్నాడు. సీతమ్మ పొయ్యి దగ్గరకి వెళ్ళింది. లక్ష్మణుడు హనుమంతుడు కట్టెలు తెచ్చారు. ఇలా అందరూ తలా ఓపని చేస్తూ ఉండగా.. సీతమ్మ వంట వండుతుందని తెలుసుకొని దేవతలు, ఋషులు, గంధర్వులు వరసగా వస్తూ ఉంటారు. కోలాహలంగా తయారయింది ఆ ప్రదేశం అంతా.. 

ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చి. అక్కడి సన్నివేశం చూస్తే సామాను పక్కన పడేసి అయోద్యుడు చెట్టుకింద పడుకొని కనబడతాడు. వెంటనే గురువుగారు వచ్చి " అయోధ్యా! ఏంటి సామానంత అక్కడ పడేసి చెట్టుక్రింద పడుకున్నావ్" అనగానే.. అదేంటి గురువుగారు సీతారాములు, లక్ష్మణుడు హనుమంతుడు కౌశల్య సుమిత్ర కైకేయి అందరూ కలిసి వంట చేస్తున్నారుగా అంటే ఆశ్చర్యంతో ఎక్కడ ..నాకేం కనబడడం లేదు అన్నారు గురువుగారు.

అయోద్యుడు శ్రీరాముడిని చూసి మీరు మాగురువుగారికి కనబడడం లేదట కనిపించండి. లేదంటే నామీద సందేహం వస్తుంది అనగా శ్రీరాముడు అలానే అని సపరివారసమేతంగా గురువుగారి కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు. గురువుగారు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉండగా అయోద్యుడ్ని కౌగలించుకొని ఎన్నో ఏళ్లుగా పూజలు చేస్తున్న నాకు దర్శన భాగ్యం కలుగలేదు.

 నీవు  అమాయకంగా, నీ మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండబట్టి ఆ భగవంతుడు సాక్షాత్కరించాడు. నీవల్ల మేము ధన్యులమయ్యాం అన్నాడు.. 

భగవంతుడు రాడేమో అని, పూజలు ఎలా చేయాలి ?ఎన్ని వత్తులు వేయాలి? అంటూ, కొన్నాళ్ళు.. విపరీత భక్తితో, కొన్నాళ్ళు విరక్తితో, మరొకొన్నాళ్లు చిరాకుతో ఏదో ఇష్టం వచ్చినట్లు కంఫ్యూషన్ మైండ్ తో, గందరగోళంగా పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. చేయాలా వద్దా! ఎలా చేయాలి.. ఈరోజు పనులున్నాయి. ఈరోజు మనసు బాగోలేదు. ఇలా ఏదో వంకతో సాకుతో పూజలు ఎగ్గొట్టేస్తూ ఉంటారు కొందరు.

ఇలాంటివారికి జీవితాంతం గందరగోళం తప్ప భగవంతుడి సాక్షాత్కారం కలుగదు. పూజ గాని, జపం గాని, తపస్సు గాని, ధ్యానం యాగాదులు ఏదైనా సరే నిలకడ లేకుండా జీవితకాలం చేసినా ఏమాత్రం ఉపయోగం ఉండదు. స్వచ్ఛమైన, నిర్మలమైన మనస్సుతో చేస్తే తక్షణం పరమాత్ముడు దర్శనం ఇస్తాడు. ఏ మాత్రం సందేహం లేదు. 

అయోద్యుడు, భక్తకన్నప్ప, భక్తతుకారాం ఈ కోవకి చెందినవారే. ఏమి పెట్టినా, ఎలా పెట్టినా మారుమాట్లాడకుండా స్వచ్ఛమైన నిర్మలమైన భక్తికి వశమైపోయాడు.

వైశాఖ పురాణం 8 వ అధ్యాయము వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయము :-నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

వైశాఖ పురాణం 8 వ అధ్యాయము

                                 వైశాఖ పురాణం 

ఎనిమిదవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                      
                                 పిశాచ మోక్షము

పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన, ఆకలి దప్పికలచేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాలకూట విషమువలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపైనుండి ఆకలిదప్పికల బాధను భరింపలెక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి అబ్బురపడితిని. ఇదేమి యద్భుతమా యని అనుకొంటిని.

పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియు చేయజాలకపోయెను. నేనును వానిని జూచి జాలిపడి ఓయీ భయపడకుము. నీకు నావలన నేభయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్నీ కష్టముండి విడిపింతునని పలికితిని. నేనతని పుత్రుడనని యతడు గుర్తింపలేదు. నేనును నా తండ్రియని గుర్తింప లేకపోతిని. అప్పుడా పిశాచ రూపమున నున్న యతడిట్లు పలికెను. నేను భూవరమను పట్టణమున వసించు మైత్రుడనువాడను. సంకృతి గోత్రమువాడను. అన్ని విద్యలను నేర్చినవాడను. అన్ని తీర్థములయందు స్నానము చేసినవాడను. సర్వదేవతలను సేవించినవాడను. కాని నేను వైశాఖమాసమున కూడ అన్నదానమెవరికిని చేయలేదు. లోభము కలిగియుంటిని అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైన యీయలేదు. కావున నాకీ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా యీ దురవస్థకు కారణము. శ్రుతదేవుడను పుత్రుడు నాకు కలడు. అతడు ప్రసిద్దికలవాడు. వైశాఖమున గూడ అన్నదానము చేయకపోవుటచే నేనిట్లు పిశాచరూపము నందితిననియు, నేనిట్లు బాధపడుచున్నానియు వానికి చెప్పవలయును. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచమై యున్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై నున్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖమాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము నిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానము చేసినచో నేనీ బాధనుండి విడిపోయి శ్రీమహావిష్ణు సాన్నిధ్యమునందుదును. కావున ఆ విధముగ చేయుమని వానికి చెప్పుము. నాయందు దయయుంచి నాకీ సాయమును చేయుము. నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము. అనుచు నా పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖ పీడితుడనై చిరకాలముంటిని. నన్ను నేను నిందించుకొంటిని. కన్నెరు విడుచుచుంటిని. తండ్రీ నేనే శ్రుతదేవుడను. దైవికముగ నిచటకు వచ్చినవాడను. తండ్రీ! యెన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు నిరర్థకములు. నీకీ బాధనుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలయునో చెప్పుమని ప్రార్థించితిని.

అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంత సేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరచుకొని యిట్లనెను. నాయనా! నీవు తలచిన యాత్రలను పూర్తిచేసికొని యింటికి పొమ్ము. సూర్యుడు మేషరాశియందుండగా, వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీమహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నాకే కాదు మనవంశము వారందరికిని ముక్తి కలుగును. కావున అట్లు చేయుమని చెప్పెను.

నేనును నా తండ్రి యజ్ఞననుసరించి యాత్రలను చేసి నా యింటికి తిరిగి వచ్చితిని. మాధవునకు ప్రీతికరమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగ శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన యన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చితిని. అందువలన నా తండ్రి పిశాచ రూపమునుండి విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి యాశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమును చేరి యచట శాశ్వత స్థితినందెను.

కావున అన్నదానము అన్ని దానములలో ఉత్తమము. శాస్త్రములయందును యిదియే చెప్పబడినది. ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా! నీకింకేమి కావలయునో అడుగుము చెప్పెదనని శ్రుతదేవుడు  శ్రుతకీర్తి మహారాజునకు వివరించెను.

ఈ విషయమును నారదమహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను.

వైశాఖ పురాణం ఎనిమిదవ అధ్యాయము సంపూర్ణము

         🙏🙏 సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము వైశాఖ పురాణం ఏడవ అధ్యాయము :-నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ || వైశాఖమాస దానములు

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము

                                   వైశాఖ పురాణం 

ఏడవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                            వైశాఖమాస దానములు

అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగుగ వినుమని యిట్లు వివరింపసాగెను.

రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యధోచితములగు శుద్ది, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృ శ్రాద్దము మానకుండుట, వైశాఖవ్రతాచరణము యివి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మముల నాచరింపనివానికి ముక్తి లేదు.

సర్వధర్మములయందును వైశాఖవ్రత ధర్మముత్తమము సాటిలేనిది. రాజులేని రాజ్యప్రజలవలె పెక్కు ధర్మములున్నవి. కాని అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును. సుఖసాధ్యములు కావు. వైశాఖధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకువలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణములవారికి, అన్ని ఆశ్రమములవారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను యిచ్చుట, మార్గమున చెట్లనీడలో చలివేండ్రము నేర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకఱ్ఱలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగ మార్గముల యందు బావులు, దిగుడుబావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడిపండ్ల రసము, దోసపండ్ల రసము దానముచేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము(పానకము) పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురుకొమ్మలదానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను.

ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలయును. శ్రీమహావిష్ణు పూజ తరువాత విష్ణుకథాశ్రవణము చేయవలయును. అభ్యంగస్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకఱ్ఱతో విసరుట, సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణుపూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట ధూపదీపముల సేవ, గోవులకు ప్రతి దినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట, ముఖ్యకర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశలప్రశ్నలడిగి వలసిన ఆతిధ్యము నీయవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణుపూజ, విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట దధ్యన్ననివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును. అఖండ పుణ్యమునిచ్చును.

పుష్పములతో శ్రీమహావిష్ణువు నర్చింపక, విష్ణుకథాశ్రవణము చేయక వ్యర్థముగ కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు. శ్రీమహావిష్ణువు వివిధరూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగ మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అట్తి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూడుఢు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదుమార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకొన్న వారు యధాశక్తిగ వైశాఖవ్రతము నాచరించుచు ఆకలిగలవారి కన్నమును, దప్పిక కలవారికి జలమును యీయవలెను. జలము, అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీమహావిష్ణువు. సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును సర్వసుఖ భోగములను, సంపదలను, కలిగించి ముక్తినిచ్చును. జల దానము చేయనివారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయనివారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా!

వైశాఖ పురాణం ఏడవ అధ్యాయము సంపూర్ణము

వైశాఖ పురాణం 5 వ అధ్యాయము వైశాఖ పురాణం అయిదవ అధ్యాయము :-నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

వైశాఖ పురాణం 5 వ అధ్యాయము
    
                                 వైశాఖ పురాణం 

అయిదవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                   
                            వైశాఖమాస విశిష్టత

నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము యితర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగ అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటె నుత్తమమైనదో వివరింపగోరుచున్ననని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను. మహారాజా! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన యుదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను.జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్పొలిపినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన యుదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన యుదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు పదునాలుగు భువనములను కూడ సృష్టించెను. భిన్నవిభిన్నములగు కర్మల నాశ్రయించిన వివిధ ప్రాణులను వారి కర్మ ఫలానుకూలములగు త్రిగుణములను, ప్రకృతిని మర్యాదలను రాజులను, వర్ణాశ్రమ విభాగములను, ధర్మ విధానమును సృజించెను. పరమేశ్వరుడగు శ్రీమన్నారాయణుడు తన యాజ్ఞారూపములుగా చతుర్వేదములను, తంత్రములను, సంహితలను, స్మృతులను, పురాణేతిహాసములను, ధర్మరక్షణకై సృష్టించెను. వీనిని ప్రవర్తింపజేయుటకై ఋషులను కూడ సృజించెను.

ఋషులు ఆచరించి ప్రచారము చేసిన వర్ణాశ్రమ ధర్మములను తమకు దగినట్లుగా ప్రజలాచరించుచు సర్వేశ్వరుడగు శ్రీమహావిష్ణువునకు సంతోషము కలుగునట్లుగా ప్రవర్తించుచుండిరి.

సర్వోత్తమములగు తమ తమ వర్ణాశ్రమ  ధర్మములనాచరించు ప్రజలను వారి ధర్మాసక్తిని, ధర్మాచరణమును తాను స్వయముగ చూడవలెనని భగవంతుడు తలచెను. అప్పుడీ విధముగ నాలోచించెను. తాను సృష్టించిన వర్షాకాలము వర్షముల వలన బాధలుండుటచే పీడితులగు ప్రజలు ధర్మాచరణము సరిగ చేయలేరు. అట్టివారిని చూచిన తనకు తృప్తి కలుగదు. సరికదా కోపము కూడ రావచ్చును. కావున వర్షాకాలమున ప్రజల ధర్మప్రవర్తనను పరిశీలించుట తగదు. శరత్కాలమున వారి కృషి వ్యవసాయము పూర్తి కాదు. కొందరు అప్పుడే పండినపండ్లను తినుచుందురు. నేత్ర వ్యాధులు చలి మున్నగువానిచే పీడింపబడుచుందురు. ఇట్టి పరిస్థితిలో వారి ధార్మిక ప్రవృత్తిని పరిశీలింప జూచుట యుచితముకాదు. వ్యగ్రులై యేకాగ్రతలేనివారిని చూచినచో నాకేమి సంతోషము కలుగును? హేమంత ఋతువున చలిమిక్కుటముగ నుండుటచే జనులు ప్రాతఃకాలమున లేచి సూర్యోదయమునకు ముందుగ లేచి స్నానాదికములను ముగించుకొనజాలరు చలిగాలికి చిక్కి ప్రాతఃకాలమున లేవనివారిని జూచినంతనే నాకు మిక్కిలి కోపము వచ్చును. నేను సృష్టించిన ప్రజలపై నాకు కోపము వచ్చిన వారికి శ్రేయస్కరముకాదు. శిశిరఋతువున ప్రజలను చూడబోయినచో నెట్లుండును? చలిమిక్కుటముగ నుండు ఆ కాలమున ప్రజలు సూర్యోదయమునకు ముందుగ లేవజాలరు. ఆ కాలమున తమకు కావలసిన ఆహారమును వండుకొనుటకును సోమరులై పండిన పండ్లను తినుచుందురు. అనగా సులభముగా లభ్యములగు ఆహారముల కిష్టపడుచుందురు. చలికి భయపడి స్నానమునే మానివేయు స్వభావము కలిగి యుందురు. స్నాన విముఖులైన వారు చేయకలిగిన సభక్తికమైన కర్మకలాప మెట్లుండును? ఈ విధముగ జూచినచో వర్షాకాలము నుండి శిశిరము వరకు నుండు కాలమున వివిధములైన ప్రాక్తనకర్మలకు లోబడిన ప్రకృతి వివశులైన ప్రజలనుండి భక్తి పూర్వక కర్మ ధర్మానుష్ఠానమును ఆశింపరాదు. వసంత కాలము స్నానదానములకు, యాగభోగములకు, బహువిధ ధర్మానుష్ఠానమునకును అనుకూలమైన కాలము మరియు ప్రాణధారులకు ఆవశ్యకములగు ఆహార పదార్థములు సులభముగ లభ్యములగును. సులభమైన యే వస్తువు చేతనైనను తృప్తినంద వచ్చును. ఈ విధముగనైనచో సర్వప్రాణిగతమైన జీవాత్మకును యేదో ఒక విధముగ నీటిని, పండ్లను దానము చేసిన సంతృప్తిని కలిగించి ఆ విధముగ సర్వవ్యాపినగు నాకును సంతృప్తిని కలిగించు నవకాశము ప్రజలకు సులభసాధ్యమై యుండును. కర్మిష్ఠులగు భక్తులెల్లప్పుడును కర్మపరాయణులై ధర్మవ్రతము నాచరింతురు. అది చేయలేనివారికి వసంతకాలము కర్మ ధర్మానుష్ఠానములకు తగినది. వసంతకలమున సర్వవస్తువులును సులభసాధ్యములగుటచే ధర్మకర్మల యనుష్ఠానము దాన ధర్మ భోగములకు యుక్తమైన కాలము. నిర్ధనులు, అంగవైకల్యము కలవారు, మహాత్ములు మున్నగు సర్వజనులకును, నీరు మొదలగు సర్వపదార్థములు సులభములగును. దానధర్మాదులకు ప్రజలు కష్టపడనక్కరలేదు. పత్రము, పుష్పము, ఫలము, జలము, శాకము, పుష్పమాల, తాంబూలము, చందనము, పాదప్రక్షాళనము వీనిని దానము చేయవచ్చును. దానము చేయునప్పుడు వినయము భక్తి మున్నగు గుణములుండ వలయును. దానము పుచ్చుకొను వ్యక్తి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువను భక్తి భావన ముఖ్యము. అట్టి భావనలననేవిలువకట్టరానంత పుణ్యము నిత్తును.

అని భక్తసులభుడు దయాశాలియనగు శ్రీమహావిష్ణువు ఆలోచించి శ్రీ మహాలక్ష్మితో కలసి లోక సంచారమునకై బయలుదేరెను. పుష్పఫలపూర్ణములగు అడవులను, పర్వతములను లతాతరువులను, జలపూర్ణములైన నిర్మలప్రవాహముకల నదులను, తుష్టి, పుష్టి కల ప్రజలను చూచును. ఉత్తమములగు మునులయాశ్రమములను, అందున్న ధర్మ కర్మానుష్ఠాన పరులగు మునులను, వనగ్రామ నగరవాసులై భక్తి యుక్తులైన జనులను, పవిత్రతను అందమును కలిగించు ముగ్గులు మున్నగువానితో నొప్పు యిండ్ల ముంగిళ్లను, ఫలపుష్పాదులతో వ్రతములనాచరించు భక్తులతో నిండి సందడిగనున్న తోటలను, శ్రీమహావిష్ణువు లక్ష్మీ సమెతుడై తిలకించును. భక్తియుక్తులై వినయాది గుణములతో వ్రతముల నాచరించు, యధాశక్తిగ దానధర్మములను చేయుచు అతిధి అభ్యాగతుల నాదరించు ధర్మాత్ములను పుణ్యాత్ములను, కర్మ పరాయణులను మహాత్ములను అందరిని జూచును. అభ్యాగతుడై, అతిధియై బహు రూపములతో వచ్చి ప్రజల ధర్మకర్మానుష్ఠానములలో పాలు పంచుకొనును. సంప్రీతుడై అఖండ పుణ్యమును, అఖండ భోగభాగ్యములను సర్వసంపదలను, తుదకు ముక్తిని స్వయముగ అడుగకనే వారి వారి భక్తియుక్తులకు దాన ధర్మములకు పూజాదికములకు సాఫల్యము నిచ్చి యనుగ్రహించును. దురాచారులు సోమరులు మున్నగువారైనను సత్కర్మల నాచరించి యధాశక్తిదాన ధర్మములను చేసినచో వారి పాపముల నశింపచేసి పుణ్యమును లేక సుఖములనిచ్చును. అట్లుకాక దుష్టులై సోమరులై నిర్లక్ష్యముగ నున్నచో నెంతతి వారినయినను యధోచితముగ శిక్షించును. కావున సోదర మానవులారా! మనమెట్టివారమైనను మన శక్తియెట్టిదైనను నిశ్చలమైన భక్తితో శ్రీమహావిష్ణువు నారాధించి యధాశక్తిగ దాన ధర్మముల నాచరించి శ్రీమహావిష్ణువు దయను పొందుట మన కర్తవ్యము. కావున చంచలమైన మనస్సును అదుపులో నుంచుకొని యధాశక్తిగ పూజ, దానధర్మములను, భక్తి వినయములతో శ్రద్దాసక్తులతో బలవంతముగనైన ఆచరించి శ్రీహరియనుగ్రహమునందుటకు ప్రయత్నించుట మన ముఖ్య కర్తవ్యము ధర్మము బాధ్యత.

ఇట్లు లోక సంచారము చేయు లక్ష్మీ సహితుడగు శ్రీమహావిష్ణువును స్తుతించుచు సిద్ధులు, చారణులు, గంధర్వులు, సర్వదేవతలు కూడ వెన్నంటి యుందురు. తమ తమ ధర్మములనాచరించుచు భక్తితో వినయముతో దాన ధర్మములను వ్రతములను చేయు, అన్ని వర్ణములవారిని, అన్ని ఆశ్రమములవారిని చూచినవారును సంప్రీతులై శ్రీమహాలక్ష్మీ సమేతుడై యింద్రాది సర్వదేవతా పరివేష్టితుడై, చైత్ర వైశాఖ జ్యేష్ఠాషాఢ మాసములయందు భూలోక సంచారము చేయుచు, శ్రద్దాసక్తులతో వ్రతములను పూజలను చేయుచు శక్త్యనుసారము దానధర్మములు చేయువారినందరిని యనుగ్రహించుచుందురు. కరికలను మించి వరముల నిత్తురు.

శ్రీహరి వైశాఖమున మత్తులై, ప్రమత్తులై వ్రతాచరణము దానధర్మాదికములు లేనివారిని, గమనించి వారిని రోగములు విచారములు మున్నగువానితో శిక్షించును. వైశాఖ మాసమున తననుగాని, పరమేశ్వరునిగాని, యితర దైవతములను సజ్జనులను పూజించినను, వీరందరి స్వరూపుడైన సర్వవ్యాపకుడైన తనను పూజించినట్లే తలచి సంతుష్టుడై వరములనిచ్చును. ఇతరమాసములయందు వ్రతాదికముల నాచరించితిమని తలచి వైశాఖవ్రతమును మానినవారిపై కోపించును. అనగా శ్రీమహావిష్ణువు వైశాఖం వ్రతము మానిన కర్మపరాయణులను గూడ శిక్షించును. వైశాఖ వ్రతము నాచరించిన పాపాత్ములనైనను రక్షించును. అనగా వైశాఖ వ్రతము శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము. ఈ వ్రతము నాచరించుటవలన శ్రీమహావిష్ణువు సర్వదేవతలు సంప్రీతులై వరముల నిత్తురు. సపరివారముగ వచ్చిన మహారాజును నగరము, గ్రామములు, వనములు, పర్వతములు, నదీ తీరములు మున్నగుచోట నివసించు జనులు దర్సించి యధాశక్తిగ తమకు తోచిన పత్రము, పుష్పము, ఫలము మున్నగు వానినిచ్చి మహాప్రభూ! తమయేలుబదిలో సుఖముగ నుంటిమి అనుగ్రహింపుమని ప్రార్థించినచో మహారాజు వారి పన్నులను తగ్గించుట, సౌకర్యములను కల్పించుట మున్నగు వానినెట్లు చేయునో అట్లే శ్రీమహావిష్ణు ప్రీతికరమైన వ్రతము నాచరించుచు సద్బ్రాహ్మణులను, అతిధులను, అభాగ్యతులను, దైవభావనతో ఉపచారములు చేసి యధాశక్తిగ దానధర్మముల నాచరించినచో శ్రీహరి సంతుష్తుడై కోరిన కోరికల నిచ్చి రక్షించును. పరివార దేవతలును శ్రీమహావిష్ణువు అనుగ్రహము నందిన వారికి తామును యధోచితముగ వరముల నిచ్చి రక్షింతురు. సపరివారముగ వచ్చిన మహారాజును దర్సింపక కానుకల నీయక యున్నచో మహారాజు కుపితుడై శిక్షించును. పరివారమును యధాశక్తిగ శిక్షింతురో అట్లే వైశాఖమాసవ్రత సమయమున వ్రతము నాచరించి యధాశక్తిగ నెట్లు స్తుతించి దాన ధర్మములు చేయని దురాచారులను శ్రీమహావిష్ణువు ఆయన పరివార దేవతలను యధోచితముగ నట్లు సిక్షింతురు. కావున సర్వ జనులును యధాశక్తిగ నెట్లు వైశాఖ వ్రతము నాచరించి యధాశక్తిగ దానధర్మముల నాచరించి దైవానుగ్రహము నందుట మేలు. ఇది గమనింపదగిన ముఖ్య విషయము. కావున వైశాఖమాసము ధర్మరక్షకుడగు శ్రీ మహావిష్ణువు ప్రజలను పరీక్షించు పరీక్షా కాలమని ప్రతి జీవియు గుర్తించి వ్రతమునాచరించి భగవదనుగ్రహము నంద ప్రయత్నింపవలయును. అందుచే వైసాఖమాసవ్రతము కార్తీక మాఘ మాసవ్రతములకన్న మరింత ఉత్తమము అయినది. అని నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస విశిష్టతను వివరించెను.

వైశాఖ పురాణం అయిదవ అధ్యాయము సంపూర్ణము

"నిజం అనేది కలత చెందుతుంది, కానీ ఓడిపోదు .""సత్యమేవ జయతే "

              నీతి కథ  

తన చివరి శ్వాసను విడుస్తున్న , జటాయువు నేను రావణుడి తో గెలవలేనని నాకు తెలుసు, అయినా కానీ నేను పోరాడాను. నేను పోరాడకపోతే, రాబోయే తరాలవారు నన్ను పిరికి వాడు అని అనుకుంటారు.

రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు  మృత్యువు వచ్చింది మరియు మృత్యువుకు సవాలు విసిరాడు
"జాగ్రత్త! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీత మాత యొక్క సమాచారం  ప్రభు" శ్రీరాముడి"కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువు తాకలేకపోతోంది, అది నిలబడి   వణుకుతూనే ఉంది.
మరణం అప్పటివరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. ఇది  కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.

కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు  ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను  చిరునవ్వుతున్నారు!

ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో, జటాయువు శ్రీరాముడి  ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు.
అక్కడ మహాభారతంలో, భీష్మ పితామహుడు  ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా?

అదే సమయంలో , జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా  అయింది. కాని భీష్మపితామహుడు  చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది!
జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడి లో ప్రాణ త్యాగం చేసాదు.
జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు  ఏడుస్తున్నాడు.ఇంత తేడా ఎందుకు? 

ఇంతటి తేడా ఏమిటంటే, ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో  పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు  చూశాడు. అడ్డుకోలేకపోయాడు!
దుశ్శాసనుడుకు  ధైర్యం ఇచ్చారు. దుర్యోధనుడి కి అవకాశం ఇచ్చాడు కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూవున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు.

దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే  వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.
జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది!

ఇతరులుకు తప్పు జరిగిందని చూసి  కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు .

"నిజం అనేది  కలత చెందుతుంది, కానీ ఓడిపోదు ."
"సత్యమేవ జయతే "

రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు ! వజ్రాలూ , వైడూర్యాలూ పోగేసుకున్న ఈ వయసులో మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! ( రేలంగి వెంకట్రామయ్య గారు ) .

Kalluri satyanarayanasharma🍃🌺 *'అన్నం'* *గురించి నలుగురు మంచి మనుషులు చెప్పిన నాలుగు గొప్ప మాటలు...*

1. ఆకలిగొన్నవాడికి   ' దేవుడు '  కనపడేది అన్నం రూపంలోనే ! 
   
   ( మహాత్మా గాంధీ ) .

2. " నేను వంటింట్లోకి వేరే  పనిమీదవెళ్ళినాకూడా , వంట చేస్తున్న మా అమ్మగారు.  " పెట్టేస్తా నాన్నా ఒక్క అయిదు నిముషాలు " అనేవారు నొచ్చుకుంటూ-   నేను అన్నం కోసం వచ్చాననుకుని ! 
ఎంతయినా అమ్మ అంటే అన్నం.  అన్నం అంటే అమ్మ ! అంతే !

  ( జంధ్యాలగారు ) .

3. మంచి భోజనం లేని పెళ్ళికి వెళ్ళటం - సంతాపసభకి వెళ్ళినదానితో సమానం ! 

( విశ్వనాధ సత్యనారాయణ గారు ) . 

4.. రాళ్లు తిని అరిగించుకోగల వయసులో వున్నప్పుడు తినటానికి మరమరాలు కూడా దొరకలేదు !  వజ్రాలూ , వైడూర్యాలూ  పోగేసుకున్న ఈ వయసులో  మరమరాలు కూడా అరగట్లేదు ! అదే విధి ! 

( రేలంగి వెంకట్రామయ్య గారు ) .
 
5. ఆరురోజుల పస్తులవాడి ఆకలి కన్నా,   మూడురోజుల పస్తులవాడి ఆకలి మరీ ప్రమాదం ! ఆహారం దొరికినప్పుడు ముందు వాడ్నే తిననివ్వాలి !

( ముళ్ళపూడి వెంకటరమణ గారు ) .

6. ఏటా వందబస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చినా మా తండ్రిగారు 

" అన్నీ మనవికావు నాయనా " అని బీదసాదలకి చేటలతో పంచేసే వారు. 
అన్నీ మనవికావు అనటంలో వున్న వేదార్ధం నాకు పెద్దయితేనేగానీ 
అర్ధం కాలేదు ! 

( ఆత్రేయ గారు ) 

7. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం ! 
అమ్మ చేతి   అన్నం తింటున్నాను అని చెప్పగలిగినవాడు ధన్యుడు ! 

( చాగంటి కోటే శ్వర రావుగారు ) . 

8.  ఆకలితో వున్న వాని  మాటలకు ఆగ్రహించవద్దు !!

( గౌతమ బుద్దుడు ). 

9 ఆత్మీయులతో కలసి తినే భోజనానికి రుచి ఎక్కువ ! చారుకూడా అమృతంలా రుచిస్తుంది !
( మాతా అమృతానందమయి ) .

10. మీ పిల్లలు ఎంతదూరంలో,  ఎక్కడవున్నా , వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్పాకాదూ , మీ గొప్పాకాదు 
మీ పూర్వీకుల పుణ్యఫలమే అని  గుర్తించు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Monday, April 27, 2020

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము వైశాఖ పురాణం ఏడవ అధ్యాయము :-నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ || వైశాఖమాస దానములు

వైశాఖ పురాణం 7 వ అధ్యాయము

                                   వైశాఖ పురాణం 

ఏడవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

                            వైశాఖమాస దానములు

అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగుగ వినుమని యిట్లు వివరింపసాగెను.

రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యధోచితములగు శుద్ది, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృ శ్రాద్దము మానకుండుట, వైశాఖవ్రతాచరణము యివి మిక్కిలి పుణ్యప్రదములు. వైశాఖమాస ధర్మముల నాచరింపనివానికి ముక్తి లేదు.

సర్వధర్మములయందును వైశాఖవ్రత ధర్మముత్తమము సాటిలేనిది. రాజులేని రాజ్యప్రజలవలె పెక్కు ధర్మములున్నవి. కాని అవి దుఃఖప్రదములు అనగా కష్టములను కలిగించును. సుఖసాధ్యములు కావు. వైశాఖధర్మములు సులభములు, సువ్యవస్థితమగు రాజు పరిపాలనలో నున్న ప్రజలకువలె సుఖశాంతి ప్రదములు. అన్ని వర్ణములవారికి, అన్ని ఆశ్రమములవారికి సులభములు ఆచరణ సాధ్యములు పుణ్యప్రదములు. నీటితో నిండిన పాత్రను యిచ్చుట, మార్గమున చెట్లనీడలో చలివేండ్రము నేర్పరచుట, చెప్పులను, పావుకోళ్లను దానమిచ్చుట, గొడుగును, విసనకఱ్ఱలను దానమిచ్చుట, నువ్వులతో కూడిన తేనెను దానమిచ్చుట, ఆవుపాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి, వెన్న వీనిని దానము చేయుట, ప్రయాణము చేయువారికి సౌకర్యముగ మార్గముల యందు బావులు, దిగుడుబావులు, చెరువులు త్రవ్వించుట, కొబ్బరి, చెరకు గడల రసము, కస్తూరి వీనిని దానము చేయుట, మంచి గంధమును పూయుట, మంచము, పరుపు దానమిచ్చుట, మామిడిపండ్ల రసము, దోసపండ్ల రసము దానముచేయుట, దమనము, పుష్పములు, సాయంకాలమున గుడోదకము(పానకము) పూర్ణిమయందు పులిహోర మొదలగు చిత్రాన్నముల దానము ప్రతిదినము దధ్యోదనము దానము చేయుట, తాంబూల దానము చైత్ర అమావాస్య నాడు వెదురుకొమ్మలదానము ముఖ్యములు. ఆ కాలమున వచ్చు సర్వవిధములగు ఫల పుష్పములను వివిధ వస్తువులను దానము చేయవలెను.

ప్రతిదినమున సూర్యోదయమునకు ముందుగా స్నానము చేయవలయును. శ్రీమహావిష్ణు పూజ తరువాత విష్ణుకథాశ్రవణము చేయవలయును. అభ్యంగస్నానము వైశాఖమున చేయరాదు. ఆకులో భుజింపవలెను. ఎండలో ప్రయాణములో అలసిన వారికి విసనకఱ్ఱతో విసరుట, సుగంధ పుష్పములతో ప్రతి దినము విష్ణుపూజ, పండ్లు, పెరుగన్నము నివేదించుట ధూపదీపముల సేవ, గోవులకు ప్రతి దినము గడ్డిని పెట్టుట, సద్బ్రాహ్మణుల పాదములను కడిగి ఆ నీటిని తనపై జల్లుకొనుట, ముఖ్యకర్తవ్యములు. బెల్లము, శొంఠి, ఉసిరిక, పప్పు, బియ్యము, కూరగాయలు వీనిని దానము చేయవలెను. ప్రయాణీకులను ఆదరించి కుశలప్రశ్నలడిగి వలసిన ఆతిధ్యము నీయవలెను. ఇవి వైశాఖమాసమున తప్పక చేయవలసిన ధర్మములు. పుష్పములతో చిగుళ్లతో విష్ణుపూజ, విష్ణువును తలచుకొని పుష్పములను దానమిచ్చుట దధ్యన్ననివేదనము మున్నగునవి సర్వపాపములను హరించును. అఖండ పుణ్యమునిచ్చును.

పుష్పములతో శ్రీమహావిష్ణువు నర్చింపక, విష్ణుకథాశ్రవణము చేయక వ్యర్థముగ కాలమును గడుపు స్త్రీ పతి సౌఖ్యమును, పుత్రలాభమును పొందదు. ఆమె కోరిక లేవియును తీరవు. శ్రీమహావిష్ణువు వివిధరూపములలో జనులను పరీక్షించుటకై పవిత్ర వైశాఖమాసమున సంచరించు సపరివారముగ మహామునులతో సర్వదేవతలతో వచ్చి ప్రతిగృహమున నివసించును. అట్తి పవిత్ర సమయమున వైశాఖ పూజాదికములను చేయని మూడుఢు శ్రీహరి కోపమునకు గురియగును. రౌరవాది నరకములను పొంది రాక్షస జన్మనైదుమార్లు పొందును. ఇట్టి కష్టములు వలదనుకొన్న వారు యధాశక్తిగ వైశాఖవ్రతము నాచరించుచు ఆకలిగలవారి కన్నమును, దప్పిక కలవారికి జలమును యీయవలెను. జలము, అన్నము సర్వప్రాణుల ప్రాణములకును ఆధారములు కదా. అట్టి దానములచే సర్వప్రాణుల యందున్న సర్వాంతర్యామియగు శ్రీమహావిష్ణువు. సంతోషించి వరములనిచ్చును. శ్రేయస్సును సర్వసుఖ భోగములను, సంపదలను, కలిగించి ముక్తినిచ్చును. జల దానము చేయనివారు పశువులై జన్మింతురు. అన్నదానము చేయనివారు పిశాచములగుచున్నారు. అన్నదానము చేయక పిశాచత్వమునందిన వారి కథను చెప్పుచున్నాను వినుము. ఇది నాకు తెలిసిన ఆశ్చర్యకరమగు విషయము సుమా!

వైశాఖ పురాణం ఏడవ అధ్యాయము సంపూర్ణము

10వ దినము, అయోధ్యకాండ

10వ దినము, అయోధ్యకాండ
అలా లోపలికి వచ్చిన రాముడిని చూసిన కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దెగ్గరికి వెళ్ళి " నాయనా రామ! నీకు యువరాజ పట్టాభిషేకం జెరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, మన వంశంలొ పుట్టిన ఎందరో గొప్పవాళ్ళలాగ నువ్వు కూడా కీర్తిని సంపాదించు " అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కుర్చోమంది.
అప్పుడు రాముడు ఆ ఆసనాన్ని ఒకసారి ముట్టుకొని కౌసల్యతో " అమ్మా! నేను కూర్చోడానికి సమయం లేదు, నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు, నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనముల మీద కూర్చోవాలి కాని, ఇటువంటి వాటి మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకొని వెళదామని వచ్చాను " అని రాముడన్నాడు.
ఈ మాటలు విన్న కౌసల్య నిట్టనిలువునా కింద పడిపోయింది.

తరువాత ఆమెకి కొంత సపర్యలు చేశాక బాహ్య స్మృతిని పొంది ఇలా అనింది " రామ, నువ్వు చెప్పిన మాటలు విన్నాక నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉండి ఉంటే బాగుండు అనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్ను అందరూ గొడ్రాలు అంటారు, అంతకుమించి నాకు వేరె బాధ ఉండదు. కాని ఇవ్వాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. రామ, నీకొక నిజం చెప్తాను,

న ద్ఋష్ట పూర్వం కల్యాణం సుఖం వా పతి పౌరుషే |
అపి పుత్రే విపశ్యేయం ఇతి రామ ఆస్థితం మయా ||

నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఏ మంగళమైన ఆనందాన్ని పొందలేదు. ఎందుకంటే ఆయన కైకేయకి వశుడై ఉన్నాడు. కైకేయ మనస్సు నొచ్చుకుంటుందని ఒక జేష్ఠ భార్యకి ఇవ్వవలసిన మర్యాద నాకు ఇవ్వకుండా, కైకేయి యొక్క దాసీజనంతో సమానంగా చూశాడు. ఇవ్వాళ నీకు యుక్త వయస్సులొ పట్టాభిషేకం జెరిగి యువరాజుగా నిలబడితే, నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించచ్చు అని అనుకున్నాను. కాని ఇవ్వాళ నాకు ఆ ఆనందం కూడా లేకుండాపోయింది. ఊసర క్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో, అలా నేను చేసిన వ్రతాలు, పూజలు నిష్ప్రయోజనం అయ్యాయని అనుకుంటున్నాను రామ! దైవానుగ్రహము నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు. నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బతకాలి, అందుకని నేను మరణిస్తాను " అని కౌసల్య అనింది.


ఇప్పటిదాకా ఈ మాటలన్నీ వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో " అన్నయ్యా! నాన్నగారికి వృధాప్యం వచ్చింది కాని కామం తీరలేదు, విషయసుఖాలకి లొంగి కైకేయతో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధం చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మము, పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతోంది. చేతకానివాడిలా నువ్వు వెళ్ళిపోవడం ఎందుకు, నువ్వు ఒకసారి "ఊ" అను, నేను నా అస్త్ర-శస్త్రాల చేత ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలని పర్వతాల్ని పడేసినట్టు పడేస్తాను, భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒక బాణంతో కొన్ని వందల మందిని చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకిని అడవులకు పంపిస్తున్న ఆ దశరథుడిని బంధించి కారాగృహంలో తోసేస్తాను, లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు, కావున నాకు అనుమతి ప్రసాదించు " అని అన్నాడు.

లక్ష్మణుడి మాటలు విన్న కౌసల్య ఇలా అనింది " రామ! నిన్ను విడిచి నేను ఉండలేను, ఉంటె నీతో పాటు నేను ఉండాలి, లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు నేను అడవులకు వస్తే, నువ్వు ఏది తింటావో నాకు అదే పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన ఆలోచన గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో, తల్లి మాట కూడా అలానే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కనుక వెళ్ళిపోతానంటున్నావు, కాని తల్లిగా నేను నీకు అనుమతిని ఇవ్వడంలేదు. ఒకవేళ నువ్వు నా మాట కాదని వెళితే నేను విషం తాగి చనిపోతాను. నువ్వు వెళ్ళడానికి వీలులేదు " అని కౌసల్య అనింది.

అప్పుడు రాముడు " అమ్మా! నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను. ఖండువు అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవుని చంపమంటే, ఆ మహర్షి గోవుని చంపేసాడు. పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక శిరస్సు నరకమన్నాడు, పరశురాముడు ఎందుకు నాన్న అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలాగే మన వంశంలో పూర్వీకుడైన సగర చక్రవర్తి తన 60,000 కుమారులని పిలిచి ఈ భూమి మొతాన్ని తవ్వమంటే, అలా తవ్వడం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు, తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట, తండ్రి మాట వినవలసి వస్తే, తండ్రిమాటకే గౌరవం ఇవ్వాలి. నేను ఇప్పుడు తల్లి మాట విని ఆగిపోతే, పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులవుతారు. నేను వారి ప్రవర్తనని అవమానించకూడదు. అందుకని నేను ఇప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్లిపోవాలి " అన్నాడు.

తరువాత లక్ష్మణుడితో,
తవ లక్ష్మణ జానామి మయి స్నేహమనుత్తమం |
విక్రమం చైవ సత్యం చ తేజశ్చ సుదురాసదం |
మమ మాతుర్మహద్దుఃఖమతులం శుభలక్షమ్ణ |
అభిప్రాయం అవిజ్ఞాయ సత్యస్య చ శమస్య చ ||
" లక్ష్మణా! నువ్వు ఎంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు, కాని నువ్వు అన్నటువంటి మాటలు వలన అమ్మ దెగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళదామని వచ్చిన నాకు ఎంత ఇబ్బంగిగా ఉన్నాయో చూశావా. సత్యమేదో, శాంతికి స్థానమేదో తెలుసుకోవడంలో అమ్మ తత్తరపడుతోంది.
ధర్మః హి పరమః లోకే ధర్మే సత్యం ప్రతిష్ఠితం |
ధర్మ సంశ్రితం ఏతచ్ చ పితుర్ వచనం ఉత్తమం ||
ధర్మమునందు సత్యము ప్రతిష్టితమై ఉంటుంది, అందుకని ధర్మాన్ని విడిచిపెడితే, సత్యధర్మములు రెండిటిని విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో, ఒక సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి.

త్వయా మయా చ వైదేహ్యా లక్ష్మణేన సుమిత్రయా |
పితుర్నియోగే స్థాతవ్యమేష ధర్మః సనానః ||
అమ్మ, నీకొక ధర్మాన్ని చెపుతాను. నాన్నగారు నిన్ను, సుమిత్రని, నన్ను, లక్ష్మణుడిని, సీతని శాసించచ్చు, మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. (తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని). ఇది సనాతనమైన ధర్మము.
ధర్మార్థకామాః ఖలు తాత లోకే సమీక్షితా ధర్మఫలోదయేషు |
తే తత్ర సర్వే స్యురసంశయం మే భార్యేవ వశ్యాభిమతా సుపుత్రా ||
లక్ష్మణా! ధర్మము, అర్థము, కామము అని మూడు పురుషార్ధాలు ఉంటాయి, ఇందులో నువ్వు ధర్మం ఒక్కదాన్ని పట్టుకుంటే అది అర్థకామాలని తీసుకోచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థం లోక ద్వేషాన్ని తీసుకొస్తుంది, ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామం నీ పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మం భార్యవంటిది.

( అందుకే మనం భార్యని కామపత్నిగా చూడము, ధర్మపత్ని అని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వల్ల కలిగిన కామము వలన అర్థము[ శాస్త్రం ప్రకారం అర్థం అంటె ధనము కాదు, ధనాన్ని కర్మఫలం అంటారు, అర్థం అంటె కొడుకు అని] లభిస్తుంది.) లక్ష్మణా! నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు, అది ధర్మబద్ధం కాని రాజ్యం, అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. తండ్రి చెప్పిన మాట పాటించడం కొడుకుకి ధర్మం, అందుకని నేను అరణ్యానికి వెళ్ళడానికే నిశ్చయమయ్యాను. అలాగే, నువ్వు నాకు పట్టాభిషేకం జెరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంభారములన్నిటిని, ఇక్కడినుంచి తీసెయ్యి. నేను అరణ్యాలకి తొందరగా వెళ్లిపోవాలి, లేకపోతే అమ్మ( కైకెయ) బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఖం ఎప్పటికి రాకూడదు అందుకని తొందరగా ఈ సంభారములన్నిటిని తీసెయ్యి. అమ్మ నన్నూ, బరతుడిని ఎన్నడూ వేరుగా చూడలేదు. మరి ఇంతగా నన్ను ప్రేమించిన అమ్మ, నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు, ఇవ్వాళ తెల్లవారేసరికి నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమన్నారు అంటె ఒకటి గుర్తుపెట్టుకో లక్ష్మణా......
సుఖ దుహ్ఖే భయ క్రోధౌ లాభ అలాభౌ భవ అభవౌ |
యస్య కించిత్ తథా భూతం నను దైవస్య కర్మ తత్ ||
సుఖం అవని, దుఖం అవని, శుభం అవని, అశుభం అవని, వెనకనుండి శాసించేవాడు ఆ దైవం. ఆ దైవాన్ని తిరస్కరించి నువ్వు ఏమి చెయ్యలేవు. ఒక మంచిపని చేద్దామని అనుకుంటే దానికొక ప్రతిబంధకం రావడం కూడా దైవము చేసిన పనే " అని రాముడన్నాడు.

రాముడు చెప్తున్న మాటలు వింటున్న లక్ష్మణుడు ఆ ధనుస్సుని గట్టిగా పట్టుకొని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు " నీకే చెల్లింది అన్నయ్యా ఈ చేతకాని మాటలు మాట్లాడడం, అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయ పొందు కావలసి వచ్చిందా, ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకంలేవ కైకమ్మకి, నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు, రాత్రికి రాత్రే కైకేయకి రెండు వరాలు ఇచ్చి, సత్య ధర్మాలకి కట్టుబడి నిన్ను అరణ్యాలకి పొమ్మంటాడ, భరతుడికి రాజ్యం ఇస్తాడ, తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకి వెళతానంటావ, ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ, తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావ, ఇదంతా దైవం చేశాడంటున్నావు కదా ఆ దైవాన్ని ఒకసారి కనపడమను, నా ధనుస్సుకి బాణాలని సంధించి మొదట దశరథుడి తల, తరవాత కైకేయ తల పడగొడతాను, నిన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కుర్చోపెడతాను, అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే, దైవం ఉందని ఒప్పుకుంటాను, దైవమో, లక్ష్మణుడో నెగ్గాలి, నువ్వు చెప్పిన మాటలు నాకు ఎంతమాత్రము నచ్చలేదు, నువ్వు అనుమతిని ఇవ్వు దశరథుడి మీద యుద్ధం ప్రకటిస్తాను " అన్నాడు.

అప్పుడు రాముడు " లక్ష్మణా! నువ్వు మళ్ళి పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమె, నేను అనుమతించిననాడు కదా నువ్వు బాణం వెయ్యడం, దశరథ మహారాజు గారిని ఇచ్చిన మాట మీద నిలబెట్టడం కోసం అరణ్యాలకి వెళ్ళడం మినహా నాకు వేరొక మార్గం లేదు " అని లక్ష్మణుడితో అని, అడవులకు వెళుతున్న తనని ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు.


" సరే, అలాగే వెళ్ళు, కాని నా కన్నీళ్ళని దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం లేదు, అందుకని నన్ను నీతోపాటే తీసుకెళ్ళు, లేదా నేను ఇక్కడే విషం తాగి మరణిస్తాను, ఈ రెండిటిలో ఏది చెయ్యమంటావో చెప్పి బయలుదేరు " అని కౌసల్య రాముడితో అనింది.


భర్తుః కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః |  
స భవత్యా న కర్తవ్యో మనసా అపి విగర్హితః ||
అప్పుడు రాముడు " ఏ స్త్రీ భర్తని విడిచిపెట్టి, తాను ఒక్కత్తే భర్తకన్న వేరుగా, దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో, అటువంటి స్త్రీ నృశంస(ఆమెని చూడగానే "ఛి" అనవలసిన స్త్రీ). భర్తని వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కనాటికి అనకూడదు. దశరథ మహారాజు ఎంత కాలం ఉంటాడో, నువ్వు అంతకాలం ఆయనకి శుశ్రూష చెయ్యవలసి ఉంటుంది.

భర్తారం న అనువర్తేత సా చ పాప గతిర్ భవేత్ |
భర్తుః శుశ్రూషయా నారీ లభతే స్వర్గము త్తమం |
అపి యా నిర్నమస్కారా నివృత్తా దేవపూజనాత్ ||
ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా, తన భర్త మనసు గుర్తెరిగి, భర్తకి ఆనందం కలిగేటట్టు ప్రవర్తించడం చేతకానటువంటి స్త్రీ చిట్టచివర పొందేది నరకమే. అలాగే, జీవించి ఉండగా ఎన్నడూ ఒక దేవతకి నమస్కారం చెయ్యకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చెయ్యకపోయినా కాని, భర్తని అనువర్తించి, భర్తయందు ప్రేమతో ప్రవర్తించినటువంటి స్త్రీ చిట్టచివర స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మ, నువ్వు అలా మాట్లాడకూడదు, నేను అలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అమ్మ" అని కౌసల్య పాదాలకి నమస్కారం చేశాడు.


అప్పుడు కౌసల్య తెల్లటి ఆవాలు, పెరుగు, తెల్లటి పూలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్నటువంటి ఆచార్యుడిని పిలిచి, హోమం చేయించి, ఆ అక్షతలని రాముడి శిరస్సు మీద ఉంచి " నాయనా, నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశం, నీరు, అగ్ని, వాయువు, దిక్కులు, గృహదేవతలు, రాక్షసులు, విషక్రిములు, చెట్లు, నదులు, ఋతువులు, నక్షత్రములు అన్నీ నిను రక్షించాలి. ఆ వృత్తాసురిడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, గరుగ్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎటువంటి మంగళం జెరిగిందో, నీకు అటువంటి మంగళం జెరుగుగాక, క్షీరసాగర మధనంలో రాక్షసులని సంహరించిన ఇంద్రుడికి అదితి నుంచి ఎటువంటి మంగళం లభించిందో, నీకు అటువంటి మంగళం కలుగుగాక, పాదముల చేత ఈ లోకములనన్నిటిని కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎటువంటి మంగళం లభించిందో,  అటువంటి మంగళం నీకు లభించుగాక " అని ఆశీర్వదించింది.


కౌసల్య దెగ్గర ఆశీసులు తీసుకున్నాక రాముడు సీతమ్మ దెగ్గరికి బయలుదేరాడు. తన తల్లి దెగ్గర ఎంత గంభీరంగా ఉన్నా, సీతమ్మ దెగ్గరికి వచ్చేసరికి రాముడి ముఖం వివర్ణం అయిపోయింది. సీతమ్మ రాముడికి ఎదురుగా వచ్చి " ఎప్పుడూ కాంతితో మెరిసిపోయే మీ ముఖం ఏదో ఒక నల్లటి రంగుతో కూడి ఉంది. ఏదో తప్పు చేసినవారిలా మీ కనురెప్పలు కిందకి వంగి ఉన్నాయి, నూరు ఊచలు కలిగిన తెల్లటి గొడుగుని మీకు పట్టాలి కదా, మీకు ఎదురుగా భద్రగజం నడవాలి కదా, మీ వెనకాల చతురంగ బలాలు నడిచి రావాలి కదా, ఇవన్నీ ఎందుకు జెరగలేదు " అని రాముడిని అడిగింది.


అప్పుడు రాముడు తలదించుకొని " సీత! మా తండ్రిగారిని కైకేయ రాత్రి రెండు వరాలు అడిగింది. పధ్నాలుగు సంవత్సరాలు నన్ను అరణ్యవాసం చెయ్యమని అడిగింది. సత్యమునకు ధర్మమునకు బద్ధుడైన నా తండ్రి నన్ను అరణ్యవాసం చెయ్యమని శాసించారు. అందుకని నేను అరణ్యవాసానికి వెళ్ళిపోతున్నాను. అలాగే భరతుడికి పట్టాభిషేకం చెయ్యమని అడిగింది. భరతుడికి పట్టాభిషేకం చేశాక, భరతుడు ఈ రాజ్యానికి రాజు అవుతాడు. నేను వదినని అవుతాను కదా అని గబుక్కున చొరవగా మాట్లాడతావేమో, ఇప్పుడు నువ్వు భరతుడి చేత రక్షింపబడుతున్న స్త్రీవి, అందుకని అంత చొరవగా మాట్లాడమాకు. ఆయనని ప్రభువుగా గౌరవించడం నేర్చుకో, నా తల్లి అయిన కౌసల్యకి సపర్య చెయ్యి. కౌసల్య, సుమిత్ర, కైకేయ మరియు దశరథుడి ఇతర భార్యలని సేవించు. నేను వెళ్ళిపోయాక మా అమ్మ అన్నం తినకుండా ఏడుస్తూ ఉంటుంది, కావున మా అమ్మ కన్నీరు తుడిచి, మంచి మాటలు చెప్పి ఆమెని సేవించు " అని అన్నాడు.

అప్పుడు సీతమ్మ " మీరు చెప్పినవన్నీ నాకు బాగానే వినబడ్డాయి కాని ఒకమాటే అర్థం కాలేదు, నువ్వు ఉండు నేను వెళతాను అన్నట్టు మాట్లాడుతున్నారేంటి, మనం వెళతాము అని అనాలి కదా మీరు. మీరు మీ నాన్నగారిని ధర్మమునందు నిలబెట్టడానికి వెళతాను అంటున్నారు కదా, నాకు కూడా ఒక ధర్మం తెలుసు, చెప్తాను వినండి.......
ఒకే ఇంట్లో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, అల్లుళ్ళు ఉంటారు. ఇంటి యజమాని తీసుకొచ్చిన భాగ్యాన్ని మిగిలినవారందరూ పంచుకుంటారు. కాని, భర్తతో సుఖం కాని, కష్టం కాని పంచుకోడానికి అన్నికాలములయందు భర్త కన్నా వేరుగా చూడబడలేని రీతిలో ఉన్నది భార్య ఒక్కత్తే. అందుకని నేను కూడా మీతో పాటు అరణ్యాలకి వచ్చేస్తాను.

న పితా న ఆత్మజో న ఆత్మా న మాతా న సఖీ జనః |
ఇహ ప్రేత్య చ నారీణాం పతిర్ ఏకో గతిః సదా ||
తల్లి కాని, తండ్రి కాని, అన్నదమ్ములు కాని, అక్కచెల్లెళ్ళు కాని, కడుపున పుట్టిన బిడ్డలు కాని, రాజ్యం కాని, సంపద కాని, ఇవి ఏవి స్త్రీకి గతి కావు. సుఖమైనా కష్టమైనా స్త్రీ పొందవలసిన గమ్య స్థానము భర్త. నీతో పాటు వచ్చేసిన తరువాత, అక్కడ హంసలు మొదలైన పక్షులు స్నానం చేస్తూ ఆడుకునేటటువంటి సరోవరాలలో స్నానం చేస్తూ నీతో పాటు క్రీడించడంలో ఇష్టాన్ని పొందుతాను, నీతో కలిసి నడుస్తూ, నీ పక్కన కూర్చున్నప్పుడు పొందే సుఖం ముందు, మూడు లోకాలని తీసుకొచ్చి నాకు ధారపోసినా, నీ పక్కన కూర్చున్న సుఖం రాదు. అందుకని నేను నీతోనే వస్తాను " అని సీతమ్మ అనింది.

అప్పుడు రాముడు " సీతా! నీకు తెలియదు. నా వెంట వస్తానంటున్నావు. నేను వెళుతున్నది అరణ్యాలకి. అరణ్యంలో నదిలో స్నానం చేద్దామని లోపలికి వెళితే మొసళ్ళు పట్టుకుంటాయి. రాత్రి పూట దోమలు కుడతాయి. చీమలు, పాములు ఉంటాయి. రాలిపోయిన ఆకుల మీద పడుకోవాలి. క్రూరమృగాలు సంచరిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి మహానుభావులు వస్తారు, అప్పుడు వాళ్ళకి అరణ్యంలో ఉన్న సపర్యలన్నీ చెయ్యవలసి ఉంటుంది. కొన్ని సార్లు ఆహారం దొరకదు, అలా ఆహారం లేకుండానే తిరగవలసి ఉంటుంది, నీళ్ళు దొరకకపోతే అలా దాహంతోనే తిరగాలి. అడవులలో ముళ్ళు గుచ్చుకుంటాయి. ఇన్ని కష్టాలు పడుతూ అరణ్యవాసం చెయ్యాలి, అందుకు తగిన జీవితం నీది కాదు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు, నేను పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేసి తిరిగోస్తాను " అన్నాడు.

యే త్వయా కీర్తితా దోషా వనే వస్తవ్యతాం ప్రతి |
గుణాన్ ఇతి ఏవ తాన్ విద్ధి తవ స్నేహ పురః కృతాన్ ||
అప్పుడు సీతమ్మ " నువ్వు చెప్పినవన్నీ నిజమే అయ్యుండచ్చు, కాని రామ, నువ్వు పక్కన కూర్చొని సీతా! అని ప్రీతిగా మాట్లాడితే, ఇవన్నీ నాకు సుఖాలు అవుతాయి, అదే నువ్వు పెడముఖంతో ఉంటె మాత్రం, నేను ఎన్ని భోగభాగ్యాల మధ్య ఉన్నా, అవన్నీ నాకు విషం అవుతాయి. నాకు కూడా మా తండ్రిగారు వివాహ సమయంలో ఒక ధర్మం చెప్పారు, నేను నీ వెంట నీడలా వస్తానని. నువ్వు పెద్దల మాటలకు కట్టుబడి అడవులకు వెళుతున్నావు, మరి నేనూ పెద్దల మాటలకు కట్టుబడి నీ వెంట అడవులకు రావాలి కదా. చిన్నప్పుడు నా జాతకాన్ని చూసిన జ్యోతిష్యులు నేను కొంత కాలం వనవాసం చేస్తానని చెప్పారు. అంతఃపురంలో ఉండు, ఇక్కడ నిన్ను అందరూ రక్షిస్తారు, అడవులకు వస్తే పులులు, సింహాలు ఉంటాయి అంటావు, నువ్వు నన్ను రక్షించలేవా, అసలు నిన్ను చూస్తే అవన్నీ పారిపోవా, అలాంటిది ఇవ్వాళ ఇలా చేతకానివాడిలా మాట్లాడుతున్నావు. నిన్ను చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, నువ్వు పురుష రూపంలో ఉన్న స్త్రీవని తెలియక, నన్ను మా నాన్న నీకిచ్చి కన్యాదానం చేశాడు. నీతోపాటు ఇంత తేనె తాగినా, ఒక పండు తిన్నా, నా కడుపు నిండిపోతుంది రామ, ఒకవేళ ఆ రోజూ ఏమి దొరకకపోతే, నీతో మాట్లాడుతూ ఉండడం వల్ల నేను ఆ కష్టం మరిచిపోతాను. నేను ముందు నడిచి దర్భలను తోక్కుక్కుంటూ వెళతాను, కాబట్టి అవి మెత్తగా అవుతాయి, అప్పుడు నువ్వు నా వెనకాల హాయిగా రా, నేను నిన్ను ఎన్నడూ కష్టపెట్టను, నన్ను నమ్మితే నీతోపాటు తీసుకెళ్ళు, లేకపోతే నా ప్రాణాలు విడిచిపెట్టడానికి అనుమతినివ్వు " అని రాముడిని గట్టిగా కౌగలించుకొని, ఆయన గుండెల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది.


అప్పుడు రాముడు " సీతా! నిన్ను విడిచి నేను ఉండగలనా. పధ్నాలుగు సంవత్సరాలు నీకు దూరంగా నేను ఉండలేను. కాని, భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి భార్యని నాతో రా అని శాసించకూడదు. ఇంత కష్టానికి వెళదాము అని నేను అనకూడదు, ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు, భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి. ఆ అభిప్రాయం నీ నోటవెంట వచ్చాక నిన్ను తీసుకెళ్లడం నా ధర్మం, అందుకని వద్దు అన్నాను. నీవంటి భార్యని పొంది నేను అదృష్టవంతుడినయ్యాను. కనుక నువ్వు ఇక్కడున్నటువంటి వాటన్నిటిని దానం చేసెయ్యి " అన్నాడు.


కోశాధికారిని పిలిచి తన దెగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు, తన వస్త్రములని, ఆభరణములని వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడికి దానం చేశాడు. గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు. అప్పటివరకు బయటనే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్ళని గట్టిగా పట్టుకొని " నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను బతకలేను అన్నయ్య, ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు, నన్ను రమ్మంటావో, వద్దంటావో అని భయం పట్టుకుంది నాకు. నువ్వు  కాని నన్ను తీసుకెళితే, మీ ఇద్దరూ హాయిగా సరోవరాల్లో, పర్వతాల మీద సంతోషంగా తిరుగుతుంటే, నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను, ఆహారం తీసుకొస్తాను. మీ ఇద్దరూ అవి తింటూ ఉంటె నాకు పరమ ఆనందంగా ఉంటుంది " అన్నాడు.


అప్పుడు రాముడు " నిన్ను కూడా తీసుకెళితే కౌసల్యని, సుమిత్రని, కైకేయని ఎవరు చూసుకుంటారు. అందుకని నువ్వు ఇక్కడే ఉండు " అన్నాడు.

" నేను కౌసల్యని, సుమిత్రని చూడడమేమిటి అన్నయ్యా, కౌసల్యకి వెయ్యి గ్రామాలు ఉన్నాయి. నాలాంటి వాళ్ళని లక్ష మందిని ఆవిడ పోషించగలదు. ఇంక నాకు ఇలాంటి సాకులు చెప్పద్దు, నేను సమాధానం చెప్పలేను. వచ్చెయ్ లక్ష్మణా, అని ఒక్క మాట అను, నేను గబగబా వచ్చేస్తాను " అన్నాడు లక్ష్మణుడు.


నీలాంటి వాడు నాకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం అని, లక్ష్మణుడిని రాముడు వచ్చెయ్యమన్నాడు. ఈ మాట విన్న లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు. తన మిత్రులందరితో సంతోషంగా ఈ వార్త చెప్పి, తన వస్తువులని కూడా దానం చేశాడు. అలా సీతారామలక్ష్మణులు దశరథుడి ఆశీర్వాదం కోసమని ఆయన అంతఃపురానికి బయలుదేరారు.

Sunday, April 26, 2020

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము వైశాఖ పురాణం ఆరవ అధ్యాయము :-

వైశాఖ పురాణం 6 వ అధ్యాయము
            

                                  వైశాఖ పురాణం 

ఆరవ అధ్యాయము :-

నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||

          జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ

నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో నుత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ.

పూర్వము యిక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు సులభముగ దొరుకునది జలము. అది దైవదత్తము సులభము. అట్టి జలమును దానమిచ్చుటయేమని తలచి జల దానమును మాత్రము చేయలేదు. బ్రహ్మపుత్రుడగు వశిష్ఠుడు ఆ మహారాజునగు గురువు పురోహితుడు. అతడును జలదానము చేయుమని పెక్కుమార్లు ఆ రాజునకు చెప్పెను. నీరు అమూల్యమైనది అట్టిదానిని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును. ఎవరికిని సులభము కాని దానిని దానమిచ్చిన పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను. అట్లే యెవరును గౌరవింపని వారిని ఆదరించుటయే యుక్తమని తలచి అంగవైకల్యము కల బ్రాహ్మణులను, దరిద్రులను, ఆచారహీనులను ఆదరించి గౌరవించెను. ఆచారవంతులను, పండితులను, సద్బ్రాహ్మణులను ఆదరింప లేదు గౌరవింపలేదు. అందరును ప్రసిద్దులను, ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాధులు, విద్యాహీనులు అయిన బ్రాహ్మణులకు, దరిద్రులకు ఆదరణ చేయు వారెవ్వరు? నేను అట్టివారినే గౌరవింతునని అట్టివారిని మాత్రమే గౌరవించెను ఆదరించెను. ఈ విధముగ అపాత్రులకు మాత్రమే దానముల నిచ్చెను.

ఇట్టి దోషముచే నా రాజు యొకప్పుడును జలదానము చేయకపోవుట వలన చాతక పక్షిగా ముమ్మారు జన్మించెను. ఒక జన్మలో గ్రద్దగను, కుక్కగ నేడుమార్లు జన్మించెను. అటు పిమ్మట మిధిలాదేశమును పాలించు శ్రుతకీర్తి మహారజు గృహమున గోడపైనుండు బల్లిగా జన్మించెను. అచట వ్రాలు కీటకములను భక్షించుచు బల్లియై హేమాంగద మహారాజు జీవనము గడుపుచుండెను. ఈ విధముగ ఎనుబదియేడు సంవత్సరముల కాలముండెను.

మిధిలాదేశ రాజగృహమునకు శ్రుతదేవమహాముని ప్రయాణముచే అలసిపోయి మధ్యాహ్నకాలమున వచ్చెను. మహారాజు అగు శ్రుతకీర్తి ఆ మునిని జూచి సంభ్రమముతో ఆ మునికి యెదురు వెళ్ళి సగౌరవముగ ఇంటిలోనికి దీసికొవచ్చెను. వానిని మధుపర్కము మున్నగువానితో పూజించి వాని పాదములను కడిగి యా నీటిని తన తలపై జల్లుకొనెను. అట్లు జల్లుకొనుటలో తలపై జల్లుకొన్న నీటి తుంపురులు కొన్ని యెగిరి గోడమీదనున్న బల్లిపై దైవికముగా పడినవి. ఆ పవిత్ర జలస్పర్శ కలుగగనే ఆ బల్లికి పూర్వజన్మస్మృతి కలిగి తన దోషమును తెలిసికొని పశ్చాత్తాపము కలిగెను. నన్ను రక్షింపుము నన్ను రక్షింపుమని మానవునివలె ఆ మునిని ప్రార్థించెను. అప్పుడా ముని బల్లి మాటలకు విస్మయపడి ఓ బల్లీ! నీవెందులకిట్లు దుఃఖించుచున్నావు. నీవు యేపని చేసి యిట్టి దశనందితివి? ఇట్లేల అరచుచున్నావు? నీవు దేవజాతివాడవా, రాజువా, బ్రాహ్మణుడవా? నీవెవరవు? నీకీదశయేల వచ్చెనో చెప్పుము. నేను నీకు సాయపడుదునని ప్రశ్నించెను.

శ్రుతదేవుని మాటలను విన్న బల్లిరూపమున నున్న హేమాంగదమహారాజు మహాత్మా! నేను యిక్ష్వాకు కులమున జన్మించిన హేమాంగదుడను ప్రభువును. వేదశాస్త్ర విశారదుడను. భూమియందలి రేణువులెన్ని యుందునో, నీటియందు జలబిందువు లెన్నియుండునో, ఆకాశమున నెన్ని నక్షత్రములుండునో అన్ని గోవులను అసంఖ్యాకముగ దానమిచ్చితిని. అన్ని యజ్ఞములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. చెరువులు మున్నగువానిని త్రవ్వించితిని. సర్వవిధములగు దానములను చేసితిని. ధర్మముగా రాజ్యమును పాలించితిని. నేనెన్ని సత్కర్మల నాచరించినను, ముమ్మారు చాతక పక్షిగను, గ్రద్దగను, యేడుమార్లు కుక్కగను, ప్రస్తుతము బల్లిగను జన్మించితిని. ఈ మహారాజు నీ పాదములను కడిగిన పవిత్ర జలమును తనపై జల్లుకొనుచుండగా కొన్ని నీటితుంపురలు నా పైబడి నాకు పూర్వజన్మ స్మరణము కలిగినది. నా పాపభారము తగ్గినట్లనిపించుచున్నది. కాని నేనింకను యిరువది యేడుమార్లు బల్లిగా జన్మించవలసి యున్నట్లుగ నాకు తోచుచున్నది. నాకీవిధమైన బల్లిగా జన్మపరంపరయెట్లు తొలగునాయని భయము కలుగుచున్నది. నేను చేసిన పాపమేమియో నాకీ జన్మయేల కల్గెనో యెరుగజాలను. దయయుంచి నాకీ జన్మలు కలుగుటకు కారణము అయిన పాపమును ఆపాపము పోవు విధానమును చెప్పగోరుచున్నానని ప్రార్థించెను.

శ్రుతదేవమహాముని హేమాంగదుని మాటలను తన దివ్యదృష్టితో పరిశీలించి యిట్లనెను. రాజా! నీవు శ్రీమహావిష్ణువునకు ప్రియమైన వైశాఖమాసమున జలమునెవనికిని దానమీయలేదు. జలము సర్వజన సులభము. దానిని దానమిచ్చుట యేమి అని తలచితివి. ప్రయాణమున అలసినవారికిని జలదానమైనను చేయలేదు. వైశాఖమాస వ్రతమును గూడ పాటింపలేదు. హోమము చేయదలచినవారు మంత్రపూతమగు అగ్నియందే హోమము చేయవలయును. అట్లుగాక బూడిద మున్నగువాని యందు హోమము చేసిన ఫలమెట్లు కలుగును? అట్లే నీవును యోగ్యులగువారికి దానమీయక అయోగ్యులగువారికి దానముల నిచ్చితివి. అపాత్రులకెన్ని దానము లిచ్చినను ప్రయోజనము లేదు కదా! వైశాఖమాస వ్రతమును చేయలేదు. జలదానమును చేయలేదు. యెంతయేపుగ పెరిగినను, సుగంధాదిగుణములున్నను ముండ్లుకల వృక్షము నెవరాదరింతురు? అట్టి వృక్షము వలన ప్రయోజనమేమి? వృక్షములలో రావిచెట్టు ప్రశస్తమైనది. అందువలన నది పూజార్హమైనది. తులసియు మిక్కిలి పవిత్రమైనదే. ఇట్టి రావిచెట్టును, తులసిని వదలి వాకుడు చెట్టునెవరైన పూజింతురా? అట్టి పూజలవలన ఫలితముండునా? అనాధలు, అంగవైకల్యము కలవారు దయజూపదగినవారు. వారిపై దయను చూపుట ధర్మము. కాని వారు మాన్యులు పూజ్యులు కారు. అట్టివారిని పూజించుట ఫల దాయకము కాదు. వారిపై దయ, జాలి చూపవచ్చును. కాని గౌరవింపరాదు. తపము, జ్ఞ్ఞానము, వేదశాస్త్ర పాండిత్యము, సజ్జనత్వము కలవారు శ్రీమహావిష్ణు స్వరూపులు. అట్టివారినే పూజింపవలయును. వీరిలో జ్ఞానవంతులు శ్రీమహావిష్ణువునకు మిక్కిలి యిష్టమైనవారు. అట్టివారిని పూజించినచో తనను పూజించినట్లుగ భావించి శ్రీహరి వరములనిచ్చును. కావున జ్ఞానులైనవారు సర్వాధికులు, సర్వోన్నతులు అట్టివారిని గౌరవింపక పోవుట వారిని అనగా శ్రీమహావిష్ణువును అవమానించుటయే యగును. ఈ విధముగ చేయుట యిహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును. మానవుడు పురుషార్థములను సాధింపవలెనన్నచో జ్ఞానుల సేవ, వారిని గౌరవించుట ముఖ్య కారణము. జ్ఞానులు కానివారు, అంధులు - ప్రజ్ఞాజ్ఞాన నేత్రములు లేనివారు. అట్టి అంధుల నెంతమందిని పూజించినను ఫల్ముండునా? గ్రుడ్డివానికేమి కనిపించును? అతడేమి చెప్పగలడు? కావున జ్ఞానహీనులైన వారి నెంతమందిని యెంత పూజించినను, వారిని సేవించినను అవి నిష్ఫలములు, నిష్ప్రయోజనములు. అంతేకాక కష్టములను, దుఃఖములను కలిగించును. పురుషార్థములగు ధర్మార్థ కామ మోక్షములెట్లు సిద్దించును?

తీర్థములు కేవల జలములు కావు. దేవతలు శిలారూపులు కారు. చిరకాలము తీర్థస్నానము, సేవ చేసినచో శిలారూపముననున్న దైవమును చిరకాలము పూజించినచో వారియనుగ్రహము కలుగును. కాని జ్ఞానులగు సజ్జనులను దర్శించినంతనే వారు ప్రసన్నులగుదురు. ఇష్టఫలప్రాప్తిని కలిగింతురు. కావున జ్ఞానులగు వారిని సేవించినచో వారియుపదేశములను పాటించినచో విషాదముండదు. యిష్టప్రాప్తిచే సంతోషము కలుగును. అంఋతమును సేవించినచో జన్మ, మృత్యువు, ముసలితనము మున్నగువానిని వలని బాధయుండదు. అమృతత్వసిద్ది కలుగును. హేమాంగద మహారాజా! నీవు వైశాఖమాస వ్రతము నాచరింపలేదు. జలదానము చేయలేదు. జ్ఞానులగువారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగినది. నీకు యీ వైశాఖమాస వ్రతము నాచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిత్తును. దీని వలన దుర్దశ శాంతించుటకై భవిష్యద్వర్తమాన కాలములలోని నీ పాపములను వాని ఫలములను పోగొట్టుకొని విజయము నందగలవు. అని పలికి శ్రుతదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపముననున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖమాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను.

ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్యరూపమును పొందెను. శ్రుతకీర్తి మహారాజునకు, శ్ర్తదేవమహామునికి నమస్కరించెను. వారి యనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను. దేవతలందరును హేమాంగదుని యదృష్టమును మెచ్చిరి. హేమాంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను. దివ్యలోక భోగములను అనుభవించెను. అటు పిమ్మట యిక్ష్వాకు కులమున కాకుత్స్థ మహారాజుగ జన్మించెను. ఏడు ద్వీపముల భూమిని సజ్జనులు, జ్ఞానులు మెచ్చునట్లు పరిపాలించెను. శ్రీమహావిష్ణువు అంశను పొంది యింద్రునికి స్నేహితుడై యుండెను. కులగురువగు వశిష్ఠ మహాముని ఉపదేశమును పాటించెను. వైశాఖమాస వ్రతమును సంపూర్ణముగ ఆచరించెను. అందుచేయవలసిన దానధర్మముల నన్నిటిని శ్రద్దాసక్తులతో భక్తి పూర్వకముగ చేసెను. సర్వపాపములను పోగొట్టుకొనెను. దివ్యజ్ఞానము నందెను. శ్రీమహావిష్ణువు సాయుజ్యము నందెను. కావున వైశాఖమాస వ్రతము సర్వపాపహరము. అనంత పుణ్యప్రదము. ప్రతి మానవుడును వైశాఖమాసవ్రతమును, వ్రతాంగములగు దాన ధర్మాదులను పాటించి శ్రీహరియనుగ్రహము నందవలెను. అని నారదుడు అంబరీషునకు వైశాఖమాసవ్రత విశిష్టతను వివరించుచు గృహగోధికావృత్తాంతమును వివరించెను.

వైశాఖ పురాణం ఆరవ అధ్యాయము సంపూర్ణము

9వ దినము, అయోధ్యకాండ

9వ దినము, అయోధ్యకాండ
ఆ అయోధ్యా నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందని ఆనందంగా ఉన్నారు, అందరి ఇళ్ళముందు కళ్ళాపి జల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లని దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులూ పాటలు పాడుతూ, నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్య ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది, శ్రీమహావిష్ణువుని ఆరాధన చేసింది.

ముందురోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడై దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజూ ఉదయాన్నే నిద్రలేచి, స్నానం పూర్తిచేసుకొని, సంధ్యావందనం చేసుకొని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం దెగ్గరకి వచ్చిన జానపదుల సంఖ్య ఎంతంటే, పదిహేను పక్కన పదిహేను సున్నాలు పెడితే ఎంతో, అంత. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రములో పడవ వెళుతున్నప్పుడు నీళ్ళని ఎలా చీల్చుకొని వెళుతుందో, అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్యనుండి వెళ్ళాడు.

అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో, కుబ్జ(గూని) అయిన మంథర(పుట్టినప్పటినుంచి కైకేయకి దాసిగా ఉన్నది) చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలని చూసిన మంథర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మంథర ఆమెతో " ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య, ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుంది ఏంటి " అని అడిగింది. అప్పుడా కౌసల్య దాసి " కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జెరగబోతోంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు చూశావా " అనింది. వెంటనే మంథర కైకేయి దెగ్గరకి వెళ్ళింది.

ఒక చక్కని హంసతూలికాతల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంథర ఇలా చెప్పడం ప్రారంభించింది.............
అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం ద్వద్వినాశనం |
రామం దశరథో రాజా యౌవరాజ్యే భిషేక్ష్యతి ||




" నీకు నాశనం ప్రారంభమయ్యింది కైకా, రాముడికి యువరాజ పట్టాభిషేకం జెరుగుతోంది. పిచ్చిదానా చూశావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహు చతురుడు, ద్రోహి. వృద్ధాప్యంలొ ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని, తనకి కావలసిన భోగాలని నీవద్ద అనుభవిస్తూ, ఏమి తెలియనివాడిలా, తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ, నీకు పెద్ద మహోపకారం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయించాడు. గమనించావ కైకా " అని అనింది మంథర. ఈ మాటలు విన్న కైక ఇలా అనింది......

" అయ్యో, అలా అంటావేంటి మంథర. నాకు సంబంధించినంతవరకు రాముడికి భరతుడికి తేడా లేదు, నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో, మమ్మల్ని కూడా అలానే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జెరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏమి ఉంటుంది, ఎంత గొప్ప శుభవార్తని తెచ్చావు నువ్వు. ఈ బహుమానం తీసుకో " అని ఒక బహుమతిని ఇచ్చింది.


కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంథర తీసుకోకుండా విసిరేసి ఇలా అనింది.........
" మూర్ఖురాలా! నేను చెప్పింది నీకు అర్ధం అవ్వడంలేదు, అందుచేత నువ్వు పాముని కౌగలించుకొని పడుకోడానికి సిద్ధపడుతున్నావు. దశరథుడు నీకు ఇష్టమైన పనులే చేస్తాడని అనుకుంటున్నావు. నీకు జెరుగుతున్న అన్యాయాన్ని నువ్వు ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు. రాముడితో పాటు పట్టాభిషేకానికి యోగ్యత ఉన్నవాడు భరతుడొక్కడే. అందుకే రాముడికి భరతుడంటే భయం. అందుకే యువరాజ పట్టాభిషేకం భరతుడు లేకుండా చూసి రాముడు చేసుకుంటున్నాడు." అనింది.

"చేసుకోని, అందులో తప్పేముంది, రాముడు పరిపాలన చేసిన తరువాత భరతుడు పరిపాలిస్తాడు " అని కైకేయ అనింది.

అప్పుడు మంథర " పిచ్చిదానా! నీకు అర్ధం కావడం లేదు, ఒకసారి రాముడికి దశరథ మహారాజు యువరాజ పట్టాభిషేకం చేశాక, ఇక జన్మలో భరతుడు రాజు కాలేడు. రాముడు కొన్ని వేల సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు, తదనంతరం రాముడి పుత్రులు పరిపాలిస్తారు. నీ కొడుకు ఒక్కనాటికి రాజు కాలేడు. కాని ఒక మాట గుర్తుపెట్టుకో, సుమిత్రకి ఉన్న ఇద్దరు కుమారులలో ఒకడైన లక్ష్మణుడు సర్వకాలములయందు రాముడితోనే ఉంటాడు. అందుకనే రాముడు లక్ష్మణుడిని తన దెగ్గర ఉంచుకున్నాడు, కాని శత్రుఘ్నుడు భరతుడితో ఉంటాడు కనుక శత్రుఘ్నుడిని తన దెగ్గర ఉంచుకోలేదు. ఒక పెద్ద చెట్టుని నరకాలంటే, ముందు ఆ చెట్టు చుట్టూ ఉన్న పొదలని తీసేయ్యాలి, అప్పుడే ఆ చెట్టుని నరకగలము. అలాగే భరతుడిని తీసేయ్యాలంటే భరతుడితో ఉంటున్న శత్రుఘ్నుడిని కూడా తీసెయ్యాలి. అందుకని అవసరం ఉన్నా లేకున్నా శత్రుఘ్నుడిని భరతుడితో పంపించి ఇద్దరినీ లేకుండా చేశాడు రాముడు. అకస్మాత్తుగా యువరాజ పట్టాభిషేకాన్ని తన తండ్రికి చెప్పి ప్రకటించాడు. ఇలాంటి విషయాల్లో రాముడు చాలా తెలివైన వాడు. ప్రజలందరి మద్దత్తు కూడబెట్టుకున్నాడు. వాళ్ళందరితో రాముడు రాజు కావాలని ఆమోదం పొందాడు. భరతుడు ఇక్కడే ఉంటె రోజూ తన తండ్రికి సేవ చేసేవాడు, అప్పుడు దశరథుడికి భరతుడి మీద ప్రేమ పెరిగేది. అలా జెరగకుండా ఉండడానికే భరతుడిని రాజ్యం నుంచి పంపించేసాడు రాముడు. రాముడు రోజూ పితృసేవ, పితృసేవ అని దశరథుడి చుట్టూ తిరిగి పట్టాభిషేకం పొందుతున్నాడు. రాముడికి లక్ష్మణుడితో సమస్యలు ఉండవు, కావున భరతుడిని అయోధ్యకి రాకముందే మట్టుపెట్టేస్తాడు. అందుకని కైకా నా మాట విని నీ కొడుకుని అయోధ్యకి రానివ్వమాకు. అటునుంచి అటు అరణ్యాలకి పారిపొమ్మని చెప్పు. ఒకసారి రాముడికి పట్టాభిషేకం అయితే ప్రజలకి ఆయన మీద ఉన్న నమ్మకం ఇంకా పెరుగుతుంది. ఇంక రాజ్యంలో తనకి శత్రువర్గం అనేది లేకుండా చేసుకుంటాడు.

ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విషం |
ఉపస్థాస్యసి కౌసల్యాం దాసీవత్త్వం కృతాఞ్జలిః ||

ఇన్నాళ్ళు అందగత్తెనన్న అహంకారంతో, భర్తని కొంగుకి ముడేసుకున్నానన్న అతిశయంతో కౌసల్యతో ప్రవర్తించావు. ఇప్పుడు కౌసల్య నీకు పాఠం చెప్పడం ప్రారంభిస్తుంది. కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వేమో అడవులు పట్టి పారిపోయిన వాడికి తల్లివి. అప్పుడు నువ్వు దశరథుడికి భార్యగా కాదు కౌసల్యకి దాసిగా బతకాలి. అన్నంకోసం రోజూ కౌసల్య దెగ్గరికి వెళ్ళి వంగి దండం పెట్టాలి " అని మంథర కైకేయతో అనింది.

మంథర చెప్పిన ఈ మాటలు విన్న కైకేయ మనసులో దురాలోచన ప్రవేశించింది. ఆమె వెంటనే మంథరతో......" నేనూ నా కొడుకు ఈ ఉపద్రవం నుంచి బయటపడాలంటే ఏమి చెయ్యమంటావు " అని అడిగింది. అప్పుడు మంథర ఏమి చెప్పిందంటే..................
అద్య రామమితః క్షిప్రం వనం ప్రస్థాపయామ్యహం | యౌవరాజ్యే చ భరతం క్షిప్రమేవాభిషేచయే ||

" ఏ రాముడు తన గుణములు చేత, పితృవాక్య పరిపాలన చేత, తండ్రిని సేవించడం చేత రాజ్యాన్ని పొందుతున్నాడో, ఆ రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు జటలు కట్టుకొని, నారచీరలు కట్టుకొని దండకారణ్యానికి పంపాలి. నీ కొడుకుకి అదే ముహూర్తానికి పట్టాభిషేకం చేయించాలి. రాముడు పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి వెళ్ళడం వల్ల నీ కొడుకు సింహాసనం మీద కూర్చొని ప్రజలందరిలోను మంచి మద్దత్తు సంపాదిస్తాడు. నీ కొడుకు ప్రజల గుండెల్లో బాగా పాతుకుపోతాడు. తరువాత రాముడు తిరిగొచ్చినా తనకి ఎదురుతిరగకుండా తప్పిస్తాడు. కాబట్టి రాముడిని పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకి పంపడం, నీ కొడుక్కి పట్టాభిషేకం చేయడం, ఈ రెండు వారాలని అడుగు " అని చెప్పింది.

"మంథరా! నా కొడుక్కి యువరాజ పట్టాభిషేకం, రాముడికి అరణ్యవాసం ఎలా కలుగుతుంది " అని కైకేయ మంథరని అడిగింది. అప్పుడా మంథర.............

" ఆ, నీకు తెలీదా ఏంటి, నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు. ఒకనాడు ఇంద్రుడికి వైజయంత నగరంలో తిమిధ్వజుడు(శంబరాసురుడు) అనే రాక్షసుడితో యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో ఇంద్రుడు ఒక్కడే గెలవలేక దశరథుడి సహాయం అడిగాడు. అయితే దశరథుడు అన్ని విద్యలు తెలిసున్న నిన్ను కూడా తనతో పాటు తీసుకెళ్ళాడు. ఆ తిమిధ్వజుడు దశరథుడిని బాగా కొట్టేసరికి, భర్తని రక్షించుకోవడం కోసం సారధ్యం చేస్తున్న నువ్వు దశరథుడిని రాక్షసుల నుంచి తప్పించి దూరంగా తీసుకెళ్ళావు. అక్కడ సేదతీరుతున్న మీ మీద రాక్షసులు మళ్ళి దాడిచెయ్యగా, నువ్వు వాళ్ళనుంచి తప్పించుకొని మళ్ళి వేరొక చోటికి తీసుకెళ్ళావు. అలా రెండుసార్లు రక్షించడం వల్ల దశరథుడు నీకు రెండు వరాలిస్తాను కోరుకోమన్నాడు. కాని అప్పుడు నువ్వు ఏమి కోరికలు లేవని అడగలేదు, అవసరమైనప్పుడు అడుగుతానన్నావు. నువ్వు మరిచిపోయావేమో, ఈ విషయాలని నాకు చెప్పింది నువ్వే. ఎప్పుడైనా అడుగుతానన్నావుగా, ఇప్పుడు సమయం వచ్చింది, ఆ రెండు వరాలు అడుగు. నువ్వు అడిగితే ధర్మానికి కట్టుబడే దశరథుడు మాట తప్పడు." అని చెప్పింది.

ఈ మాటలు విన్న కైకేయ పరమసంతోషంతో " ఓ మంథరా! నువ్వు గూనితో ఒంగి, తలూపుతూ మాట్లాడుతుంటే గాలికి కదులుతున్న తామర పువ్వులా ఉన్నావే. భరతుడికి పట్టాభిషేకం అవ్వగానే నీ గూనికి బంగారు తొడుగు చేస్తాను, బంగారపు బొట్టు చేయిస్తాను, రాజుల బుర్రల్లో ఎన్ని ఆలోచనలు, తంత్రాలు ఉంటాయో అవన్నీ నీ గూనిలో ఉన్నాయి " అనింది. అప్పుడా మంథర..............నాతో మాట్లాడడం కాదమ్మా, నువ్వు పెట్టుకున్న ఆభరణాలు, కట్టుకున్న పట్టుచీర అవతల పారేసి, ఒక ముతక వస్త్రం కట్టుకొని కోపగృహంలో నేల మీద పడుకో, అప్పుడు దశరథుడు వచ్చి నీకు వజ్రాలు, ముత్యాలు, రత్నాలు ఇస్తానంటాడు. ఆయన మాటలకి నువ్వు లొంగిపోకు, మంకుపట్టు పట్టి రెండు వరాలు ఇస్తావా చస్తావ అని నిలదియ్యి అని అనింది. అయితే కోపగృహం నుంచి ఆనందంతో వస్తున్న కైకేయనో, లేకపోతే నా శవాన్నో చూస్తావు నువ్వు అని ఆ కైకేయ అలంకారాలన్నీ తీసేసి లోపలికి వెళ్ళి పడుకుంది.


అటుపక్క దశరథుడు పట్టాభిషేకానికి చెయ్యవలసిన పనులని పురమాయిస్తూ తనకి అత్యంత ప్రియమైన కైకేయకి స్వయంగా తానె ఈ శుభవార్త చెప్పాలని కైకేయ మందిరానికి వచ్చాడు. ఎప్పుడూ నెమళ్ళు, హంసలు, సంగీత ధ్వనులు, పాటలు పాడేవాళ్ళు, హంసతూలికాతల్పాలు, ముత్యాలతో కట్టిన పరదాలతో రమణీయంగా ఉండే ఆ మందిరంలొ కైకేయ ఎక్కడా కనపడలేదు.  కైకేయ కనపడకపోయేసరికి అక్కడున్న దాసిని అడుగగా, కైకమ్మ ఎందుకనో కోపగృహంలో నేలమీద పడి ఉందన్నారు ఆ దాసీలు. దశరథుడు గబగబా ఆ కోపగృహం వైపు వెళ్ళాడు. అక్కడికి వెళ్లేసరికి కైకేయ నేలమీద పడిఉండడం చూసి తట్టుకోలేకపోయాడు. అప్పుడు దశరథుడు కైకేయతో ఇలా అన్నాడు..........


" కైకేయ, నీకు ఎమన్నా వ్యాధి వచ్చిందా, అనారోగ్యంతో ఉన్నావా, మన రాజ్యంలో ఎందరో గొప్ప గొప్ప వైద్యులు ఉన్నారు, వాళ్ళందరిని పిలిపిస్తాను, నువ్వు అలా పడిఉంటె నా హృదయం చాలా తల్లడిల్లిపోతుంది, నీ మనస్సులో ఏదన్నా కోరిక ఉంటె చెప్పు, తప్పక తీరుస్తాను.


అవధ్యో వధ్యతాం కో వా కో వా వధ్యో విముచ్యతాం |
దరిద్రః కో భవేదాఢ్యో ద్రవ్యవాన్వాప్యకిఞ్చనః ||

ఒకవేళ చంపవలసిన వ్యక్తి మీద నువ్వు ప్రసన్నురాలివైతే చెప్పు వాడిని వదిలిపెట్టేస్తాను. అలాగే చంపవలసిన అవసరం లేని వ్యక్తి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని చంపేస్తాను. నీకు ఒక దరిద్రుడి మీద ప్రసన్నత కలిగితే చెప్పు వాడిని ఐశ్వర్యవంతుడిని చేస్తాను. ధనవంతుడి మీద నీకు కోపం వస్తే చెప్పు వాడిని క్షణంలో దరిద్రుడిని చేస్తాను. నేను, నా భార్యలు, నా రాజ్యం, నా పరివారం అందరం నీ అధీనం కైక. నీ కోరికెంటో చెప్పు, దాన్ని తప్పకుండా తీరుస్తాను " అన్నాడు.


నా కోరిక ఏంటో నీకు చెప్తే, నువ్వు ఇలాంటి కోరిక కోరావేంటని అంటావు, కాబట్టి ముందు నా కోరికలని తీరుస్తానని ప్రమాణం చేస్తే అప్పుడు నా కోరికేంటో చెప్తాను అని కైకేయ అనింది.

అప్పుడు దశరథుడు " ఎవరిని నేను ఒక్క క్షణం చూడకపోతే నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో, ఎవరిని విడిచి ఉండలేనో, ఎవరి మాట నా చెవిన పడకపోతే నా ప్రాణాలు ఉండవో అటువంటి రాముడి మీద ఒట్టు పెట్టి చెప్తున్నాను కైక, నువ్వు అడిగిన కోరికలు తప్పకుండా తీరుస్తాను " అన్నాడు. అప్పుడా కైక..............

" రాజు చెప్పిన మాటని మీరు వింటున్నారు కదా ఓ రాత్రి దేవతలారా!, పగటి దేవతలారా!, గృహ దేవతలారా!, సూర్యుడా, చంద్రుడా, సమస్త దేవతలారా, భూమి, అష్టదిక్పాలకులార,  మీరందరూ నా తరపున సాక్షి. నేను కోరికలు కోరిన తరువాత ఆ కోరికలు తప్పకుండా ఇస్తానని రాజు నాకు మాట ఇచ్చాడు. రాజా, జ్ఞాపకం తెచ్చుకో, ఒకనాడు శంబరాసురుడు మీదకి యుద్ధానికి వెళ్ళాము, అప్పుడు నేను నిన్ను రెండు సార్లు రక్షించాను, అప్పుడు నువ్వు నాకు రెండు వరాలిచ్చావు. ఆ రెండు వరాలని ఇప్పుడు అడుగుతున్నాను అని......

అభిషేకసమారంభఓ రాఘవస్యోపకల్పితః |
అనేనైవాభిషే కేణ భరతో మేభిషిచ్యతాం |
నవ పఞ్చ చ వర్షాణి దణ్డకారణ్యమాశ్రితః |
చీరాజినజటాధారీ రామో భవతు తాపసః |
భరతో భజతామద్య యౌవరాజ్యమకణ్టకం ||

" ఏ రాముడికి యువరాజ పట్టాభిషేకం చేద్దామని నువ్వు సమస్త సంభారములు తెచ్చి సిద్ధం చేసావో అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి. పట్టాభిషేకం చేయించుకోవలసిన రాముడు తొమ్మిది+అయిదు సంవత్సరాలు దండకారణ్యానికి వెళ్లి నారచీర, జటలు కట్టుకొని, మాంసాహారం తినకుండా, తపస్వి లాగ బతకాలి "  అని అనింది.
 (త్రేతాయుగ ధర్మం ప్రకారం 14 సంవత్సరాలు రాజ్యానికి దూరమైన వ్యక్తి తిరిగి రాజు కాలేడు, అందుకని కైక రాముడిని 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళమనింది. కాని ఎవరియందు కామ క్రోధాలు అతిగా ప్రకాశిస్తాయో, వాళ్ళని దేవతలు ఆవహించి దైవకార్య నిమిత్తము వాడుకుంటారు. అందుకే దేవతలు కైకేయని ఆవహించి ఆమెతో 14 అనిపించకుండా 9+5(నవ పఞ్చ చ వర్షాణి) అనిపించారు, కైకేయ అలా అనడం వల్ల రాముడు రావణసంహారణ అనంతరం రాజారాముడిగా పట్టాభిషేకం పొందాడు అని పెద్దలు చెప్తారు.)


అప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్న దశరథుడు ఈ మాట వినగానే స్పృహ కోల్పోయి ఉన్న చోటనే కూలబడ్డాడు. తరవాత అక్కడినుంచి నేల మీద పడ్డాడు. ఆయన అలా పడిపోతే కైకేయ కనీసం లేపలేదు. కొంతసేపటికి తేరుకున్న దశరథుడు..................

" ఎంతమాట అన్నావు కైక. జీవితంలో ఇటువంటి మాట వినవలసి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. రాముడు నీకు చేసిన అపకారమేమిటి. రాముడు ఎన్నడూ కౌసల్యని ఒక్కదాన్నే మా అమ్మ అని సేవ చెయ్యలేదు, కౌసల్యని చూసినట్టే నిన్ను, సుమిత్రని చూశాడు. ఎన్నడూ మాట తప్పలేదు రాముడు. రాముడి గురించి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు ఈ కోసల దేశంలో ఎవరూ లేరు. నీ దెగ్గరికి ఎప్పుడు వచ్చినా రాముడికి పట్టాభిషేకం చెయ్యాలి, నాకు భరతుడికి రాముడికి తేడా లేదు అనేదానివి కదా, మరి ఇప్పుడు నువ్వు ఎవరి చెప్పుడు మాటలు విని ఇలా మాట్లాడుతున్నావు. గురువులకి ఎంతో సేవ చేసిన నా రాముడు హాయిగా హంసతూలికా పాన్పులమీద నిదురించవలసిన వాడిని నువ్వు ఎందుకని తపస్వి లాగ జెటలు కట్టుకొని అడవుల్లో దొరికే తేనె, కందమూలాలు తిని, చెట్ల కింద పడుకొమ్మని కోరుకున్నావు. ఇదంతా ఊహించి నేను బతకగలనా. నేను ఇప్పుడు జీవితంలో చిట్టచివరి దశకి వచ్చాను కైక, అందుకని రాముడిని విడిచిపెట్టి నేను ఉండలేను, కావాలంటే కౌసల్యని వదిలిపెట్టమను, సుమిత్రని వదిలిపెట్టమను, నా ప్రాణాలే వదిలెయ్యమను, నన్ను సింహాసనం మీద నుంచి దిగిపొమ్మను, ఈ కోరికలన్నీ తీరుస్తాను. నీ పాదములు పట్టి ప్రార్ధిస్తున్నాను కైక, రాముడిని పధ్నాలుగు ఏళ్ళు పంపించెయ్యమని అనద్దు.


రాముడిని నేను పంపించేస్తే, సీతమ్మ నా దెగ్గరకు వచ్చి, మామగారు నా భర్త ఏ తప్పు చేసాడని ఆయనని అడవులకు పంపించారు అని ఏడుస్తూ నన్ను ప్రశ్నిస్తే, నేను ఏ సమాధానం చెప్పగలను. రాముడే కనుక అడవులకు వెళితే నేను బతకలేను, శవమై కిందపడతాను , నువ్వు వైధవ్యాన్ని పొంది దిక్కులేని దానివి అవుతావు. కావున నన్ను, నీ మంగళ్యాన్ని కాపాడుకో. రాముడు భరతుడికి ఏ అపకారము చెయ్యడు. నిన్ను కన్నతల్లిని చూసినట్టు చూస్తాడు. నీకు ఎవరో లేనిపోని విషయాలు నూరిపోశారు. నేనే కనుక రాముడిని అడవులకు పంపితే, ఏ తప్పు చెయ్యని రాముడిని అడవులకు ఎలా పంపగలిగావు, నిన్ను మేము ఎలా నమ్మము అని సుమిత్ర అంటుంది, అప్పుడు నేను ఏ సమాధానం చెప్పను. అరవై వేల సంవత్సరాలు రాజ్యపాలనం చేసిన నేను బయటికి వెళుతుంటే, పట్టపగలు సురాపానం చేసిన బ్రాహ్మణుడు నా పక్కన వెళుతూ, యవ్వనంలో ఉన భార్య మాటకోసం ధర్మాత్ముడైన కొడుకుని అడవికి పంపించి బతుకుతున్నవాడు ఈ దశరథుడని దెప్పిపొడుస్తాడు. ఆనాడు నేను బతికినా చనిపోయినట్టే, నాకు అటువంటి అపకీర్తి తేవద్దు. నన్ను ఒక తల్లి-బిడ్డని చూసినట్టు, ఒక అక్క-చెల్లెలు అన్నదమ్ములని చూసినట్టు, ఒక దాసి యజమానిని చూసినట్టు చూసింది కౌసల్య. అపారమైన సుగుణాభి రాముడికి తల్లి అయ్యింది కౌసల్య, అయినా నేను కౌసల్యని ఒక్కనాడు సత్కరించలేదు. ఎందుకో సత్కరించలేదో తెలుసా, నీకు కోపంవస్తుందని సత్కరించలేదు. నేను ఎన్నడూ వారి గృహాలకి వెళ్ళలేదు, కేవలం నీయందే ప్రీతి పెట్టుకొని బ్రతికాను. నేను వృధ్యాప్యంలోకి వెళుతున్నాను కనుక ఎక్కువ కాలం బతకలేను అందుకని రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి ఒప్పుకున్నాను.

ఆ రాముడే అరణ్యాలకి వెళ్ళిననాడు నేను మరణిస్తాను, నేను మరణించానని తెలిసి కౌసల్య కూడా మరణిస్తుంది, నేనూ కౌసల్య మరణించాక ఈ రాజ్యం సంతోషంగా ఉండలేదు. నువ్వు భరతుడికి రాజ్యం ఇవ్వాలని చూస్తున్నావు, కాని భరతుడు రాజ్యం తీసుకుంటాడని నేనూ అనుకోను. చిట్టచివరికి అందరిచేత అపవాదు పొందిన దానివై, దిక్కులేని దానివై, నీ బాధ చెప్పుకోడానికి భర్త లేక విధవవైపోతావు. రాముడిని అడవులకు పంపితే నేను చనిపోతాను. నేను చనిపోయాక స్వర్గానికి వెళితే, అక్కడున్న ఋషులు, మహర్షులు నన్ను పిలిచి రాముడెలా ఉన్నాడని ఆడితే నేను ఏమి చెప్పగలను. నువ్వెవడివి నాన్న నన్ను అడవులకు పంపించడానికి అని నన్ను రాముడు ఖైదు చేస్తే, నేను చాలా సంతోషపడిపోతాను. కాని నా రాముడు అలా చెయ్యడు, నాన్న! నువ్వు చెప్పావు అందుకని నేను అరణ్యాలకి వెళుతున్నాను అని అంటాడు, అది నేను తట్టుకోలేను, రాముడు అరణ్యాలలో కష్టాలు పడుతుంటే నేను ఇక్కడ సుఖంగా ఎలా ఉండగలను. నిజంగా రాముడు అరణ్యాలకి వెళ్ళిపోవడం భరతుడి కోరికే అయితే, నా శరీరం పడిపోయాక నాకు తర్పణ పెట్టకూడదు, ఉదకక్రియ చెయ్యకూడదు, నువ్వు నా శవాన్ని ముట్టుకోకూడదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు, నీ రెండు కోరికలని ఉపసంహరించుకో, నేను అడుగుతున్నానని కాదు, ఒక ముసలివాడు, ఎందుకూ పనికిరాని వాడు అడుగుతున్నాడని నాకు నువ్వు బిక్ష పెట్టు, రాముడిని చూస్తూ చనిపోయే అదృష్టాన్ని నాకు ఇవ్వు ", దశరథుడు అలా చెప్పుతూ కైకేయ పాదాల మీద పడబోగా, తన పాదాల మీద పడుతున్నాడని తెలిసి కైకేయ పక్కకు జెరగగా, దశరథుడి శిరస్సు నేలకు తగిలి, స్పృహ కోల్పోయి పక్కుకు దొర్లి పడిపోయాడు.


కొంతసేపటికి దశరథుడికి తెలివి వచ్చాక కైకేయ ఇలా అనింది " ఏమయ్యా! ఇక్ష్వాకువంశములొ జన్మించానంటావు, సత్య-ధర్మములు పాటిస్తున్నానంటావు, రెండు వరాలు ఇచ్చానన్నావు, ఆ రెండు వరాలు నేను అడిగే సరికి నీకింత కష్టం కలిగిందా. ఎవరైనా వచ్చి రాముడేడని అడిగితే దండకారణ్యానికి పంపించానని చెప్పలేను అని అంటున్నావు కదా, మరి ఆనాడు నేను నీకు రెండుసార్లు ప్రాణబిక్ష పెడితే బతికినవాడివి, అలాంటి బతుకిచ్చిన కైకేయకి రెండు వరాలివ్వడం మానేసి అమాయకురాలిని చేసి వంచించినవాడ అని లోకం పిలవదా. వరాలు ఇవ్వడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నావు.

నీ వంశంలోని వాళ్ళు ఉత్తమ గతులకి వెళ్ళాలా, ఒకనాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు పావురం రూపంలో ఉన్న అగ్నిని తరుముతూ రాజు దెగ్గరికి వచ్చారు. ఆ పావురం రాజు కాళ్ళ మీద పడితే, రాజు ఆ పావురానికి శరణిచ్చాడు. ఆ పావురానికి శరణిచ్చావు బాగానే ఉంది, మరి నా ఆహారం సంగతేంటని అడిగాడు డేగ రూపంలో ఉన్న ఇంద్రుడు, ఆ రాజు యొక్క ధర్మనిష్ఠ తెలుసుకుందామని. నీకు పావురం మాంసం కావాలి కనుక ఆ మాంసం నేనిస్తాను అని, పావురాన్ని తక్కెటలో ఒక పక్క పెట్టి, మరొకపక్క తన శరీరం నుండి కోసిన కొంత మాంసాన్ని పెట్టి, ఆ మాంసాన్ని ఇచ్చినవాడు నీ వంశంలో పుట్టిన శిబి చక్రవర్తి. అలాగే ఒకనాడు అలర్కుడి దెగ్గరికి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి నిలబడితే, నీకేమి కావాలో కోరుకోమన్నాడు రాజు. అయితే నీ కళ్ళని ఇచ్చేస్తావ అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇస్తానన్నాడు కాబట్టి తన రెండు కళ్ళని తీసి ఇచ్చాడు అలర్కుడు. అలాంటి వంశంలో పుట్టి రెండు వరాలు భార్యకి ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకు తిరగడానికి నీకు సిగ్గుగా లేదా.


దుర్మతే! ధర్మాన్ని వదిలేసి, రాముడికి పట్టాభిషేకం చేసేసి నువ్వు కౌసల్యతో రోజూ కులుకుదామని అనుకుంటున్నావా. నీ బతుకేంటో నాకు తెలీదనుకున్నావా. నాకు రెండు వరాలు ఇచ్చి తీరాల్సిందే. నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తే, కౌసల్య రాజమాత అయితే, నేను కౌసల్యకి నమస్కారం చేస్తానని అనుకుంటున్నావా, ఒక్కనాటికి అది జెరగదు. నేను ప్రాణాలైనా విడిచిపెడతాను కాని ఒక్కనాటికి కౌసల్యకి నమస్కారం చెయ్యను. నా రెండు వరాలు నాకు ఇవ్వాల్సిందే " అని అనింది.

అప్పుడు దశరథుడు " ఒకవేళ ఇదే నీ పట్టుదల అయితే, నువ్వు నేలమీద పడి ముక్కలయిపో, నువ్వు నిలువునా మండిపో, సర్వనాశనమయిపో నీ కోరిక మాత్రం నేను తీర్చను, ఎందుకంటే నువ్వు ధర్మబద్ధమైన కోరిక కోరలేదు. లోకమంతా ఎవరిని రాజుగా కోరుకుంటుందో, ఎవరిమీద లోకమంతా ఒక అపవాదు వెయ్యలేదో అటువంటి మహాత్ముడిని ఎటువంటి కారణం లేకుండా అరణ్యాలకి పంపమంటున్నావు. నువ్వు నాశనమయిపోయినా సరే, నేను మాత్రం నీ కోరిక తీర్చను " అన్నాడు.

అలా కైకేయతో ఏడ్చి ఏడ్చి మాట్లాడుతూ దశరథుడు అప్పటికి 15 సార్లు స్పృహతప్పాడు. అలా ఏడుస్తూ కైకేయతో......
" రాముడు దండకారణ్యానికి వెళితే ఎంత కష్టమొస్తోందో, ప్రజలు ఎంత తల్లడిల్లిపోతారో నువ్వు ఊహించలేకపోతున్నావు. నేను అదృష్టవంతుడిని అయితే, అసలు రాముడిని అరణ్యాలకి వెళ్ళు అన్న మాట అనకుండా ఇప్పుడే మరణించాలని కోరుకుంటున్నాను. మరొక్కసారి నీ పాదాలు పట్టుకుంటాను " అని మళ్ళి కైకేయ పాదాల మీద పడబోగా, ఆవిడ మళ్ళి తప్పుకుని ఇలా అనింది.............


త్వం కత్థసే మహా రాజ సత్య వాదీ ద్ఋఢ వ్రతః |
మమ చ ఇమం వరం కస్మాత్ విధారయితుం ఇచ్చసి ||

" సత్యం, ధర్మం అని అంటావు, సత్యానికి ధర్మానికి కట్టుబడ్డానంటావు, రోజూ ఇన్ని ప్రగల్భాలు చెప్తావు. రెండు వరాలు నేను అడిగితే ఇంత బాధపడుతున్నావు, మాట తప్పుతున్నది నువ్వు కాదా " అని అడిగింది.

అలా ఆ రాత్రి దశరథుడు ఎంత బతిమాలీనా కైకేయ ఒప్పుకోవడంలేదు. ఏడ్చి ఏడ్చి ఆయన కళ్ళన్నీ ఉబ్బిపోయాయి. జుట్టు చెరిగిపోయింది. నీరసం వచ్చింది. అప్పుడాయన........
" ఓ రాత్రి!, నాకు నువ్వన్నా ఒక వరం ఇవ్వు. ఈ రాత్రిని ఇలాగె ఉండని, తెలవారనివ్వమాకు. తెల్లవారితే రాముడితో నేను ఏమి మాట్లాడను, అందుకని నువ్వు ఇలాగె ఉండిపో. వద్దులే నువ్వు తొందరగా వెళ్ళిపో, ఎందుకంటే ఇలా చీకటిగానే ఉంటె నేను ఇక్కడే ఉండాల్సివస్తుంది, నేను అంతసేపు ఈ కైకేయని చూస్తూ ఉండలేను, కాబట్టి నువు తొందరగా తెలవారిపో " అంటూ తాను ఏమి మాట్లాడుతున్నాడో తెలియని ఉన్మాద స్థితికి వెళ్ళిపోయాడు.

మెల్లగా తెల్లవారుతోంది..........................

అప్పుడు కైకేయ " ఇప్పుడు తెల్లవారుతోంది, రాముడు నీ ఆశీర్వాదం కోసం వస్తాడు. రాముడిని చూసిన తరువాత పుత్రవాత్సల్యంతో మాట మార్చినా, భరతుడికి రాజ్యం ఇవ్వకపోయినా, రాముడిని అరణ్యాలకి పంపకపోయినా విషం తాగి ఇదే గదిలో చనిపోతాను " అని అనింది.
అప్పుడు దశరథుడు.............
యః తే మంత్ర క్ఋతః పాణిర్ అగ్నౌ పాపే మయా ధ్ఋతః |
తం త్యజామి స్వజం చైవ తవ పుత్రం సహ త్వయా ||

" నువ్వు నన్ను ఇంత బాధపెట్టావు కాబట్టి, ఏ రాముడిని చూసి చనిపోతాను అంటె ఆ వరం కూడా ఇవ్వలేదు కనుక, మంత్రపూర్వకంగా ఏ అగ్ని సమక్షంలో నీ పాణిగ్రహణం చేశానో, అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెడుతున్నాను. ఇక నువ్వు నాకు భార్యవి కావు. నువ్వు నీ కొడుకు కలిసి రాజ్యం ఏలుకొండి. ఎవడికోసమైతే నువ్వు ఇంత దారుణానికి దిగాజారవో ఆ కొడుకుని కూడా వదిలేస్తున్నాను. భరతుడు నా శరీరాన్ని ముట్టుకోకూడదు " అన్నాడు.


అలా తెల్లవారగానే పట్టాభిషేకానికి చెయ్యాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు, బ్రాహ్మణులూ, జానపదులు, సామంతరాజులు మొదలైన వాళ్ళందరూ రాజు కోసం ఎదురుచూస్తున్నారు. అప్పుడు సుమంత్రుడు దశరథ మహారాజుని కలుద్దామని లోపలికి వెళ్ళి, మాతలి ఇంద్రుడిని ఎలా నిద్రలేపుతాడో, సూర్యుడు సమస్త లోకాలని ఎలా తన కిరణముల చేత నిద్రలేపుతాడో నేను నిన్ను అలా నిద్రలేపుతున్నాను, కాబట్టి ఓ మహారాజ నిద్రలేచి బయటకి రా అని అన్నాడు. యువరాజ పట్టాభిషేకం కోసం అందరూ బయట వేచి ఉన్నారు, ఏమి చెయ్యమంటారు అని సుమంత్రుడు దశరథుడిని అడుగగా, దశరథుడు మాట్లాడలేక, కన్నుల నుంచి నీటి ధారలు పడిపోతుండగా మరోసారి స్పృహ తప్పి పడిపోయాడు. రాజు ఇలా పడిపోయాడు ఎమిటని సుమంత్రుడు కైకేయని అడుగగా.............

" ఏమిలేదయ్య సుమంత్ర! రాముడికి పట్టాభిషేకం అన్న సంతోషంలో ఆయనకి రాత్రి నిద్రపట్టలేదు, ఇప్పుడే నిద్రపట్టింది. అందుకని అలా పడిపోయాడు. నువ్వు గబగబా వెళ్ళి రాజు పిలుస్తున్నాడని చెప్పి రాముడిని తీసుకురా " అనింది కైకేయ.


అక్కడే ఉన్న వశిష్ఠుడు మరియు ఇతర సామంతరాజులు దశరథ మహారాజు ఇంకా బయటకి ఎందుకు రావడం లేదు మాకు దర్శనం ఎందుకు ఇవ్వడం లేదని అడుగగా సుమంత్రుడు మళ్ళి లోపలికి వెళ్ళి దశరథుడిని స్తోత్రం చేయ్యబోగా, " రాముడిని తీసుకు రమ్మన్నానుగా, తొందరగా వెళ్ళి రాముడిని తీసుకురా " అని దశరథుడు అన్నాడు. వెంటనే సుమంత్రుడు రాముడిని తీసుకురావడాని బయలుదేరాడు.


ఆ రాముడి అంతఃపురం ప్రజలందరితో నిండిపోయి ఎంతో శోభాయమానంగా ఉంది. రాముడు స్నేహితులతో, బ్రాహ్మణులతో, జానపదులతో ఆ ప్రదేశం కళకళలాడుతోంది. సీతమ్మ చేత అలంకారం చెయ్యబడ్డ రాముడు ఎంతో చక్కగా ఉన్నాడు. సుమంత్రుడు వచ్చి దశరథ మహారాజు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పగా రాముడు సుమంత్రుడితో కలిసి బయలేదేరాడు. రాముడితో పాటు లక్ష్మణుడు బయలుదేరాడు, వాళ్ళతో మిగతా జనసమూహం అంతా బయలుదేరింది. దశరథుడి అంతఃపురానికి చేరుకోగానే మిగతావారందరూ బయటనే ఉండిపోయారు, రాముడు లక్ష్మణుడు లోపలికి వెళ్ళారు. జీవచ్చవంలా ఉన్న తన తండ్రిని చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. రాముడిని చూడగానే దశరథుడు మూర్చపోయాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు.........

" అమ్మ! నేను నాన్నగారిని ఎప్పుడు అలా చూడలేదు, ఎందుకమ్మా నాన్నగారు ఇలా ఉన్నారు. నావల్ల ఎమన్నా పొరపాటు జెరిగుంటే చెప్పమ్మా దిద్దుకుంటాను, ఒక్క నిమిషం నా వల్ల నాన్నగారు బాధ పడినా, ఆ జీవితం నాకు వద్దు. నాకు నిజం చెప్పవా, కౌసల్యని కాని, సుమిత్రకి కాని ఏదన్నా సుస్తీ చేసిందా, నాకు సత్యం చెప్పు తల్లి " అన్నాడు.


అప్పుడు కైకేయ " ఎంచేస్తే మీ నాన్నకి ఈ శోకం పోతుందో చెప్తాను. తీరా చెప్పాక ఇది నాకు కష్టం అని నువ్వు అనకూడదు. అది నీకు కష్టమే అయినా నువ్వు ఆ పని చేస్తే మాత్రం మీ నాన్న మళ్ళి సంతోషంగా ఉంటాడు. అలా నాకు మాట ఇవ్వు రామ, నీకు చెప్తాను " అనింది.


ఈ మాట రాముడితో కైకేయ చెప్తుంటే విన్న దశరథుడు "ఛి" అని తలవంచుకున్నాడు.

అప్పుడు రాముడు.....
తత్ బ్రూహి వచనం దేవి రాజ్ఞో యద్ అభికాంక్షితం |
కరిష్యే ప్రతిజానే చ రామః ద్విర్ న అభిభాషతే ||
" అమ్మా! రాముడికి రెండు మాటలు చేతకావమ్మా, రాముడు ఎప్పుడూ ఒకే మాట చెప్తాడు. నువ్వు అడిగినది కష్టమైనా సుఖమైనా చేసేస్తాను " అన్నాడు.

అప్పుడు కైకేయ " ఏమిలేదు రామ, మీ నాన్న సత్యవంతుడు అని పూర్వం రెండు వరాలు ఇచ్చాడు కదా అని పధ్నాలుగు సంవత్సరాలు నువ్వు నారచీరలు కట్టుకొని, జటలు కట్టుకున్న తలతో ఒక తపస్వి ఎలా ఉంటాడో అలా నువ్వు అరణ్యావాసం చెయ్యాలని, అదే ముహూర్తానికి భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలని అడిగాను, అప్పటినుంచి మీ నాన్న ఇలా పడిపోయి ఉన్నాడు. అందుకని రామ, ఈ రెండు కోరికలు నువ్వు తీరుస్తే మీ నాన్న సంతోషిస్తాడు. కాని నువ్వు ఆ కోరికలు తీరుస్తావో తీర్చవో అని మీ నాన్న బెంగాపెట్టుకొని అలా ఉన్నాడు " అనింది.


అప్పుడు రాముడు " నాన్నగారు అడగడం నేను చెయ్యకపోవడమా, తప్పకుండా చేసేస్తాను. నేను పధ్నాలుగు సంవత్సరాలు అడవులకి వెళ్ళడానికి, భరతుడికి పట్టాభిషేకం చెయ్యడానికి నాన్నగారు ఇంత బెంగ పెట్టుకోవాలా,
అహం హి సీతాం రాజ్యం చ ప్రాణాన్ ఇష్టాన్ ధనాని చ |
హ్ఋష్టః భ్రాత్రే స్వయం దద్యాం భరతాయ అప్రచోదితః ||

భరతుడికి కావాలంటే రాజ్యం ఏమిటి, సీతని ఇస్తాను, నా ప్రాణాలు ఇస్తాను, ధనమంతా ఇస్తాను. భరతుడికి యువరాజు కావాలన్న కోరిక ఉందని నాకు తెలియక నేను యువరాజు పట్టాభిషేకానికి సిద్ధపడ్డాను. తమ్ముడికి పట్టాభిషేకం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా తమ్ముడికి పట్టాభిషేకం చేసెయ్యండి. ఈ విషయం చెప్పడానికి నాన్నగారు అంత బాధ పడ్డారని తెలిసి నేను బాధపడుతున్నాను. ఆయన నన్ను అగ్నిలో దూకమన్నా దుకేస్తాను " అన్నాడు.

అప్పుడు కైకేయ " రామ! మీ నాన్న ఒక శపధం చేశాడు, అదేంటంటే నువ్వు ఈ అయోధ్యా నగరం నుంచి వెళ్ళేదాకా స్నానం చెయ్యను, భోజనం చెయ్యను అని అన్నాడు. కాబట్టి మీ నాన్నగారు సంతోషంగా ఉండాలంటే నువ్వు వెంటనే వెళ్లిపోవాలి " అనింది.

అప్పుడు రాముడు....
న అహం అర్థ పరః దేవి లోకం ఆవస్తుం ఉత్సహే |
విద్ధి మాం ఋషిభిస్ తుల్యం కేవలం ధర్మం ఆస్థితం ||
" అమ్మా! రాముడు ధనం కోసం, రాజ్యం కోసం ప్రాకులాడేవాడు కాదు, నేను ఋషిలాంటివాడిని, నాకు పితృవాక్యపరిపాలనం తప్ప ఇంకేమి వద్దు. అయినా నువ్వు నన్ను పిలిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేవాడిని కదా, ఇంత చిన్నవిషయానికి రెండు వరాలు అడిగావ అమ్మ, మీరు బెంగపెట్టుకోకండి, నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. కాని ఒక్కసారి నాన్నగారి పాదాలకి, మీ పదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోతాను " అన్నాడు.


ఇలా తండ్రి మాటని దాటనటువంటి కొడుకు పుట్టినందుకు ఇప్పుడు నాకు బాధగా ఉందని దశరథుడు మరోసారి స్పృహతప్పి పడిపోయాడు. తాను వెళితే తప్ప తండ్రి భోజనం చెయ్యడని రాముడు వెంటనే దశరథుడికి కైకేయకి పాదాభివందనం చేసి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. రాముడి వెనకాల తోక తొక్కిన నల్లత్రాచు వెళ్లినట్టు లక్ష్మణుడు ఆగ్రహంగా వెళ్ళాడు. ఇంత జెరిగినా రాముడి కాంతి తగ్గలేదు, ఆయన మనసులో ఎటువంటి వికారము లేదు, రాజ్యం పోయిందన్న బాధ లేదు, తండ్రి తొందరగా అన్నం తిని స్వస్తత పొందాలనుకొని గబగబా కౌసల్య మందిరానికి ఆశీర్వాదం కోసం వెళ్ళాడు.

కౌసల్య దేవి రాత్రంతా శ్రీమహావిష్ణువుని పూజించినదై ధ్యానం చేసుకుంటూ ఉండగా చూసిన రాముడు తడబడుతున్న అడుగులతో లోపలికి ప్రవేశించాడు.......

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...