Sunday, March 8, 2020

వాల్మీకి రామాయణం1వ దినము, బాలకాండ*** *** *** *** *** ***

వాల్మీకి  రామాయణం

1వ దినము, బాలకాండ
*** *** *** *** *** ***

వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలొ సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు.

మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా  తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.

తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||

వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె................

కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||

ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.

నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........
ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.

చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........

మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః| 
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||

ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.

ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ బ్రాహ్మణుడా!  నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి......

"నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.

బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు.

వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంబించారు. తరవాత ఆయన ఈ రామాయణాన్ని ఎవరితో పాడిస్తే బాగుంటుందని చెప్పి అక్కడున్న లవకుశలతో పాడించారు. వాళ్ళు తరవాత ఆ రామాయణాన్ని రాముడి సమక్షంలో అయోధ్యలో పాడడం మొదలుపెట్టారు.........

కథ ప్రారంభం

రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............

పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడు.

దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.

ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు.

దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, తన పత్నులని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు...........

సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం |
ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||

పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు............ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.

అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.............పూర్వకాలంలొ విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలొ వర్షాలు పడడం మానేశాయి. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.

వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.

ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........

తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||

ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు.

కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితొ ఇలా అన్నాడు...మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.
*******************************

కుటుంబం లో స్త్రీ పాత్రహిందూ సంస్కృతికి మూలాధారమైన వేదాలు స్త్రీకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చాయి. "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా" అని ఆనాడే చెప్పబడింది.స్త్రీ ఎక్కడ పుజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగాడుతారు అని అర్ధం. అంటే, స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో, అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి.

కుటుంబం లో స్త్రీ పాత్ర

హిందూ సంస్కృతికి మూలాధారమైన వేదాలు స్త్రీకి అత్యున్నత స్థానాన్ని ఇచ్చాయి. "యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా" అని ఆనాడే చెప్పబడింది.స్త్రీ ఎక్కడ పుజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగాడుతారు అని అర్ధం. అంటే, స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో, అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయి. 
ఇతర సంస్కృతుల కన్నా కొన్ని వేల సంవత్సరాల క్రితమే వేద సంస్కృతీ మహిళకు ఉన్నత స్థానాన్ని ఇచ్చింది. కుటుంబ బాధ్యతలను స్త్రీకి కట్టబెట్టినది ఆమెను ఇంట్లో కట్టిపడేయ దానికి కాదు. కుటుంబ నిర్వహణలో ఆమె ఎన్నో పాత్రలు పోషిస్తుంది. 

కుటుంబ సంక్షేమం మొత్తం ఆమె చేతులకు ఇచ్చినది ఆమె యొక్క ప్రజ్ఞను గమనించే. శుచి, శుభ్రత వంట తయారీ ఇంట్లో స్త్రీ బాధ్యత. అంటే ఇవన్ని ఆమె పాటించి, కుటుంబ సభ్యుల చేత పాటింప చేయడం ద్వార ఆమె ఒక వైద్యురాలు. పిల్లలకు విద్య బుద్ధులునేర్పి మంచి గుణములు, నడవడిక అలవాటు చేసి, సమాజమునకు ఉపయోగపడే విధంగా పిల్లలను తయారు చేయడం ద్వార ఆమె ఒక గురువు. భర్తకు అనుగుణంగా నడచుకొని, అతని ఆజ్ఞలు పాటించి, ఆతను చెడు దారులు పట్టకుండా, జీవితంలో కావలసిన చోట మంచి సలహాలు చెప్పి కుటుంబ గౌరవం నిలిపే వేళ ఆమె ఒక మంత్రి. 

అదే విధంగా సంపాదించే బాధ్యత మగవారికి, దానిని ఖర్చుపెట్టే బాధ్యత స్త్రీకి ఉండాలి అన్నాడు మనువు. వచ్చిన సంపాదనలో కొంత మిగులు చేసి, మిగిలిన దానిని సక్రమంగా వినియోగించే వేళ ఆమె ఒక ఆర్ధిక వేత్త. ఒకవేళ భర్త సంపాదన ఇంటి అవసరాలకు సరిపోకపోతే ఇల్లు నడవడానికి ఆమె కూడా కష్టపడి సంపాదించగల ధైర్యవంతురాలు స్త్రీ. ఇంట్లో ఎంతో అవసరమైన ఖర్చు వచ్చినపుడు పిల్లలతో సహా, భర్తకు కూడా ఎక్కడో అక్కడనుంచి తీసి డబ్బు సర్దగల సమర్ధురాలు స్త్రీ. అలాగే ఎన్ని కష్టాలు వచ్చిన ధైర్యంగా ఎదుర్కోగల నిబ్బరం స్త్రీకి ఉంటుంది. 

ఇంటికి వచ్చే అతిథులను, బంధువులను గౌరవించే వేళ ఆమె అన్నపూర్ణ. పిల్లల సంరక్షణ, పెద్దవారి సేవ, అతిథి అభ్యాగాతుల సేవ, ఇలా ఎన్నో పనులు ఒకేసారి చేయగల సామర్థ్యం ఆమె సొత్తు. ఇలా కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలలో ఆమెదే ప్రధాన పాత్ర. 

ఆమె చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట, కుటుంబం మిద ప్రభావం చూపుతాయి. ఆమె పాత్ర వాళ్ళ కుటుంబంలో సంతోషం తాండవిస్తుంది. ఒక కుటుంబం లేదా పిల్లలు బాగుపడిన, లేదా చెడిపోయిన దానికి బాధ్యురాలు స్త్రీయే. 

స్త్రీ శారీరిక శక్తీ లో మగవారి కన్నా బలహీనురాలు అయినప్పటికీ, మానసిక శక్తి లో ఆమెకు ఎవరు సాటిలేరు. కుటుంబాలు అన్ని సంతోషంగా ఉంటె సమాజంలో సంతోషం నిండుతుంది. లోకంలో ఇబ్బందులుండవు. ఇది స్త్రీకి మన సంస్కృతీ ఇచ్చిన అసలు స్థానం. కానీ నాగరికత పెరిగి సమాజం ముందుకు పోతున్న కొద్దీ, సమాజంలో స్త్రీకి గౌరవం లేకుండా పోతోంది. ఆమె మిద ఎన్నో అత్యాచారాలు, అకృత్యాలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితిని ఎదుర్కొని మళ్లీ స్త్రీ యొక్క గౌరవాన్ని పెంపోదించే దిశగా అందరు కృషి చేయాలి.

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు.

ప్రతి వ్యక్తీ అనుదినం ఈ మూడు కోరికలు ఆశిస్తే చాలు.

ఈశ్వరారాధనలో స్వామిని అర్ధించవలసిన ఆకాంక్షను ఒక శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు.

"అనాయా సేన మరణం వినా దైన్యేన జీవనమ్! 
దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే!!

ఆయాసం లేకుండా మరణం , దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం..ఈ మూడింటినీ ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్ధిస్తున్నారు.

మొదటిది....ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు. కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా; భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం.

రెండవది...బతుకు గడవవలసిన తీరు. ఇది దైన్యం లేకుండా ఉండాలి. దిగులు, ఆధివ్యాదులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక. అదే దీనిలో ఉంది.

మూడవది...అంతిమలక్ష్యం,జీవితానికి చివరి గమ్యం మృత్యువు కాదు. మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి? చేసిన దుష్కర్మలకు అనుగుణంగా దుర్గతులు తప్పవు. అందుకే మళ్ళీ దుర్గతుల పాలవకుండా, జన్మ పరంపరలకు లోనుకాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి.

ఆ లక్ష్యం నెరవేరాలంటే జీవితమంతా సద్బుధ్ధితో, సత్కర్మలతో, సద్భక్తితో సాగాలి. అటువంటి జీవితమే దైన్యరహిత జీవితం. నిరంతరం భక్తితో సదాశివుని స్మరించేవారికి , ఆరాధించేవారికి ఈ మూడు కోరికలు నేరవేరతాయనడంలో సందేహం లేదు.

ఇంతకీ మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అని అడిగే వారు, మంత్రానికి జ్వరం తగ్గుతుందా? అని కూడ అడుగవచ్చు. ఇక్కడ జ్వరం భౌతికపరమనదే తప్ప, ఆధ్యాత్మిక పరమైనది కాదు.

ఇంతకీ మంత్రాలకు చింతకాయలు రాలతాయా? అని అడిగే వారు, మంత్రానికి జ్వరం తగ్గుతుందా? అని కూడ అడుగవచ్చు. ఇక్కడ జ్వరం భౌతికపరమనదే తప్ప, ఆధ్యాత్మిక పరమైనది కాదు.

జ్వరం ఉష్టతత్త్వం. నృసింహతత్త్వం ఉష్ణతత్త్వం. ‘ఉష్ణం ఉష్ణేణ శీతలం’ అని అన్నారు. అంటే, నిప్పు నిప్పును చల్లబరుస్తుందని అర్థం. ఈ మంత్రంలోని అసలు రహస్యం ఇదే. అందుకే మన పెద్దలు జ్వరం వంటి రుగ్మతలు తగ్గడానికి నృసింహస్తోత్రాన్ని పఠించమని చెప్పేవారు.ఆయన జ్వరం నుంచి కాపాడటమే కాదు, భూతప్రేతపిశాచ పీడల నుంచి రక్షించి, శత్రుబాధలను కూడ తొలగిస్తాడు. కళ్ళు, మెడ, తల, కడుపులో ఏర్పడే రోగ విముక్తి కోసం, నారసింహ మంత్రాన్ని జపించి,
విభూదిని ధరిస్తే తగిన ఫలితం ఉంటుందనేది పెద్దల వాక్కు.

నారసింహాయ విద్మహే
వజ్రనఖాయ ధీమహి
తన్నః సింహః ప్రచోదయాత్‌

ఈ నృసింహ గాయత్రిని పఠించి, విభూదిని ధరిస్తే ఫలితం ఉంటుంది.

కుంకుడు, మామిడి, దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు?

కుంకుడు, మామిడి, దానిమ్మ వంటి చెట్లను గృహాల్లో ఎందుకు పెంచకూడదు?

ఇలాంటి చెట్లు నీటి శాతాన్ని ఎక్కువగా పీలుస్తాయి. తద్వారా గృహావసరాలకి ఉపయోగపడే అనేక చెట్లు, నీరు సరిపోక పెరగవు. కొన్ని చెట్లు గృహయజమాని జాతకానికి సరిపోవు. అందుకే సర్వసమ్మతమైనవీ, గృహావసరాలకి ఉపయోగపడే చెట్లనే పెంచుకుంటారు. పై చెట్లు పెంచాలనుకుంటే మీ మీ జాతకాల ప్రకారం నక్షత్రాలూ ప్రకారం సరిచూసుకుని పెంచుకోండి

శివం : సోమవారం శివునికి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు తెలుసా...?

శివం : సోమవారం శివునికి పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు తెలుసా...?


హిందూ పురాణాల ప్రకారం శివునికి అనేక పేర్లు ఉన్నాయి. భక్తులు ఈశ్వరుడిని భోళా శంకరుడు, విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, మల్లిఖార్జున స్వామి, మంజునాథ స్వామి.. మరెన్నో పేర్లతో కొలుస్తారు. శివున్ని పూజించే భక్తులంతా ఎక్కువగా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సోముడు అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుని ధరించినవాడు శివుడు. సోమ అనే శబ్దాన్ని విడగొడితే ఉమాసహితుడు అనే అర్థం వస్తుంది.

ఉమాసహితుడు అంటే శివుడే కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేక దినంగా భావించి భక్తులు పూజలు చేస్తారు. సోమవారం శివున్ని పూజించి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు ఉండవు. మూడు ఆకులు గల బిల్వ పత్రాన్ని శివునికి సమర్పించడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది

స్వామికి వెలగపండు సమర్పించడం వల్ల శుభం చేకూరుతుంది. శివున్ని పూజించేవారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి.

సోమవారం రోజు ఇంట్లోనే చిన్న పరిమాణంలో గల శివలింగాన్ని ఏర్పాటు చేసుకుని పూజాభిషేకాలు చేయడం మంచిది. శివుడిని చిత్తశుద్ధి, అంకితభావంతో పూజించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. సోమవారం శివున్ని పూజిస్తే సమస్త పాపాలు పటాపంచలై పోవడమే కాకుండా భోగభాగ్యాలు, సంపదలు చేకూరుతాయి. ఆది దేవుడికి సంతోషాన్ని కలిగిస్తే ఆ ఇంట ఎప్పటికీ లేమి అనే మాట వినిపించదని పండితులు చెబుతున్నారు

🙏🙏శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..? బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే?🙏🙏

🙏🙏శుక్రవారం విడిచిన దుస్తుల్నే ధరిస్తే..? బియ్యం కొలిచే పాత్రను బోర్లిస్తే?🙏🙏

శుక్రవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవిని ఉపాసన చేస్తే ధన సమృద్ధి కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి. సంపదలతో తులతూగాలి అనుకునే వారు శుక్రవారం పూట అష్టైశ్వర్యాలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం చేయాలి. ఇంకా ఇంట పసుపు, ఉప్పు అయిపోయాయనే మాట వినబడ కూడదు. పసుపును కొనాలి. లేదా ఉప్పును తేవాలి అని చెప్పడం చేయొచ్చు.

ఉప్పు, పసుపు అయిపోయేంతవరకు ఉపయోగించకూడదు. అవి అయిపోయే లోపు ఇంట తెచ్చుపెట్టుకోవడం చేయాలి. అలాగే ఇంట్లో అన్నం వండేందుకు ముందు బియ్యాన్ని కొలుస్తాం. ఆ కొలిచే పాత్రను ఎప్పటికీ బోర్లించకూడదు.

ఇంట సుఖసంతోషాలు, సిరిసంపదలు పొందాలంటే.. విడిచిన బట్టలను తలుపుకు వేలాడదీయకూడదు. విడిచిన బట్టలను రెండో రోజు, మూడో రోజు ధరించకూడదు. ప్రత్యేకించి శుక్రవారం నాడు విడిచిన దుస్తులు ధరిస్తే దరిద్ర్యం చుట్టుకుంటుందని ఆధ్యాత్మిక పండితులు హెచ్చరిస్తున్నారు.

* శుక్రవారం నాడు సాత్త్విక ఆహారాన్ని తీసుకోవాలి. పాలను వినియోగించాలి.

* శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే ఇంటిని శుభ్రం చేసి, రంగ వల్లికలతో అలంకరించి.. దీపారాధన చేయాలి.

* రోజూ లేదా శుక్రవారం రాత్రిపూట కొద్దిపాటి అన్నాన్ని శేషంగా ఓ చిన్నపాటి గిన్నెలో వుంచి వంటింట్లో వుంచడం సంప్రదాయం. ఇలా చేస్తే పితరులు, దేవతలు ఆ ఇంట అన్నం ఎల్లప్పుడూ వుండుగాక అంటూ దీవిస్తారని ప్రతీతి.

* శుక్రవారం నుదుట బొట్టు ధరించే వారికి కలకాలం సౌభాగ్యం నిలిచివుంటుంది. ఇంకా స్టిక్కర్లను నుదుటన ధరించకుండా తెల్ల వక్కలతో తయారైన కుంకుమను శుక్రవారం ధరిస్తే మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది.

* తెల్ల వక్కలను, నేతిలో వేయించి చూర్ణం చేసి ఆ మిశ్రమానికి కస్తూరి పొడి, కుంకుమ పువ్వు పొడిని కలిపి చూర్ణం చేసుకుంటే కుంకుమ సిద్ధమవుతుంది. ఈ కుంకుమను నుదుటన ధరించడం ద్వారా సుగంధ భరితమైన సువాసనతో పాటు శుక్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. ధనవృద్ధి వుంటుంది.

* శుక్రవారం పూట తెల్లని వస్త్రాలను ధరించడం ఓ నియమం. తెల్లని వస్త్రాలంటే శుక్రునికి, మహాలక్ష్మీకి ప్రీతికరం. తెల్లని దుస్తులను శుక్రవారం ధరిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది.

* అలాగే శుక్రవారం పూట కమలములతో, కలువలతో లక్ష్మీదేవికి అర్చన చేసినట్లైతే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఇంకా పుష్పాలను దానం చేసినా, అన్నదానం చేసినా, వస్త్ర దానం చేసినా శుభఫలితాలుంటాయి. కస్తూరిని మిత్రత్వం కోరి స్నేహితులకు అందించినా, శుక్రవారం వర్జ్యం వున్న సమయంలో మౌనవ్రతం పాటించినా ఆ ఇంట తప్పకుండా ధన సమృద్ధి కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.🙏🙏🙏

శ్రీమద్భగవద్గీతపదునెనిమిదవ అధ్యాయముమోక్షసన్న్యాసయోగంఅర్జున ఉవాచసన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ |త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన ||

శ్రీమద్భగవద్గీత

పదునెనిమిదవ అధ్యాయము

మోక్షసన్న్యాసయోగం

అర్జున ఉవాచ

సన్న్యాసస్య మహాబాహో తత్త్వమిచ్ఛామి వేదితుమ్ |
త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేశినిషూదన ||                1

అర్జునుడు: కృష్ణా! సన్యాసం, త్యాగం—వీటి స్వరూపాలను విడివిడిగా తెలుసుకోదలచాను.

శ్రీ భగవానువాచ

కామ్యానాం కర్మణాం న్యాసం సన్న్యాసం కవయో విదుః |
సర్వకర్మఫలత్యాగం ప్రాహుస్త్యాగం విచక్షణాః ||            2

శ్రీ భగవానుడు: ఫలాన్ని ఆశించి చేసేకర్మలను విడిచిపెట్టడమే సన్యాసమని కొంతమంది పండితులు చెబుతారు. సమస్త కర్మల ఫలితాలనూ వదలిపెట్టడమే త్యాగమని కొందరి అభిప్రాయం.

త్యాజ్యం దోషవదిత్యేకే కర్మ ప్రాహుర్మనీషిణః |
యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యమితి చాపరే ||                3

దోషంలేని కర్మ అంటూ ఏదీ వుండదు కనుక కర్మలను విడిచిపెట్టాలని కొందరు బుద్ధిమంతులు చెబుతారు. మరి కొంతమంది యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలను పరిత్యజించకూడదని పలుకుతారు.

నిశ్చయం శృణు మే తత్ర త్యాగే భరతసత్తమ |
త్యాగో హి పురుషవ్యాఘ్ర త్రివిధః సంప్రకీర్తితః ||            4

అర్జునా! కర్మత్యాగవిషయంలో నా నిర్ణయం విను. త్యాగం మూడు విధాలు.

యజ్ఞదానతపఃకర్మ న త్యాజ్యం కార్యమేవ తత్ |
యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషిణామ్ ||        5

యజ్ఞం, దానం, తపస్సు అనే కర్మలు బుద్ధిమంతులకు చిత్తశుద్ధిని చేకూరుస్తాయి. అందువల్ల వాటిని విడిచిపెట్టకూడదు; తప్పకుండా చేయాలి.

ఏతాన్యపి తు కర్మాణి సంగం త్యక్త్వా ఫలాని చ |
కర్తవ్యానీతి మే పార్థ నిశ్చితం మతముత్తమమ్ ||            6

పార్థా! అయితే యజ్ఞం, దానం, తపస్సు అనే ఈ కర్మలను కూడా ఆసక్తినీ, ఫలాన్నీ విడిచిపెట్టే ఆచరించాలని నిశ్చితమూ, ఉత్తమమూ అయిన నా అభిప్రాయం.

నియతస్య తు సన్న్యాసః కర్మణో నోపపద్యతే |
మోహాత్తస్య పరిత్యాగస్తామసః పరికీర్తితః ||            7

స్వధర్మానుసారంగా నిత్యం ఆచరించవలసిన కర్మలను విడిచిపెట్టడం మంచిదికాదు. అవివేకంతో చేసే అలాంటి త్యాగాన్ని తామస త్యాగమంటారు.

దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశభయాత్ త్యజేత్ |
స కృత్వా రాజసం త్యాగం నైవ త్యాగఫలం లభేత్ ||            8

దుఃఖం కలగజేస్తాయనే భావనతోకాని, శరీరానికి శ్రమ కలుగుతుందనే భయంతోకాని నిత్యకర్మలను విడిచిపెడితే అది రాజసత్యాగం అవుతుంది. అలాంటి త్యాగం చేసినవాడు త్యాగఫలం పొందలేడు.

కార్యమిత్యేవ యత్కర్మ నియతం క్రియతే௨ర్జున |
సంగం త్యక్త్వా ఫలం చైవ స త్యాగః సాత్త్వికో మతః ||        9

అర్జునా! వేదశాస్త్రాదులు విధించిన కర్మలను కర్తవ్యబుద్ధితో ఆసక్తినీ, ఫలాన్నీ విడిచిపెట్టి ఆచరించడమే సాత్వికత్యాగం.

న ద్వేష్ట్యకుశలం కర్మ కుశలే నానుషజ్జతే |
త్యాగీ సత్త్వసమావిష్టో మేధావీ ఛిన్నసంశయః ||        10

సత్వగుణ సంపన్నుడు, బుద్ధిమంతుడు, సంశయరహితుడు అయిన త్యాగశీలి కామ్యాలు, కష్టప్రదాలైన కర్మలను ద్వేషించడు; శుభప్రదాలు, సులభసాధ్యాలు అయిన కర్మలను అభిమానించడు.

న హి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః |
యస్తు కర్మఫలత్యాగీ స త్యాగీత్యభిధీయతే ||                11

కర్మలను పూర్తిగా వదలిపెట్టడం శరీరాన్ని ధరించినవాడికి శక్యం కాదు. కనుక కర్మఫలాలను విడిచిపెట్టినవాడే త్యాగి.

అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలమ్ |
భవత్యత్యాగినాం ప్రేత్య న తు సన్న్యాసినాం క్వచిత్ ||            12

కర్మఫలాలను త్యాగంచేయనివాళ్ళకు మరణానంతరం తాము ఆచరించిన కర్మల ధర్మాధర్మాలనుబట్టి దుఃఖకరం, సుఖప్రదం, మిశ్రమం అనే మూడు విధాలైన ఫలాలు కలుగుతాయి. అయితే కర్మఫలాలను విడిచి పెట్టిన సన్యాసులకు అవి అంటవు.

పంచైతాని మహాబాహో కారణాని నిబోధ మే |
సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణామ్ ||        13

అర్జునా! సర్వకర్మలూ ఫలించడానికి సాంఖ్యశాస్త్రం ఐదు కారణాలు చెప్పింది. వాటిని వివరిస్తాను విను.

అధిష్టానం తథా కర్తా కరణం చ పృథగ్విధమ్ |
వివిధాశ్చ పృథక్‌చేష్టా దైవం చైవాత్ర పంచమమ్ ||        14

కర్మలన్నిటికీ శరీరం, జీవాత్మ, ఇంద్రియాలు, వాటి వేర్వేరు వ్యాపారాలు, దైవం అనే ఐదూ కారణాలు.

శరీరవాఙ్మనోభిర్యత్ కర్మ ప్రారభతే నరః |
న్యాయం వా విపరీతం వా పంచైతే తస్య హేతవః ||            15

మానవుడు శరీరం, వాక్కు, మనసులతో మంచిపనికాని, చెడ్డపనికాని ఆరంభించడానికి కారణాలు ఈ ఐదే.

తత్త్రైవం సతి కర్తారమ్ ఆత్మానం కేవలం తు యః |
పశ్యత్యకృతబుద్ధిత్వాత్ న స పశ్యతి దుర్మతిః ||            16

కర్మలకు సంబంధించిన కారణాలు ఇలా వుండగా బుద్ధి, సంస్కారం లేనివాడు తానే కర్తనని తలుస్తాడు. అలాంటి అవివేకి కర్మస్వరూపాన్నికాని, ఆత్మస్వరూపాన్నికాని సరిగా తెలుసుకోలేడు.

యస్య నాహంకృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే |
హత్వాపి స ఇమాన్‌లోకాన్ న హంతి న నిబధ్యతే ||            17

కర్మల విషయంలో అహంకారమమకారాలు లేనివాడు ఈ ప్రాణులన్నిటినీ చంపినా హంతకుడు కాడు; కర్మలు అతనిని బంధించవు.

జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాతా త్రివిధా కర్మచోదనా |
కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మసంగ్రహః ||            18

తెలివి, తెలుసుకోదగ్గది, తెలుసుకునేవాడు—ఈ మూడూ కర్మలకు కారణాలు. అలాగే కర్మకు ఆధారం సాధనం, చేసేపని, చేసేవాడు అని మూడు విధాలు.

జ్ఞానం కర్మ చ కర్తా చ త్రిధైవ గుణభేదతః |
ప్రోచ్యతే గుణసంఖ్యానే యథావచ్ఛృణు తాన్యపి ||            19

గుణాల భేదాన్నిబట్టి జ్ఞానం, కర్మ, కర్త అనేవాటిని సాంఖ్యశాస్త్రం మూడేసి విధాలుగా విభజించింది. వాటిని గురించి చెబుతాను విను.

సర్వభూతేషు యేనైకం భావమవ్యయమీక్షతే |
అవిభక్తం విభక్తేషు తద్‌జ్ఞానం విద్ధి సాత్త్వికమ్ |        20

విడివిడి విభాగాలుగా వుండే ప్రాణులన్నిటిలోనూ అఖండమూ, అవినాశమూ, అవిభక్తమూ అయిన ఆత్మవస్తువును చూసేవాడి జ్ఞానం సాత్వికజ్ఞానమని తెలుసుకో.

పృథక్త్వేన తు యద్‌జ్ఞానం నానాభావాన్‌పృథగ్విధాన్ |
వేత్తి సర్వేషు భూతేషు తద్‌జ్ఞానం విద్ధి రాజసమ్ ||        21

వేర్వేరుగా కనుపించే సర్వభూతాలలోని ఆత్మలు అనేకవిధాలుగా వున్నాయని భావించేవాడి జ్ఞానం రాజసజ్ఞానం.

యత్తు కృత్స్నవదేకస్మిన్ కార్యే సక్తమహైతుకమ్ |
అతత్త్వార్థవదల్పం చ తత్తామసముదాహృతమ్ ||            22

తత్వాన్ని తెలుసుకోకుండా, తగిన కారణం లేకుండా సమస్తమూ అదే అనే సంకుచితదృష్టితో ఏదో ఒకే పనిమీద ఆసక్తి కలిగివుండేవాడిజ్ఞానం తామసజ్ఞానం.

నియతం సంగరహితమ్ అరాగద్వేషతః కృతమ్ |
అఫలప్రేప్సునా కర్మ యత్తత్‌సాత్త్వికముచ్యతే ||                23

ఆసక్తి, అభిమానం, అనురాగం, ద్వేషం, ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే కర్మను సాత్వికకర్మ అంటారు.

యత్తు కామేప్సునా కర్మ సాహంకారేణ వా పునః |
క్రియతే బహుళాయాసం తద్రాజసముదాహృతమ్ ||            24

ఫలాభిలాషతో, అహంకారంతో, అధికప్రయాసతో ఆచరించేకర్మను రాజసకర్మ అని చెబుతారు.

అనుబంధం క్షయం హింసామ్ అనవేక్ష్య చ పౌరుషమ్ |
మోహాదారభ్యతే కర్మ యత్తత్‌తామసముచ్యతే ||                25

సాధకబాధకాలనూ, తన సామర్థ్యాన్నీ ఆలోచించకుండా అవివేకంతో ఆరంభించే కర్మ తామసకర్మ అవుతుంది.

ముక్తసంగో௨నహంవాదీ ధృత్యుత్సాహసమన్వితః |
సిద్ధ్యసిద్ధ్యోర్నిర్వికారః కర్తా సాత్త్విక ఉచ్యతే ||            26

ఫలాపేక్ష, అహంభావం విడిచిపెట్టి ధైర్యోత్సాహాలతో జయాపజయాలను లెక్కచేయకుండా కర్మలు చేసేవాణ్ణి సాత్వికకర్త అంటారు.

రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో௨శుచిః |
హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః ||            27

అనురాగం, కర్మఫలాసక్తి, దురాశ, పరపీడన పరాయణత్వాలతో శుచీ, శుభ్రమూ లేకుండా సుఖదుఃఖాలకు లొంగిపోతూ కర్మలు ఆచరించేవాడు రాజసకర్త అవుతాడు.

అయుక్తః ప్రాకృతః స్తబ్ధః నైష్కృతికో௨లసః |
విషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే ||                28

మనోనిగ్రహం, వివేకం, వినయం లేకుండా ద్రోహబుద్ధితో, దుష్టస్వభావంతో, నిరుత్సాహంతో నిరంతరవిచారంతో, కాలయాపనతో కర్మలు చేసేవాణ్ణి తామసకర్త అని చెబుతారు.

బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు |
ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ ||            29

ధనంజయా! గుణభేధాలనుబట్టి బుద్ధీ, ధైర్యమూ మూడేసివిధాలు. వాటిని గురించి పూర్తిగా విడివిడిగా వివరిస్తాను విను.

ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే |
బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్త్వికీ ||    30

పార్థా! కర్మమార్గాన్నీ, సన్యాసమార్గాన్నీ, కర్తవ్యాకర్తవ్యాలనూ, భయాభయాలనూ, బంధాన్నీ, మోక్షాన్నీ గ్రహించే బుద్ధి సాత్వికబుద్ధి.

యయా ధర్మమధర్మం చ కార్యం చాకార్యమేవ చ |
అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థ రాజసీ ||            31

పార్థా! ధర్మాధర్మాలనూ, కార్యాకార్యాలనూ, సరిగా తెలుసుకోలేని బుద్ధి రాజసబుద్ధి.

అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృతా |
సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ ||        32

పార్థా! అజ్ఞానాంధకారంవల్ల అధర్మాన్ని ధర్మంగా, ప్రతి విషయాన్నీ విరుద్ధంగా, విపరీతంగా భావించే బుద్ధి తామసబుద్ధి.

ధృత్యా యయా ధారయతే మనఃప్రాణేంద్రియక్రియాః |
యోగేనావ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్త్వికీ ||            33

పార్థా! మనసు, ప్రాణం, ఇంద్రియాలు—వీటి వ్యాపారాలను యోగసాధనతో నిలబెట్టగలిగే నిశ్చలధైర్యం సాత్వికధైర్యం.

యయా తు ధర్మకామార్థాన్ ధృత్యా ధారయతే௨ర్జున |
ప్రసంగేన ఫలాకాంక్షీ ధృతిః సా పార్థ రాజసీ ||        34

పార్థా! ధర్మార్థకామాలపట్ల అభిలాష, అభిమానం, ఫలాభిలాష కలిగివుండే ధైర్యం రాజసధైర్య.

యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ |
న విముంచతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ ||            35

పార్థా! బుద్ధిలేనివాడు నిద్ర, భయం, దుఃఖం, విషాదం, మదం—వీటిని విడిచిపెట్టకుండా చేసే ధైర్యం తామసధైర్యం.

సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ |
అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాన్తం చ నిగచ్ఛతి ||            36

యత్తదగ్రే విషమివ పరిణామే௨మృతోపమమ్ |
తత్సుఖం సాత్త్వికం ప్రోక్తమ్, ఆత్మబుద్ధిప్రసాదజమ్ ||        37

భరతశ్రేష్ఠా! మానవుడికి అభ్యసించేకొద్దీ ఆనందం, దుఃఖవినాశం కలగజేసే సుఖం మూడు విధాలు. దాన్ని గురించి తెలియజేస్తాను విను. ఆరంభంలో విషంలా వున్నా అంతంలో అమృతసమానమయ్యే సుఖాన్ని సాత్వికసుఖమని చెబుతారు. అది నిర్మలమైన బుద్ధివల్ల కలుగుతుంది.

విషయేంద్రియసంయోగాత్ యత్తదగ్రే௨మృతోపమమ్ |
పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతమ్ ||            38

మొదట అమృతతుల్యంగా వుండి చివరకు విషంగా మారే సుఖం విషయాలు, ఇంద్రియాల కలయికవల్ల కలిగేది—రాజససుఖం అవుతుంది.

యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః |
నిద్రాలస్యప్రమాదోత్థం తత్తామసముదాహృతమ్ ||            39

నిద్ర, బద్ధకం, ప్రమాదాలవల్ల జనించి, ఆదిలోనూ, అంతంలోనూ మోహం కలగజేసే సుఖాన్ని తామససుఖం అంటారు.

న తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః |
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిః స్యాత్ త్రిభిర్గుణైః ||        40

ప్రకృతివల్ల కలిగిన ఈ మూడు గుణాలతో ముడిపడని వస్తువేదీ భూలోకంలోకాని, స్వర్గలోకంలోకాని, దేవతలలోకాని లేదు.

బ్రాహ్మణక్షత్రియవిశాం శూద్రాణాం చ పరంతప |
కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ||            41

పరంతపా! బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులకు వారి వారి స్వభావంవల్ల కలిగిన గుణాలనుబట్టి కర్మలు విభజించబడ్డాయి.

శమో దమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ |
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజమ్ ||        42

బ్రాహ్మణులకు స్వభావసిద్ధమైన కర్మలు ఇవి: మనోనిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, తపస్సు, శుచిత్వం, ఓర్పు, సత్ప్రవర్తన, శాస్త్రజ్ఞానం అనుభవజ్ఞానం, దేవుడిమీద నమ్మకం.

శౌర్యం తేజో ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనమ్ |
దానమీశ్వరభావశ్చ క్షాత్రం కర్మ స్వభావజమ్ ||        43

పరాక్రమం, పౌరుషం, ధైర్యం, దక్షత, యుద్ధంలో పారిపోకపోవడం దానం, పరిపాలనాసామర్థ్యం—ఇవి క్షత్రియుల కర్మలు.

కృషిగౌరక్ష్యవాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్ |
పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ ||            44

వైశ్యులకు స్వభావంవల్ల కలిగిన కర్మలు: వ్యవసాయం, పశుపోషణ, వ్యాపారం. ఇక శూద్రులకర్మ సేవచేయడం.

స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః |
స్వకర్మనిరతః సిద్ధిం యథా విందతి తచ్ఛృణు ||            45

తాను ఆచరించే కర్మపట్ల శ్రద్ధ కలిగినవాడు సిద్ధి పొందుతాడు. స్వభావసిద్ధమైన తన కర్మమీద ఆసక్తి వున్నవాడు ఎలా సిద్ధి పొందుతాడో చెబుతాను విను.

యతః ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతమ్ |
స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః ||            46

సమస్తప్రాణుల పుట్టుకకూ, పోషణకూ కారణుడై విశ్వమంతటా వ్యాపించివున్న పరమాత్మను తనకు విధించబడ్డ కర్మలను ఆచరించడం ద్వారా అర్చించి మానవుడు పరమగతి పొందుతాడు.

శ్రేయాన్‌స్వధర్మో విగుణః పరధర్మాత్‌స్వనుష్ఠితాత్ |
స్వభావనియతం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ||            47

బాగా ఆచరించబడ్డ ఇతరుల ధర్మంకంటే గుణం లేనిదిగా కనుపించినా తన ధర్మమే మంచిది. తన ధర్మాన్ని తాను నిర్వర్తించేవాడికి పాపం అంటదు.

సహజం కర్మ కౌంతేయ సదోషమపి న త్యజేత్ |
సర్వారంభా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ||            48

కౌంతేయా!  నిప్పును కప్పుకున్న పొగలాగ కర్మలన్నిటినీ దోషం ఆవరించి వుంటుంది. అందువల్ల ఏదైనా దోషమున్నా స్వభావసిద్ధమైన కర్మను విడిచిపెట్టకూడదు.

అసక్తబుద్ధిః సర్వత్ర జితాత్మా విగతస్పృహః |
నైష్కర్మ్యసిద్ధిం పరమాం సన్న్యాసేనాధిగచ్ఛతి ||            49

అన్ని విషయాలపట్ల ఆసక్తి విడిచిపెట్టి, ఆత్మనిగ్రహంతో, ఆశలు లేకుండా, ఫలత్యాగబుద్ధితో కర్మలు ఆచరించేవాడు పరమోత్తమమైన కర్మాతీత స్థితి పొందుతాడు.

సిద్ధిం ప్రాప్తో యథా బ్రహ్మ తథాప్నోతి నిబోధ మే |
సమాసేనైవ కౌంతేయ నిష్ఠా జ్ఞానస్య యా పరా ||            50

కౌంతేయా! నిష్కామకర్మసిద్ధి పొందినవాడు పరమాత్మను ఎలా పొందుతాడో, జ్ఞాననిష్ఠ అంటే ఏమిటో సంగ్రహంగా చెబుతాను సావధానంగా విను.

బుద్ధ్యా విశుద్ధయా యుక్తో ధృత్యాత్మానం నియమ్య చ |
శబ్దాదీన్ విషయాన్, త్యక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ ||    51

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానసః |
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః ||            52

అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహమ్ |
విముచ్య నిర్మమః శాంతో బ్రహ్మభూయాయ కల్పతే ||            53

పరిశుద్ధమైన బుద్ధికలిగి, ధైర్యంతో మనసును వశపరచుకుని, శబ్దాది విషయాలనూ రాగద్వేషాలనూ విడిచిపెట్టి, ఏకాంతవాసం చేస్తూ, మితంగా తింటూ, మాటలు, శరీరం, మనసులను అదుపులో పెట్టుకుని, నిరంతరం ధ్యానయోగంలో వుంటూ, వైరాగ్యాన్ని ఆశ్రయించి అహంకారం, బలం, గర్వం, కామం, క్రోధం, వస్తుసేకరణలను వదలిపెట్టి, మమకారం లేకుండా శాంతస్వభావం కలిగినవాడు బ్రహ్మస్వరూపం పొందడానికి అర్హుడు.

బ్రహ్మభూతః ప్రసన్నాత్మా న శోచతి న కాంక్షతి |
సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరామ్ ||        54

అలా బ్రహ్మస్వరూపం పొందినవాడు ప్రశాంతమైన మనసుతో దేనినీ ఆశించడు; దేనికీ దుఃఖించడు. సమస్త భూతాలనూ సమభావంతో చూస్తూ   నాపట్ల పరమభక్తి కలిగివుంటాడు.

భక్త్యా మామభిజానాతి యావాన్యశ్చాస్మి తత్త్వతః |
తతో మాం తత్త్వతో జ్ఞాత్వా విశతే తదనంతరమ్ ||            55

భక్తివల్ల అతను నేను ఎంతటివాడినో, ఎలాంటివాడినో యథార్థంగా తెలుసుకుంటాడు. నా స్వరూపస్వభావాలను గ్రహించిన అనంతరం నాలో ప్రవేశిస్తాడు.

సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మద్వ్యపాశ్రయః |
మత్ప్రసాదాదవాప్నోతి శాశ్వతం పదమవ్యయమ్ ||            56

కర్మలన్నిటినీ ఎప్పుడూ ఆచరిస్తున్నప్పటికీ నన్ను ఆశ్రయించేవాడు నా అనుగ్రహంవల్ల శాశ్వతమూ, నాశరహితమూ అయిన మోక్షం పొందుతాడు.

చేతసా సర్వకర్మాణి మయి సన్న్యస్య మత్పరః |
బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్తః సతతం భవ ||            57

హృధయపూర్వకంగా అన్నికర్మలూ నాకే అర్పించి, నన్నే పరమగతిగా భావించి, ధ్యానయోగాన్ని అవలంబించి, నీ మనసు నిరంతరం నామీదే వుంచు.

మచ్చిత్తః సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి |
అథ చేత్ త్వమహంకారాత్ న శ్రోష్యసి వినంక్ష్యసి ||            58

నామీద మనసు నిలిపితే నా అనుగ్రహంవల్ల   సంసారసంబంధమైన ప్రతిఒక్క ప్రతిబంధకాన్నీ అతిక్రమిస్తావు. అలాకాకుండా అహంకారంతో నా ఉపదేశాన్ని పెడచెవిని పెడితే చెడిపోతావు.

యదహంకారమాశ్రిత్య న యోత్స్య ఇతి మన్యసే |
మిథ్యైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి ||            59

అహంకారంవల్ల యుద్ధం చేయకూడదని నీవు భావించినా ఆ ప్రయత్నం ఫలించదు. ఎందువల్లనంటే నీ స్వభావమే నీ చేత యుద్ధం చేయించి తీరుతుంది.

స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా |
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశో௨పి తత్ ||            60

కౌంతేయా! అవివేకంవల్ల నీవు ఇష్టపడకపోయినా, స్వభావసిద్ధమైన స్వధర్మకర్మకు కట్టుబడి పరాధీనుడవై ఆ పని తప్పకుండా చేస్తావు.

ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశే௨ర్జున తిష్ఠతి |
భ్రామయన్‌సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ||            61

అర్జునా! సర్వేశ్వరుడు సమస్తప్రాణుల హృదయాలలోనూ విలసిల్లుతూ, తన మాయతో సర్వభూతాలనూ కీలుబొమ్మలలాగ ఆడిస్తున్నాడు.

తమేవ శరణం గచ్ఛ సర్వభావేన భారత |
తత్ప్రసాదాత్పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతమ్ ||    62

అర్జునా! అన్నివిధాల ఆ ఈశ్వరుడినే శరణు వేడు. ఆయన దయవల్ల పరమశాంతినీ, శాశ్వతమైన మోక్షాన్నీ పొందుతావు.

ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా |
విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు ||                63

పరమరహస్యమైన జ్ఞానాన్ని నీకు చెప్పాను. బాగా ఆలోచించి నీకెలా తోస్తే అలా చెయ్యి.

సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః |
ఇష్టో௨సి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితమ్ ||            64

నీ వంటే నాకెంతో ఇష్టం. అందువల్ల నీ మేలుకోరి పరమరహస్యమూ, సర్వోత్కృష్టమూ అయిన మరో మాట చెబుతాను విను.

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు |
మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో௨సి మే ||            65

నామీదే మనసు వుంచి, నాపట్ల భక్తితో నన్ను పూజించు; నాకు నమస్కరించు. నాకు ఇష్టుడవు కనుక ఇది నిజమని శపథం చేసి మరీ చెబుతున్నాను. నీవలా చేస్తే తప్పకుండా నన్ను చేరుతావు.

సర్వధర్మాన్‌పరిత్యజ్య మామేకం శరణం వ్రజ |
అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః ||        66

సర్వధర్మాలనూ విడిచిపెట్టి నన్నే ఆశ్రయించు. పాపాలన్నిటినుంచీ నీకు విముక్తి కలగజేస్తాను. విచారించకు.

ఇదం తే నాతపస్కాయ నాభక్తాయ కదాచన |
న చాశుశ్రూషవే వాచ్యం న చ మాం యో௨భ్యసూయతి ||            67

నీకు ఉపదేశించిన ఈ గీతాశాస్త్రాన్ని తపసు చేయనివాడికీ, భక్తి లేనివాడికీ, వినడానికి ఇష్టంలేనివాడికీ, నన్ను దూషించేవాడికీ ఎప్పుడూ చెప్పకూడదు.

య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వభిధాస్యతి |
భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్యత్యసంశయః ||        68

పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రాన్ని నా భక్తులకు బోధించేవాడు నామీద పరమభక్తితో నన్ను చేరుతాడనడంలో సందేహం లేదు.

న చ తస్మాన్ మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః |
భవితా న చ మే తస్మాత్, అన్యః ప్రియతరో భువి ||            69

అలాంటివాడికంటే నాకు బాగా ప్రీతి కలుగజేసేవాడు మనుషులలో మరొకడు లేడు. అతనికంటే నాకు ఎక్కువ మక్కువ కలిగినవాడు ఈ లోకంలో ఇక ఉండబోడు.

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్యం సంవాదమావయోః |
జ్ఞానయజ్ఞేన తేనాహమ్, ఇష్టః స్యామితి మే మతిః ||        70

మన వుభయులకీ మధ్య జరిగిన ఈ ధర్మసంవాదాన్ని చదివినవాడు జ్ఞానయజ్ఞంతో నన్ను ఆరాధిస్తున్నాడని నా వుద్దేశం.

శ్రద్ధావాననసూయశ్చ శృణుయాదపి యో నరః |
సో௨పి ముక్తః శుభాన్ లోకాన్ ప్రాప్నుయాత్ పుణ్యకర్మణామ్ ||71

ఈ గీతాశాస్త్రాన్ని శ్రద్ధతో అసూయలేకుండా ఆలకించేవాడు పాపాల నుంచి విముక్తి పొంది, పుణ్యాత్ములుండే శుభలోకాలను చేరుతాడు.

కచ్చిదేతచ్ఛ్రుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా |
కచ్చిదజ్ఞానసమ్మోహః ప్రనష్టస్తే ధనంజయ ||            72

పార్థా! నిశ్చలమైన మనసుతో నీవు ఈ గీతాశాస్త్రాన్ని విన్నావు కదా! ధనంజయా! అవివేకంవల్ల కలిగిన నీ భ్రాంతి అంతా అంతరించిందా లేదా?

అర్జున ఉవాచ

నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత |
స్థితో௨స్మి గతసందేహః కరిష్యే వచనం తవ ||            73

అర్జునుడు: కృష్ణా! నీ దయవల్ల నా వ్యామోహం తొలగిపోయింది; జ్ఞానం కలిగింది. నా సందేహాలన్నీ తీరిపోయాయి. నీ ఆదేశాన్ని శిరసా వహించడానికి సిద్ధంగా వున్నాను.

సంజయ ఉవాచ

ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః |
సంవాదమిమమశ్రౌషమ్, అద్భుతం రోమహర్షణమ్ ||        74

సంజయుడు: శ్రీకృష్ణభగవానుడికి మహాత్ముడైన అర్జునుడికీ మధ్య ఇలా ఆశ్చర్యకరంగా, ఒళ్ళు పులకరించేటట్లుగా సాగిన సంవాదాన్ని విన్నాను.

వ్యాసప్రసాదాచ్ఛృతవాన్, ఏతద్గుహ్యమహం పరమ్ |
యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయతః స్వయమ్ ||    75

యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడు స్వయంగా అర్జునుడికి అతిరహస్యమూ, సర్వోత్కృష్టమూ అయిన ఈ యోగశాస్త్రాన్ని చెబుతుండగా శ్రీ వేదవ్యాసమహర్షి కృపవల్ల నేను విన్నాను.

రాజన్ సంస్మృత్య సంస్మృత్య సంవాదమ్ ఇమమద్భుతమ్ |
కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః ||        76

ధృతరాష్ట్ర మహారాజా! అద్భుతమూ, పుణ్యప్రదమూ అయిన కృష్ణార్జునుల ఈ సంవాదాన్ని పదే పదే స్మరించుకుంటూ సంతోషిస్తున్నాను.

తచ్చ సంస్మృత్య సంస్మృత్య రూపమత్యద్భుతం హరేః |
విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునఃపునః ||    77

ధృతరాష్ట్ర మహారాజా ! అత్యద్భుతమైన శ్రీకృష్ణభగానుడి విశ్వరూపాన్ని మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూ మహాశ్చర్యం పొంది ఎంతో సంతోషిస్తున్నాను.

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్థరః |
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ||            78

యోగేశ్వరుడైన శ్రీకృష్ణభగవానుడూ, ధనుస్సు ధరించిన అర్జునుడూ వుండేచోట సంపద, విజయం, ఐశ్వర్యం, నీతి నిలకడగా వుంటాయని నా విశ్వాసం.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " మోక్షసన్న్యాస యోగము" అనే పదునెనిమిదవ అధ్యాయం సమాప్తం.

శని గ్రహాన్ని అనుకూలంగా చేసుకోవడం ఎలా?గ్రహాల స్థితిగతులనుబట్టి మన జాతకచక్రం నడుస్తుంటుంది. కనుక నవగ్రహాలను అనుకూలంగా చేసుకోవడం చాలా అవసరం. అందులో శని ప్రభావం మరీ ఎక్కువ కనుక, శని దోషం ఉన్నవారు కొన్ని దానాలు ఇవ్వడం ద్వారా దాన్ని శాంతింపచేసుకోవచ్చు.

శని గ్రహాన్ని అనుకూలంగా చేసుకోవడం ఎలా?

గ్రహాల స్థితిగతులనుబట్టి మన జాతకచక్రం నడుస్తుంటుంది. కనుక నవగ్రహాలను అనుకూలంగా చేసుకోవడం చాలా అవసరం. అందులో శని ప్రభావం మరీ ఎక్కువ కనుక, శని దోషం ఉన్నవారు కొన్ని దానాలు ఇవ్వడం ద్వారా దాన్ని శాంతింపచేసుకోవచ్చు.

శని మహర్దశలో చేయవలసిన దానములు

1. శని మహర్దశ, శని అంతర్దశల్లో నువ్వులు దానము చేయాలి.
2. శని మహర్దశ, రవి అంతర్దశలో ఒక గుమ్మడికాయను, ఇవ్వగలిగినంత బంగారాన్ని దానం చేయాలి.
3. శని మహర్దశ, చంద్రుని అంతర్దశలో తెల్ల ఆవును దానం చేయాలి.
4. శని మహర్దశ, కుజ అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
5. శని మహర్దశ, బుధుడు అంతర్దశలో దున్నను దానం చేయాలి.
6. శని మహర్దశ, గురుడు అంతర్దశలో బంగారు మేకను దానం చేయాలి.
7. శని మహర్దశ, శుక్రుడు అంతర్దశలో నల్ల మేక, నువ్వులు, ఇనుము, లవణం, నూనెలను దానం చేయాలి.
8. శని మహర్దశ, రాహువు అంతర్దశలో సీసమును దానం చేయాలి.
9. శని మహర్దశ, కేతువు అంతర్దశలో బంగారం, నువ్వులు దానం చేయాలి.

వివిధ గ్రహాల శని అంతర్దశలో చేయవలసిన దానములు: 

1. రవి మహర్దశలో మేకను దానం చేయాలి.
2. చంద్రుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
3. కుజ మహర్దశ, శని అంతర్దశలో నువ్వుల పిండిని దానం చేయాలి.
4. బుధుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
5. గురుని మహర్దశ, శని అంతర్దశలో నల్లమేకను దానం చేయాలి.
6. శుక్రుని మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.
7. రాహువు మహర్దశ, శని అంతర్దశలో నల్లమేకను దానం చేయాలి.
8. కేతు మహర్దశ, శని అంతర్దశలో దున్నపోతును దానం చేయాలి.

పైన సూచించినవి ఏవైనా దొరకనప్పుడు వాటికి బదులుగా ధనమిచ్చుటకన్నా సూచించిన దాని ఆకారంలో వెండితో ప్రతిమ చేయించి దక్షిణతో కలిసి ఇవ్వాలి.

శ్రీమద్భగవద్గీతపదునేడవ అధ్యాయముశ్రద్ధాత్రయ విభాగయోగముఅర్జున ఉవాచయే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః |తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ||

శ్రీమద్భగవద్గీత

పదునేడవ అధ్యాయము

శ్రద్ధాత్రయ విభాగయోగము

అర్జున ఉవాచ

యే శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః |
తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్త్వమాహో రజస్తమః ||        1

అర్జునుడు: కృష్ణా! శాస్త్రవిధులను విడిచిపెట్టినప్పటికీ శ్రద్ధతో పూజాదులు చేసేవాళ్ళ ప్రవృత్తి ఎలాంటిది?సాత్వికమా? రాజసమా? తామసమా?

శ్రీ భగవానువాచ

త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా |
సాత్త్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు ||            2

శ్రీ భగవానుడు: ప్రాణుల సహజసిద్ధమైనశ్రద్ధ సాత్వికమనీ, రాజసమనీ, తామసమనీ మూడువిధాలు. దానిని వివరిస్తాను విను.

సత్త్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత |
శ్రద్ధామయో௨యం పురుషో యో యచ్ఛ్రద్ధః స ఏవ   సః ||        3

అర్జునా! మానవులందరికీ వారివారి స్వభావాన్నిబట్టి శ్రద్ధ కలుగుతుంది. శ్రద్ధలేనివాడంటూ లేడు. ఎవడికి ఎలాంటి శ్రద్ధ వుంటుందో వాడు అలాంటివాడే అవుతాడు.

యజంతే సాత్త్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః |
ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజన్తే తామసా జనాః ||        4

సాత్వికులు దేవతలనూ, రాజసులు యక్షరాక్షసులనూ, తామసులు భూతప్రేతాలనూ పూజిస్తారు.

అశాస్త్రవిహితం ఘోరం తప్యన్తే యే తపో జనాః |
దంభాహంకారసంయుక్తాః కామరాగబలాన్వితాః ||        5

కర్శయన్తః శరీరస్థం భూతగ్రామమచేతసః |
మాం చైవాన్తఃశరీరస్థం తాన్ విద్ధ్యాసురనిశ్చయాన్ ||    6

శాస్త్రవిరుద్ధంగా ఘోరతపస్సులు చేస్తూ అవివేకంతో తమ శరీరంలోని పంచభూతాలనే కాకుండా, అంతరాత్మగా వున్న నన్ను కూడా పీడించే ఆడంబరులూ, అహంకారులూ, కామబలగర్వితులూ, అసురస్వభావం కలిగినవాళ్ళని తెలుసుకో.

ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః |
యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు ||            7

అందరికీ ఇష్టమైన ఆహారం మూడు విధాలు. అలాగే యజ్ఞం, తపస్సు, దానం కూడా. వాటి తేడాలను తెలియజేస్తాను విను.

ఆయుఃసత్త్వబలారోగ్యసుఖప్రీతివివర్ధనాః |
రస్యాః స్నిగ్ధాః స్థిరా హృద్యాః ఆహారాః సాత్త్వికప్రియాః ||8

సాత్వికులకు ప్రీతికలిగించే ఆహారపదార్థాలు ఇవి: ఆయుర్దాయం, బుద్ధిబలం, శరీరబలం, ఆరోగ్యం, సుఖం, సంతోషం—వీటిని వృద్ధిచేస్తూ రసమూ, చమురూ కలిగి, చాలాకాలం ఆకలిని అణచిపెట్టి, మనసుకు ఆహ్లాదం కలగజేసేవి.

కట్వమ్లలవణాత్యుష్ణతీక్ష్ణరూక్షవిదాహినః |
ఆహారా రాజసస్యేష్టాః దుఃఖశోకామయప్రదాః ||        9

బాగా చేదు, పులుపు, ఉప్పు, వేడి, కారంకలిగి, చమురులేకుండా వెర్రిదాహం పుట్టించే ఆహారపదార్థాలంటే రాజసులకు ఇష్టం. ఇవి శరీరానికి బాధ, మనసుకు వ్యాకులత, వ్యాధులు కలగజేస్తాయి.

యాతయామం గతరసం పూతి పర్యుషితం చ యత్ |
ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియమ్ ||        10

తామసులకు చల్లబడిపోయింది, సారంలేనిది, వాసనకొడుతున్నది, చలిది, ఎంగిలిది, అపవిత్రమైనది అయిన ఆహారమంటే ఇష్టం.

అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య ఇజ్యతే |
యష్టవ్యమేవేతి మనః సమాధాయ స సాత్త్వికః ||            11

తమ కర్తవ్యంగా విశ్వసించి, ఫలాపేక్ష లేకుండా శాస్త్రసమ్మతంగా చేసే యజ్ఞాన్ని సాత్వికయజ్ఞమంటారు.

అభిసంధాయ తు ఫలం దంభార్థమపి చైవ యత్ |
ఇజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసమ్ ||            12

అర్జునా! ఫలాన్ని ఆశించికాని, ఆడంబరంకోసంకాని చేసే యజ్ఞం రాజసయజ్ఞమని గ్రహించు.

విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణమ్ |
శ్రద్ధావిరహితం యజ్ఞం తామసం పరిచక్షతే ||            13

అశాస్త్రీయంగా అన్నదానం, మంత్రాలు, దక్షిణ లేకుండా అశ్రద్ధతో ఆచరించే యజ్ఞాన్ని తామసయజ్ఞమని చెబుతారు.

దేవద్విజగురుప్రాజ్ఞపూజనం శౌచమార్జవమ్ |
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే ||                14

దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను పూజించడం, పవిత్రంగా వుండడం. కల్లాకపటం లేకుండా ప్రవర్తించడం, బ్రహ్మచర్యదీక్షనూ, అహింసావ్రతాన్నీ అవలంబించడం –వీటిని శరీరంతో చేసే తపస్సని చెబుతారు.

అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యతే ||            15

ఇతరులకు బాధ కలిగించకుండా సత్యం, ప్రియం, హితమూ అయిన సంభాషణ సాగించడం, వేదాధ్యయనం చేయడం వాక్కుకు సంబంధించిన తపస్సు అంటారు.

మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మవినిగ్రహః |
భావసంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే ||                16

మనసును నిర్మలంగా వుంచుకోవడం, మౌనం వహించడం, శాంతస్వభావమూ, ఆత్మనిగ్రహమూ, అంతఃకరణశుద్ధీ కలిగివుండడం మనస్సుతో చేసే తపస్సు అవుతుంది.

శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః |
అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్త్వికం పరిచక్షతే ||            17

నిర్మలమైన మనసు కలిగినవాళ్ళు పరమశ్రద్ధతో ఫలాపేక్ష లేకుండా మూడు విధాలైన ఈ తపస్సు చేస్తే అది సాత్వికమని చెబుతారు.

సత్కారమానపూజార్థం తపో దంభేన చైవ యత్ |
క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువమ్ ||            18

సత్కారం, సన్మానం, పూజలు పొందడంకోసం ఆడంబరంగా ఆచరించే తపస్సు అస్థిరం, అనిశ్చితం. అలాంటిది రాజసమంటారు.

మూఢగ్రాహేణాత్మనో యత్పీడయా క్రియతే తపః |
పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతమ్ ||            19

మొండిపట్టుదలతో తన శరీరానికి బాధ కలిగేటట్లుకాని, ఇతరులకు హాని తలపెట్టికాని చేసే తపస్సు తామసమవుతుంది.

దాతవ్యమితి యద్దానం దీయతే௨నుపకారిణే |
దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్త్వికం స్మృతమ్ ||        20

దానం చేయడం కర్తవ్యంగా భావించి, పుణ్యక్షేత్రాలలో పర్వదినాలలో యోగ్యతను గమనించి, ప్రత్యుపకారం చేయలేనివాళ్ళకు చేసేదానం సాత్వికం.

యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః |
దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతమ్ ||        21

ప్రత్యుపకారం పొందాలనే వుద్దేశంతోకాని, ప్రతిఫలాన్ని ఆశించికాని, మనసులో బాధపడుతూకాని చేసేదానం రాజసం.

అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే |
అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతమ్ ||            22

అనువుకానిచోట అకాలంలో అపాత్రుడికి అగౌరవంగా, అవమానకరంగా యిచ్చేదానం తామసం.

ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః |
బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా ||            23

పరబ్రహ్మకు ఓమ్ తత్ సత్ అనే మూడు పేర్లు చెప్పారు. పూర్వం దానివల్లనే బ్రాహ్మణులు, వేదాలు, యజ్ఞాలు సృష్టించబడ్డాయి.

తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః |
ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినామ్ ||        24

అందువల్లనే వేదవేత్తలు శాస్త్రోక్తంగాచేసే యజ్ఞాలు, దానాలు, తపస్సులను ఎప్పుడూ “ ఓమ్ ” అని చెప్పిన తరువాతే ఆరంభిస్తారు.

తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞతపఃక్రియాః |
దానక్రియాశ్చ వివిధాః క్రియన్తే మోక్షకాంక్షిభిః ||        25

మోక్షాన్ని కోరేవాళ్ళు ఫలాపేక్ష లేకుండా పలువిధాలైన యజ్ఞాలు, దానాలు, తపస్సులవంటి పుణ్యకార్యాలు తత్ అనే శబ్దాన్ని ఉచ్చరించిన అనంతరమే ఆచరిస్తారు.

సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే |
ప్రశస్తే కర్మణి తథా సచ్ఛబ్దః పార్థ యుజ్యతే ||            26

పార్థా! ఉనికి, ఉత్తమం—ఈ రెండు అర్థాలలో సత్ అనే పదాన్ని వాడతారు. అలాగే శుభకార్యాలలో కూడా సత్ శబ్దాన్ని ఉపయోగిస్తారు.

యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే |
కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే ||                27

యజ్ఞం, తపస్సు, దానాలలోని నిష్ఠకు కూడా సత్ శబ్దం సంకేతం. ఈశ్వరుడి ప్రీతికిచేసే కర్మలన్నిటినీ సత్ అనే చెబుతారు.

అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చ యత్ |
అసదిత్యుచ్యతే పార్థ న చ తత్ప్రేత్య నో ఇహ ||                28

పార్థా! హోమం, దానం, తపస్సు, ఇతర కర్మలు—వీటిని అశ్రద్ధగా ఆచరిస్తే అసత్ అంటారు. వాటివల్ల ఇహలోకంలోకాని, పరలోకంలోకాని ఫలితమేమీ వుండదు.

ఇలా ఉపనిషత్తులు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రం, శ్రీకృష్ణార్జున సంవాదం అయిన శ్రీమద్భగవద్గీతలోని " శ్రద్ధాత్రయ విభాగయోగము" అనే పదునేడవ అధ్యాయం సమాప్తం.

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...