Saturday, September 26, 2020

మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతకాలి

మానవులుగా బతకటం కాదు.. మానవత్వంతో బతకాలి 

_ఐకమత్యం అంటే మనం కుక్కమీద రాయి విసిరితే కుక్కపారిపోతుంది. అదే.. తేనెతుట్టి మీద విసిరితే మనమే పారిపోవాలి !_
_ఇద్దరు కొట్టుకుంటే.. ఒక్కరే గెలుస్తారు. రాజీపడితే... ఇద్దరూ గెలుస్తారు !_

_దేవుడికోసం తీర్ధాలు, పుణ్యక్షేత్రాలంటూ తిరుగుతావ్, ఆయనెక్కడోలేడు. శ్వాస తీసుకుంటూ సృష్టితో నువ్వేసుకున్న 'లంకె'లోనేవున్నాడు._ 

_సృష్టంతా అద్భుతమే. అందులో నువ్వూ భాగమే. ఆ అద్భుతమే భగవానుడు. అది తెలుసుకుని దాన్ని అనుభవించు, ఆనందించు._

_కష్టమొస్తే భగవంతుణ్ణి కొలుస్తావు. ఆయన నీకు రాబోయే కష్టాన్ని ఆపడు. నిత్యం స్మరిస్తే కొండంత కష్టాన్ని గోరంత చేసి, సులువుగా దాటే శక్తి నీకిస్తాడు. కష్టాలు కుంభవృష్టిలా నిన్ను ముంచేస్తే... నీకు గొడుగుపట్టి కాపాడతాడు... గుర్తుంచుకో !_

_జ్ఞానం.. ఆలోచించి మాట్లాడుతుంది. అజ్ఞానం.. మాట జారాక ఆలోచిస్తుంది. అమాంతం అజ్ఞానం పోయి జ్ఞానంరాదు._

_కొబ్బరిచెట్టు పెరిగేకొద్దీ పాతమట్టలు రాలిపోతాయి. జ్ఞానం కలిగేకొద్దీ తనపర భేదాలు తొలగిపోతాయి._

_పుండు మానితే పొలుసు అదేపోతుంది. పుండు మానకుండానే పొలుసు పీకేస్తే… పుండు తీవ్రమై రక్తం కారుతుంది ! జ్ఞానసిద్ధి అంచెలంచెలుగా కలగాలి. ఆత్రపడితే లాభంలేదు !_

_సముద్రమంత సమస్యొచ్చిందని దిగులుపడకు. ఆకాశమంత అవకాశం కూడా వుంది. తలెత్తి చూడు ముందు. నీపై నీకు నమ్మకం కావాలి._ 

_నీపై నమ్మకం నీకుబలం. నీపై అపనమ్మకం అవతలివారికి బలం !నీబలం ఎవరికీ తెలియకపోయినా నీవు బ్రతికేయవచ్చు.. నీ బలహీనత మాత్రం ఎవరికీ తెలియనివ్వకు నిన్ను నిన్నుగా బ్రతకనివ్వరు !_

_మరణం అంత మధురమైనదా ? ఒక్కసారి దాన్ని కలిసినవారు వదిలిపెట్టలేరు ?ప్రకృతికి కూడా అదంటే ఎంత పక్షపాతం ! ప్రాణంపోయిన జీవుల్ని నీళ్ళలో తేలుస్తుంది. ప్రాణమున్న జీవుల్ని నీళ్ళలో ముంచుతుంది !_

_నీపరిసరాలనెంత శుభ్రంగా వుంచినా నీకు అనారోగ్యం రావచ్చు. బుద్ధి అనే ఆసుపత్రిలో ఆలోచనలు అనే వైద్యుడు నీ రోగాలను తగ్గించగలడు. వాటిని ఆరోగ్యంగా వుంచుకో._

_వెంటరాని ఇంటిని, ఒంటిని రోజూ కడుగుతావ్.. నీవెంట వచ్చే మనసునెప్పుడు కడుగుతావు ?_

_నిజాయితీపరులు సింహంలాంటి వాళ్ళు. సింహం కూర్చోటానికి సింహాసనమెందుకు ? అదెక్కడ కూర్చుంటే అదే సింహాసనం. నిజమైన నిజాయితీపరులకు గుంపు అక్కర్లేదు !_

_ముని-మహర్షి-తపస్వి-యోగి.. వీరు వేరువేరు._
_మౌనంగావుండేవాడు ముని._
_నియమనిష్టలతో తపింపచేసుకునే వాడు తపస్వి._ 
_అతీంద్రియ శక్తుల్ని ఆకళింపు చేసుకున్నవాడు ఋషి._ 
_ధ్యానంలో మునిగి వుండేవాడు యోగి._

_పండు తింటే అరిగిపోతుంది. తినకపోతే ఎండిపోతుంది. జీవితం నువ్వు ఖుషీగా గడిపినా, భయపడుతూ గడిపినా కరిగిపోతుంది !_ 

_ఇప్పటిదాకా ఇతరుల కోసమే (నావాళ్ళనుకుంటూ) బతికేశావు. ఇప్పటికైనా ఆరోగ్యంగా, ఆనందంగా నీకోసం నువ్వు బతుకు._

_వచ్చే జన్మలో నువ్వెవరో, ఎక్కడ, ఎలా పుడతావో, అసలు జన్మవుందో లేదో తెలీదు._

_నువ్వు 'నావాళ్ళు నావాళ్ళు' అనుకుంటుంటే వాళ్ళు తర్వాత 'వాళ్ళవాళ్ళకోసమే' బతుకుతారు. నీకంటూ ఎవరూ ఉండరు. ఏమీ మిగలదు !_

_అర్ధం చేసుకుంటే.. పుట్టిందగ్గర్నుంచీ- పోయేందుకే మన ప్రయాణం ! ఈమాత్రం దానికి పుట్టటమెందుకో తెలియదు. తెలుసుకోటంలోనే వుంది కిటుకంతా.. అందుకే ఈ జీవితమంతా !_

_మరణం దగ్గరపడితేనే మహాసత్యాలు బోధపడ్తాయ్._ 

_పని చేయటానికి పనిమనిషి దొరుకుతుంది. వంట చెయ్యటానికి వంటవాళ్ళు దొరుకుతారు. రోగమొస్తే నీబదులు భరించటానికి ఎవరూ దొరకరు._ 

_వస్తువుపోతే దొరకచ్చు.. జీవితం పోతే మళ్ళీ దొరకదు తెరపడేరోజు ఏంతెలిసినా ప్రయోజనమేంటి ?_

_పక్కనెంతమందున్నా,ఎంత సంపదున్నా ఏంటి ?_
_30 లక్షల కారైనా, 3 వేల సైకిలైనా రోడ్డు ఒకటే.. పదంతస్తుల మేడైనా, పూరిగుడిసైనా వదిలేసే పోవాలి !_

_జనరల్ బోగీలో వెళ్ళినా, ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించినా స్టేషన్ రాగానే ఒకేసారి దిగిపోతారు !_

_మానవులుగా బతకటం కాదు.._
_మానవత్వంతో బతకాలి !

Tuesday, September 22, 2020

*పురుగు తరువాత జన్మలు*

**************

*పురుగు తరువాత జన్మలు*

కాలక్రమేణా, ఆ పురుగు వరుసగా అన్ని జన్మలు ఎత్తుతూ క్షత్రియ జన్మలో ఒక రాజ్యానికి రాజయ్యాడు. రాజ్య సుఖాలు అనుభవిస్తున్నాడు. ఒక రోజు ఆ రాజు వ్యాసుడి ఆశ్రమానికి వెళ్ళాడు. రాజు వ్యాసుడి పాదాలకు నమస్కరించాడు. వ్యాసుడు రాజుకు తగు విధంగా మర్యాదచేసి " రాజా ! ఈ జన్మలో నీవు తపస్సు చెయ్యి. ఆవుల కొరకు, బ్రాహ్మణుల కొరకు యుద్ధములో ప్రాణములు వదులు. నీకు బ్రాహ్మణజన్మ వస్తుంది " రాజు కూడా వ్యాసుడు చెప్పినది చేసి యుద్ధములో ప్రాణాలు వదిలి మరుజన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాడు. ఆ బ్రాహ్మణజన్మలో ఎన్నో యజ్ఞయాగాలు చేసాడు, పుణ్యక్షేత్రాలు దర్శించాడు, దానధర్మాలు చేసాడు. తరువాత ఒక సారి వేదవ్యాసుడిని దర్శించుకున్నాడు. వ్యాసుడు సంతోషించి అతడిని కీర్తి ప్రతష్ఠలతో అలరారమని దీవించాడు. ధర్మనందనా ! కనుక ధర్మనందనా ! యుద్ధములో మరణించిన వారికి ఉత్తమ గతులు ప్రాప్తించుట తధ్యము. ఇందు అనుమానము ఏదీ లేదు " అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

*ఊర్ధ్వలోకములు

*ఊర్ధ్వలోకములు*
ధర్మరాజు " పితామహా ! మేము చేసిన యుద్ధములో ఎంతోమంది మరణించారు కదా ! వారికి ఏ లోకములు ప్రాప్తిస్తాయి తెలపండి. ఎందుకంటే మానవులు అందరూ బ్రతకడం సుఖాలు అనుభవించడానికి అని, చావడం దుఃఖహేతువు అని భావిస్తారు కనుక ఎవరు తమతమ ప్రాణములను వదలుటకు సులభముగా అంగీకరించలేరు. అందుకని అడిగాను " అన్నాడు ధర్మరాజు. 

భీష్ముడు " ధర్మనందనా ! నీకు ఈ సందర్భంలో ఒక కీటకముకు వేదవ్యాసుడికి మధ్యజరిగిన సంభాషణ చెప్తాను విను. 

ఒకసారి వేదవ్యాసుడు బండ్లు పోయే దారిలో వేగంగా పరుగెడుతున్న ఒక పురుగును చూసి " ఓ పురుగా ! ఎందుకు అలా వేగంగా ఎందుకు అలా భయంతో వేగంగా పరుగెడు తున్నావు " అని అడిగాడు. ఆ పురుగు " ఓ మహాత్మా ! చూసారా ఈ దారిలో అతి వేగంగా బండ్లు వస్తున్నాయి. ఈ బండ్లశబ్ధము, ఎద్దుల రంకెలు మనుష్యుల అరుపులు నాకు బెదురు పుట్టిస్తున్నాయి. బ్రతకడం సుఖం, చావడం దుఃఖంకదా ! అందుకని ఆ బండ్ల కిందపడి చావకుండా ఇంకా కొంత కాలం బ్రతుకుదామని వేగంగా పరుగెడుతున్నాను. ఏమైనా ప్రాణులకు ప్రాణభీతి ఎక్కువ కదా ! " అన్నది. వ్యాసుడు " నీవా చిన్న పురుగువు. నీవు సుఖములు అనుభవించ లేవు. అటువంటి సమయంలో నీకు ప్రాణభయం ఎందుకు ? నీకు చావే సుఖముకదా ! అప్పుడు ఈ భయాలు ఉండవు " అన్నాడు. 

ఆ మాటలకు ఆ పురుగు నవ్వి " మహాత్మా ! పురుగులకు కీటకములకు ఇంద్రియ సుఖములు లేవని మీరు ఎలా చెప్పగలరు. మా పద్ధతిలో మేము కూడా మానవుల వలె మా దారిలో ఇంద్రియ సుఖములను అనుభవిస్తాము. అందుకే మాకు కూడా ప్రాణభయము, బ్రతుకు మీద ఆశ ఉన్నాయి. అయినా మునీంద్రా ! నా మనసు తెలుసుకోవాలని అడుగుతున్నావు కాని ఆ మాత్రము నీకు తెలియదా చెప్పు అని ఈవిధంగా చెప్పసాగింది.

*పురుగు - పూర్వజన్మ*

నేను పోయిన జన్మలో శూద్రుడను. చాలా ధనవంతుడను. ఆ జన్మలో నేను చాలా క్రూరుడను, అనాచారిని, అతిలోభిని. దయ, జాలి లేని వాడిని. దురుసుగా ఉండే వాడిని. అన్ని దుర్గుణములు కలిగినవాడిని. కాని నేను నా తల్లిని భక్తితో సేవించే వాడిని. ఒక నాడు మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. నేను అతడిని భక్తితో పూజించాను. అందువలన నాకు పునర్జన్మ స్మరణ కలిగింది. అప్పటి నుండి నాకు మంచిపనులు చేస్తే సుఖాన్ని ఇస్తాయి అనే స్మురణ కలిగింది. కనుక మునీంద్రా ! నాకు ఆ విషయముల గురించి సవిస్త్రరంగా వివరించండి " అని అడిగింది. 

వ్యాసుడు " ఓ కీటకమా ! నిన్ను చూడగానే నీ పూర్వజన్మ వృత్తాంతం నాకు తెలిసింది. నీవు గతజన్మలో పాపములు చేసినందువలన నీకు పురుగుజన్మ వచ్చిందని నాకు తెలుసు. అలాగే నీవు కొన్ని పుణ్య కార్యములు కూడా చేసావు. అందు వలననే నేను నీతో మాట్లాడుతున్నాను. నా తపోబలము చేత నేను నీకు ఈ పురుగుజన్మ నుండి విముక్తి కలిగిస్తాను. నీకు మనుష్యజన్మ ఎత్తి పుణ్యకార్యములు చేయవలెనన్న కోరిక కలగడం కూడా గతజన్మలో నీవు చేసిన పుణ్యకార్యముల ఫలమే ! మానవులు తాము చేసిన పుణ్యకార్యముల వలన దేవతలౌతారు. తాము చేసిన పాపకార్యముల వలన ఇలా కీటకముల జన్మ ఎత్తుతారు. నీవు గతజన్మలో చేసిన పుణ్య కార్యముల వలన నీకు గతజన్మస్మృతి కలగడమే కాక నా దర్శనభాగ్యము కూడా కలిగింది. నేను నీకు ఉత్తమగతులు ప్రసాదిస్తాను. ఇక నుండి నీవు జంతువుగాను, మానవులలో వరుసగా శూద్ర, వైశ్య, క్షత్రియ జన్మలెత్తి తుదకు బ్రాహ్మణజన్మ ఎత్తుతావు. నీకు అన్ని జన్మలలో పూర్వ జన్మస్మృతి ఉంటుంది " అని ఆ పురుగుకు వరం ఇచ్చాడు. ఆ పురుగు వ్యాసుడి పాదాలు తాకి ప్రాణాలు వదిలింది. ఆ తరువాత వ్యాసుడు వెళ్ళి పోయాడు.

Monday, September 21, 2020

విద్య వల్ల వినయమే రావాలి :

***************
విద్య  వల్ల  వినయమే  రావాలి :

శ్రీకృష్ణ దేవరాయలవారి ఆస్థానానికి సూర్య శాస్త్రి అనే పండితుడు విచ్చేశాడు. Un రాయలవారు సభలో కూర్చుని ఉండగా సభలో ప్రవేశించిన సూర్య శాస్త్రి సభకు నమస్కరించి ఆసీనుడయ్యాడు. ఇంతలో "మహారాజా..! నేను అవునన్నది కాదనీ, కాదన్నది అవుననీ వాదన చేసి విజయం సాధిస్తాను. మీ రాజ్యంలో నన్ను ఓడించే కవి ఉంటే ముందుకు రమ్మని చెప్పండని" సవాలు విసిరాడు సూర్య శాస్త్రి.

సూర్య శాస్త్రి పాండిత్యం దిట్ట అనీ, అతడిని ఓడించటం అంటే కొరివితో తల గోక్కోవటం లాంటిదేనని రాయలవారి కొలువులోని అష్ట దిగ్గజ కవులు మౌనం వహించారు. దీంతో అష్ట దిగ్గజాల మౌనానికి ఉలిక్కిపడిన రాయలవారు మహామంత్రి తిమ్మరుసుతో "అప్పాజీ.. మన అష్ట దిగ్గజ కవులు మౌనం వహించటం నా రాజ్యానికే తీరని మచ్చ. నేనే అతడితో వాదిస్తానని చెప్పండ"ని అన్నాడు.

అప్పాజీ పక్కనే ఉన్న తెనాలి రామకృష్ణుడు రాయలవారి మాటలను విన్నాడు. వెంటనే ఆయన లేచి నిలబడి "ప్రభూ.. ఈ చిన్న విషయానికి తమరెందుకు శ్రమపడాలి. పెద్దన, తిమ్మరుసు లాంటి కవులు ఉన్నారు కదా.. అని నేను మౌనం వహించాను. మీరు నాకు ఆజ్ఞ ఇచ్చారంటే సూర్య శాస్త్రితో నేనే వాదిస్తానని" అన్నాడు.

రాయలవారి మొహంలో చిరునవ్వు తారట్లాడుతుండగా "సరే"నని అన్నాడు. వెంటనే రామలింగడు సూర్య శాస్త్రితో వాదనకు దిగాడు. మనసులో కాళీమాతను స్మరించుకున్న రామలింగడు సూర్యశాస్త్రితో వాదనను కొనసాగించాడు. మిగిలిన అష్ట దిగ్గజ కవులు, సభలోని పెద్దలు, విజయనగర సామ్రాజ్య పౌరులు అంతా ఆసక్తిగా వినసాగారు.

రామలింగడు సూర్య శాస్త్రితో ఇలా అన్నాడు. "అయ్యా.. మీరు నేను అవునంటే, కాదని వాదిస్తారు కదూ..?" అన్నాడు. "అవునోయ్.. నేను అలాంటి వాదన కోసమే ఎదురు చూస్తున్నాన"ని గర్వంగా బదులిచ్చాడు సూర్య శాస్త్రి. వినయంగా తలవంచిన రామలింగడు "మీ అమ్మాయి విధవ కాదు కదా...!!" అన్నాడు. వెంటనే సూర్య శాస్త్రికి ఎక్కడో మెలిపెట్టినట్లు అయ్యింది. "సౌభాగ్యవతి అయిన కూతురును విధవ అంటే ఎంత తప్పు. ఏ తండ్రి అయినా విధవ అని ఎలా చెప్పగలడు" అని మనసులో మధనపడ్డాడు సూర్య శాస్త్రి.

కళ్లలో నీళ్లు గిర్రున తిరుగగా.. "రామలింగా.. నాలోని అహంకారాన్ని జయించావు. నీకు వేనవేల నమస్కారాలు" అని బదులిచ్చాడు సూర్య శాస్త్రి. వెంటనే రాయలవారివైపు తిరిగిన సూర్య శాస్త్రి "మహారాజా.. నేను తర్కంలో రామలింగడితో ఓడిపోయాను. నన్ను మన్నించండని" దీనంగా సభను విడిచి వెళ్లిపోసాగాడు.

అలా వెళ్లిపోతున్న సూర్య శాస్త్రిని ఆపిన రామలింగడు "అయ్యా.. తర్కంలో మీరు ఉద్ధండ పండితులే, విద్య వల్ల వినయం రావాలేగానీ, అహంభావాన్ని ప్రదర్శించకూడదు. ఇది తెలియజెప్పేందుకు నేను అలా మాట్లాడాల్సి వచ్చిందని" అన్నాడు. అలాగే రాయలవారితో "మహారాజా.. దయచేసి వీరిని క్షమించి సత్కరించి పంపండని" అన్నాడు.

"తప్పకుండా అలాగే సత్కరించి పంపిద్దాం రామలింగా.." అన్నాడు సంతోషంగా రాయలవారు. అంతేగాకుండా సూర్య శాస్త్రిని ఓడించి విజయనగర సామ్రాజ్యం పరువు నిలిపినందుకు రామలింగడికి తన మెడలోని పచ్చల హారాన్ని కానుకగా ఇచ్చి, ఘనంగా సత్కరించాడు శ్రీ కృష్ణ దేవరాయలు.
👏👏👏

Sunday, September 20, 2020

స్థిరచిత్తం


స్థిరచిత్తం*

జయాపజయాలతో సంబంధం లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తిచెయ్యాలంటారు పెద్దలు. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రమది. జీవిత గమనంలో మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు. పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ఉండకపోదు. ఏకాగ్రత, స్థిరచిత్తం పనుల్ని సఫలం చేస్తాయి. ఆధ్యాత్మికత ఆ రెండింటినీ మనిషి వశం చేస్తుంది.

ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది. విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది. అంతలోనే అపజయం ఎదురవుతుంది. పరాజయానికి సమర్థతాలేమి కన్నా సరైన ప్రణాళిక లేకపోవడమే ఎక్కువ కారణమవుతుంది. అర్జునుడు పక్షి కనుగుడ్డుకు గురిపెట్టినప్పుడు, మత్స్యయంత్రం ఛేదనకు పూనుకొన్నప్పుడు అతడి విజయానికి కారణమయ్యింది ప్రతిభ మాత్రమే కాదు- రెప్పపాటు నిడివి సైతం తేడాలేకుండా బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం.

మనసు పరిపరి విధాలైన ఆలోచనల్ని చేస్తుంది. ఏ ఒక్క ఆలోచనా కడవరకు సాగదు. ఉద్రేకపూరిత భావనలు మనసును అల్లకల్లోలం చేస్తాయి. అస్థిరమైన మనసు కార్యసాధనకు ఆటంకమవుతుంది. మనసును వశం చేసుకున్నవాడు విశ్వవిజేత అవుతాడని బుద్ధుడి మాట. విశ్వామిత్రుడు మనోస్థిరత్వాన్ని సాధించలేకపోయాడు. మేనకాధీనుడై చిరకాలం దీనుడిగా మిగిలిపోయాడు. ఊర్వశిని త్యజించిన అర్జునుడు మనసుపై విజయం సాధించాడు. విజయుడిగా స్థిరపడ్డాడు. కార్యసఫలతకు కృషి చేసే సాధకుడు మనో నిబ్బరాన్ని అలవరచుకోవాలి. సమయానుకూలంగా మనసును అధీనంలోకి తెచ్చుకోవడం కోసం ధ్యాన సాధన చేయాలి.

అహంకారం అవరోధాలకు కారణమవుతుంది. లక్ష్యసాధనకోసం పురోగమించే వ్యక్తి అహంకార రహితుడు కావాలి. అధికారం, అహంకారం, మమకారం మత్తు కన్నా ప్రమాదకరమైనవి. ‘నేను వదిలి రా, నేను కనబడతాను’ అంటాడు భగవంతుడు భక్తుడితో. తీవ్రమైన ఆటంకాల వరద ముంచేస్తున్నప్పుడు మహావృక్షంలా అహంకరించినవాడు కూకటి వేళ్లతో సహా కూలిపోతాడు. సమయానుకూలంగా గడ్డిపోచల మాదిరిగా తలదించుకు నిలిచిన వ్యక్తి ఆపదల నుంచి గట్టెక్కుతాడు. కఠినమైన టెంకాయను గుడిలో పగలగొట్టడం అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడి వేడికోలుకు ప్రతీక.

మనిషి తన జీవిత కాలంలో గొప్ప కార్యాలెన్నో తలపెడతాడు. విజయం వరించినా లేకపోయినా పరాజయం మాత్రం కచ్చితంగా నిర్ధారితమై ఉంటుంది. ఓటములకు లోనై అలసట చెందిన మనిషి అంతర్గతంగా మనసు చెప్పే మాటల్ని ఆలకించాలి. పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి. సమయానుకూలమైన నిర్ణయాలను స్వాగతించాలి. నరికిన మోడు నుంచి చిగురించిన పచ్చని మొక్కలా తనను తాను మలచుకోవాలి.

సాధకుడి విజయాలకు పరమార్థం వ్యక్తి ప్రగతి మాత్రమే అయి ఉండదు. సమాజ పురోగతి సైతం అందులో అంతర్లీనమై ఉంటుంది. సమాజ సహకారం, తోడ్పాటు లేనిదే ఏ వ్యక్తీ ఉన్నతుడిగా ఎదగలేడు. లక్ష్య సాధన చేసిన వ్యక్తి విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలి. పంచభూతాలు విశ్వమంతా ఆవరించిన ప్రకృతి నేర్పే విలువైన పాఠం మనిషిని విశాలదృక్పథుడిగా మార్చడమే. భూమి అట్టడుగు పొరల్లో పడి ఉన్న నన్ను ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు ఏమివ్వగలను... సమయానుకూలతను బట్టి ధాన్యరూపంలో నన్ను నేను అర్పించుకోవడం తప్ప- అనుకొని పంటసిరి మురిసిపోతుంది!
👏👏

Thursday, September 17, 2020

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.1. అర్ధ దోషం2. నిమిత్త దోషం 3. స్ధాన దోషం4. గుణ దోషం 5. సంస్కార దోషం.

మనం తీసుకునే ఆహారంలో ఐదు విధాలైన దోషాలు యిమిడివున్నాయి.
1.  అర్ధ దోషం
2.  నిమిత్త దోషం         
3.  స్ధాన దోషం
4.  గుణ దోషం   
5.  సంస్కార దోషం.

ఈ ఐదు దోషాలను గుర్తించి స్వీకరించకపోతే ఎన్నో అనర్ధాలు కలుగుతాయని పెద్దలు చెపుతారు. 

🔸 అర్ధ దోషం

ఒక సాధువు  తన శిష్యుని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. భోజనం చేస్తున్నప్పుడు ఎవరో  ఒక వ్యక్తి  వచ్చి ఆ శిష్యునికి  ధనంతో వున్న మూటని ఇవ్వడం చూశాడు.

భోజనం చేసి, సాధువు ఒక గదిలో విశ్రాంతి తీసుకోసాగాడు.ఆ గదిలోనే  శిష్యుడు దాచిన డబ్బు మూట వుంది. 

హఠాత్తుగా సాథువు మనసులో ఒక దుర్భుధ్ధి కలిగింది , ఆ మూటలో నుండి కొంచెం డబ్బు తీసుకుని తన సంచీలో దాచేశాడు.

తరువాత శిష్యుని వద్ద సెలవు తీసుకుని, తిరిగి తన ఆశ్రమానికివెళ్ళి పోయాడు.మరునాడు పూజా సమయంలో తను చేసిన పనికి సిగ్గుతో పశ్చాత్తాపం చెందాడా సాధువు.  

తను శిష్యుని ఇంట్లో చేసిన దోషభూయిష్టమైన భోజనం వల్లనే తనకా దుర్బుధ్ధి కలిగిందని రాత్రి ఆహారం జీర్ణమయి, ప్రొద్దుననే  మలంగా విసర్జించబడిన తర్వాత మనసు నిర్మలమై పరిశుధ్ధమైనట్టు అర్థం చేసుకున్నాడు.

వెంటనే  తాను తస్కరించిన డబ్బును తీసుకొని శిష్యుని ఇంటికి వెళ్ళి జరిగినదంతా చెప్పి, ఆ డబ్బును  తిరిగి ఇచ్చేశాడు. శిష్యుడిని ఎలాంటి వృత్తి ద్వారా డబ్బు సంపాదిస్తున్నావని అడిగాడు. 

శిష్యుడు తలవంచుకొని, "నన్ను క్షమించండి, స్వామి!  యిది సన్మార్గంలో వచ్చిన డబ్బు కాదు." అని తలవంచుకొన్నాడు.

ఈ విధంగా సన్మార్గంలో సంపాదించని డబ్బుతో కొన్న పదార్థాలతో, తయారు చేసిన ఆహారం భుజించడమే అర్ధదోషం.  మనం న్యాయంగా సంపాదించిన దానితోనే ఆహారం తయారు చేసుకుని, భుజించడం ముఖ్యం. 

🔸 నిమిత్త దోషం
 
మనం తినే ఆహారాన్ని  వండేవారు కూడా మంచి మనసు కలవారై వుండి, సత్యశీలత కలిగి దయ, ప్రేమ కల మంచి స్వభావము కలిగినవారై ఉండాలి.

వండిన ఆహారాన్ని క్రిమికీటకాలు, పక్షులు జంతువులు తాక కూడదు. ఆహారం మీద దుమ్ము, శిరోజాలు  వంటివి పడ కూడదు.

అపరిశుభ్రమైన ఆహారం మనసుకి అసహ్యత కలిగిస్తుంది. దుష్టులైన వారి చేతి వంట భుజిస్తే వారి దుష్ట గుణాలు అవతలివారికి కలుగుతాయి. 

భీష్మాచార్యుల వారు కురుక్షేత్ర యుధ్ధంలో బాణాలతో  కొట్టబడి యుధ్ధం ముగిసేవరకు అంపశయ్య మీద ప్రాణాలతోనే  వున్నాడు. ఆయన చుట్టూ పాండవులు, ద్రౌపది శ్రీ కృష్ణుడు వున్నారు. వారికి భీష్ముడు మంచి మంచి  విషయాలను  బోధిస్తూ వచ్చాడు.

అప్పుడు ద్రౌపది కి ఒక ఆలోచన కలిగింది. ఇప్పుడు ఇంత వివేకంగా ఆలోచిస్తున్న భీష్ముడు ఆనాడు దర్యోధనుడు నా వస్త్రాలు అపహరించమని దుశ్శాసనునికి ఆదేశించినప్పుడు ఎందుకు ఎదిరించి మాటాడలేక పోయాడు?  అని అనుకొన్నది.

ఆమె ఆలోచనలు గ్రహించిన భీష్ముడు
'అమ్మా ! నేను అప్పుడు దుర్యోధనుని, ప్రాపకంలో వారిచ్చిన ఆహారం భుజిస్తూ వచ్చాను. 

నా స్వీయ బుధ్ధిని ఆ ఆహారం తుడిచి పెట్టింది. శరాఘాతములతో, ఛిద్రమైన దేహంతో, ఇన్ని రోజులు ఆహారం తీసుకోనందున, పాత రక్తం - బిందువులుగా బయటికి పోయి నేను 
ఇప్పుడు పవిత్రుడినైనాను.

నా బుద్ధి వికసించి, మీకు మంచి మాటలు చెప్పగలుగుతున్నాను అన్నాడు భీష్ముడు.

చెడ్డ గుణములు వున్న వారు ఇచ్చినది  తినినందు వలన మనిషిలోని మంచి గుణములు నశించి *'నిమిత్త దోషం '* ఏర్పడుతోంది.

🔸 స్ధాన దోషం

ఏ స్ధలంలో ఆహారం వండబడుతున్నదో, అక్కడ మంచి ప్రకంపనలు వుండాలి. వంట చేసే సమయంలో అనవసరమైన చర్చలు, వివాదాల వలన చేయబడిన వంటll కూడా పాడైపోతుంది.

యుధ్ధరంగానికి, కోర్టులు, రచ్చబండలు వున్న చోట్లలో వండిన వంటలు అంతl మంచివి కావు.

దుర్యోధనుడు  ఒకసారి యాభైఆరు రకాల వంటలు వండించి శ్రీ కృష్ణుని  విందు భోజనానికి పిలిచాడు. కాని కృష్ణుడు దుర్యోధనుని పిలుపును నిరాకరించి విదురుని యింటికి భోజనానికి వెళ్ళాడు. కృష్ణుని చూడగానే విదురుని భార్య సంతోషంగా ఆహ్వానించి ఉపచారాలు చేసింది.  తినడానికి ఏమిటి పెట్టడం అని యోచించి,  ఆనంద సంభ్రమాలతో తొందర పాటు పడి,అరటి పండు తొక్కవలిచి, పండు యివ్వడానికి బదులుగా తొక్కని అందించింది. కృష్ణుడు దానినే  తీసుకొని  ఆనందంతో భుజించాడు. ఇది చూసిన విదురుడు భార్యవైపు కోపంగా చూశాడు. అప్పుడు కృష్ణుడు, "విదురా! నేను ఆప్యాయతతో  కూడిన ప్రేమకోసమే ఎదురు చూస్తున్నాను. నిజమైన శ్రద్ధా భక్తులతో యిచ్చినది కాయైనా, పండైనా, ఆకైనా, నీరైనా, ఏది యిచ్చినా సంతోషంగా తీసుకుంటాను. అని అన్నాడు. 

మనం ఆహారం వడ్డించినప్పుడు, ప్రేమతో వడ్డించాలి 

🔸 గుణ దోషం

మనం వండే ఆహారం సాత్విక ఆహారంగా వుండాలి. సాత్విక ఆహారం, ఆధ్యాత్మికాభివృధ్ధిని కలిగిస్తుంది. రజోగుణం కలిగించే ఆహారం మనిషిని  లౌకిక మాయలో పడేస్తుంది. స్వార్ధాన్ని పెంచుతుంది.

🔸సంస్కారదోషం

ఆహారం వండే వారి సంస్కారం బట్టి దోషం ఏర్పడుతుంది.సంస్కారవంతుల చేతి వంట ఆరోగ్యాన్ని ఇస్తే సంస్కారహీనుల చేతి వంట లేని రోగాన్ని తెచ్చి పెడుతుంది.యాచయేత్ శ్రోత్రియస్యాన్నం అని శాస్త్రం చెపుతున్నాది శ్రోత్రియుని ఇంట అన్నం అడిగి తినవలెను 

                🍃🙏 సర్వేజనా సుఖినో భవంతు 🙏🍃

Wednesday, September 16, 2020

*నిద్రలో మెలకువ వస్తే ఆరోగ్యానికి సమస్యే..* తీసుకోవల్సిన జాగ్రత్తలివే..

*నిద్రలో మెలకువ వస్తే ఆరోగ్యానికి సమస్యే..* 
తీసుకోవల్సిన జాగ్రత్తలివే..

రాత్రి కన్నంటుకోగానే లోపల ఒక్కొక్క ఆర్గాన్‌‌‌‌   డ్యూటీ ఎక్కుతాయి.  ‘ఈ టైంకి  నువ్వు! ఫలానా టైంకి నువ్వు’ అని వంతులు పెట్టుకొని షిష్ట్‌‌‌‌వైజ్‌‌‌‌ పని చేసుకుంటాయి. వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్‌‌‌‌ లేకుండా పని చేసుకుంటే.. నిద్ర కూడా సుఖంగా ఉంటుంది. వాటికేదన్నా ప్రాబ్లమ్‌‌‌‌ వస్తే.. అవి మన నిద్రని డిస్టర్బ్ చేస్తాయి. నిద్ర మధ్యలో మెలకువ వచ్చిందంటే ఆ టైమ్‌‌‌‌ల డ్యూటీ చేస్తున్న ఆర్గాన్‌‌‌‌కి సుస్తీ చేసినట్టు! అంటే  టెస్ట్‌‌‌‌లు లేకుండా ఆర్గాన్‌‌‌‌ హెల్త్‌‌‌‌ కండిషన్‌‌‌‌ని గుర్తు పట్టొచ్చన్నమాట!

రోజంతా ఉల్లాసంగా ఉండాలంటే రాత్రి హాయిగా నిద్ర పోవాలి. కానీ మంచి నిద్ర ఎంత మందికి దొరుకుతుంది?  లైఫ్‌‌స్టైల్ ఎంతో హెల్దీగా ఉంటే కానీ అలా జరగదు. ఆరోగ్యానికి నిద్రకు లింక్ ఉంది. నిద్ర పోయే సమయాన్ని బట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేయొచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా నిద్ర మధ్యలో మెలకువ వచ్చే టైంని బట్టి కూడా హెల్త్ ఎలా ఉందో డిసైడ్ చేయొచ్చు.

చాలామందికి నిద్ర పోయేటప్పుడు మధ్యలో మెలకువ వస్తుంది. నిద్ర మధ్యలో ఒకట్రెండు సార్లు లేచి, మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అయితే  రోజూ ఒకే టైంకి మెలకువ వస్తుందంటే.. శరీరంలో ఏదో తేడా ఉన్నట్టేనని అంటున్నారు డాక్టర్లు. మెలకువ వచ్చే  టైంని బట్టి శరీరంలో ఎక్కడ ప్రాబ్లమ్ ఉందో చెప్పొచ్చంటున్నారు.

*రిపేరింగ్ టైం..*

నిద్ర పోయేటప్పుడు శరీరం.. ప్రాబ్లమ్స్‌‌ను రిపేర్ చేసుకుంటుంది. ఆరోజులో జరిగిన మెంటల్, ఫిజికల్ ఇంబాలెన్స్‌‌ను  బాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. హార్మోన్స్‌‌ను సమతుల్యం చేసి, మరుసటి రోజుకు శరీరాన్ని రెడీ చేస్తుంది. ఈ ప్రాసెస్ రాత్రంతా జరుగుతుంది. అయితే ఈ ప్రాసెస్ ఒక టైం టేబుల్ ప్రకారం జరుగుతుంది.
ఒక్కో అవయవానికి ఒక్కో టైం ఉంటుంది. ఆ టైంలో అవయవానికి ఏదైనా డిస్టర్బెన్స్ఉంటే పనికి ఆటంకం జరిగి, శరీరం మేల్కొంటుంది. అంటే మెలకువ వచ్చే సమయాన్ని బట్టి అవయవాల పనితీరుని డిసైడ్ చేయొచ్చన్న మాట.

శరీరం నిద్రలో ఉన్నా, మేల్కొని ఉన్నా తన పనితీరుకి సంబంధించిన సిగ్నల్స్‌‌ని ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది. వాటిని అర్ధం చేసుకొని మార్పులు చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. నిద్రకు ఆటంకం కలుగుతుందంటే… ఎక్కడో, ఏదో ప్రాబ్లమ్ ఉన్నట్టు లెక్క. ఆ ప్రాబ్లమ్‌‌ని ఎలా కనిపెట్టాలో చూద్దాం.

9–11
తొమ్మిది నుంచి పది గంటల మధ్యలోనే చాలామంది నిద్రలోకి జారుకుంటారు. అయితే కొంతమందికి ఇలా పడుకోగానే అలా మెలకువ వస్తుంది. తొమ్మిదింటికి పడుకుంటే పదకొండు లోపే మెలకువ వచ్చి, సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. 11  గంటలలోపు మెలకువ వచ్చిందంటే.. మెదడు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇలాంటి వాళ్లు ఎక్కువగా ఒత్తిడిని ఫేస్ చేస్తున్నట్టు అర్ధం. అలాగే తొమ్మిది నుంచి పదకొండు గంటల మధ్య థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్‌‌గా ఉంటుంది. ఈ టైంలో నిద్రకు డిస్టర్బెన్స్ వస్తుందంటే.. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం కూడా ఉంది. అందుకే ఇలాంటి వాళ్లు ఆరోగ్యకరమైన లైఫ్‌‌స్టైల్‌‌ని అలవరచుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్–ఎ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. మెడిటేషన్ చేయడం, శుభ్రమైన నీళ్లు తాగడం, స్వచ్ఛమైన గాలి పీల్చడం మంచిది. రోజూ అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కొవ్వు, ఉప్పు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి.

11–1
సాధారణంగా రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో గాల్ బ్లాడర్ (పిత్తాశయం) శరీరంలోని ఫ్యాట్స్‌‌ని కరిగిస్తుంది. గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అయ్యే  పైత్యరసం చిన్న పేగుల్లోకి వెళ్లి, ఆహారం జీర్ణం అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది.  ఇందులోని ఎంజైమ్స్, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి, వాటి  ద్వారా అందే ఏ, డీ, ఈ, కె విటమిన్లను శరీరానికి అందిస్తాయి. ఈ సమయంలో నిద్ర ఇబ్బందిగా మారిందంటే..  గాల్ బ్లాడర్ పని తీరు సరిగా లేదని అర్ధం. ఇలాంటి వాళ్లు  డైట్‌‌లో అన్‌‌హెల్దీ ఫ్యాట్స్, ఆయిల్స్‌‌ను తగ్గించాలి. పడుకునే ముందు ఈజీగా అరిగే ఆహారాన్ని తీసుకోవాలి.

1–3
ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో లివర్ యాక్టివ్‌‌గా ఉంటుంది.  శరీరంలోని మలినాలను క్లీన్ చేసి, బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది. ఈ టైంలో మెలకువ వచ్చిందంటే.. లివర్‌‌‌‌లో ఏదో ప్రాబ్లమ్‌‌ ఉందని అర్ధం.  రాత్రిళ్లు ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్స్ తిన్నా, ఆల్కహాల్ తాగినా ఇలా జరుగుతుంది. కాలేయం జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన అవయవం. ఇది శరీరానికి కావాల్సిన రసాయనాలను తయారు చేసి, సరఫరా చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలోని విషపదార్థాలను తనలో దాచుకుని, శరీరానికి హాని జరగకుండా కాపాడుతుంది. శరీరానికి గుండె ఎంత ఇంపార్టెంటో లివర్​ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకే ఈ టైంలో మెలకువ వచ్చే వాళ్లు  ఆల్కహాల్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి. నీళ్లు, ఆహారం కలుషితంగా ఉన్నాయేమో చూసుకోవాలి. కొవ్వు పదార్థాలు తగ్గిస్తే మంచిది.

3–5
3 గంటల నుంచి 5 గంటల మధ్యలో  ఊపిరితిత్తులు ఆక్సిజన్‌‌ను ఎక్కువగా పంప్ చేస్తాయి. కండరాలకు రక్తం, ఆక్సిజన్  అందే సమయం ఇదే. ఈ సమయంలో  మెలకువ వస్తోందంటే  లంగ్స్‌‌లో సమస్య ఉన్నట్టు గుర్తించాలి. అందుకే ఇలాంటి వాళ్లు  రెగ్యులర్‌‌‌‌గా బ్రీతింగ్ ఎక్సర్‌‌‌‌సైజులు, కార్డియో వ్యాయామాలు చేయాలి. జంక్ ఫుడ్స్ అస్సలు తీసుకోకూడదు. పడుకునే ముందు లైట్‌‌ ఫుడ్‌‌ తీసుకోవాలి. భోజనం తర్వాత కొద్దిసేపు నడిస్తే, ఆహారం జీర్ణమై పడుకునే సమయానికి గాలి బాగా ఆడుతుంది.

5–7
5 నుంచి 7 గంటల మధ్యలో శరీరం టాక్సిన్స్‌‌ని బయటకు పంపుతుంది. శరీరం మొత్తాన్ని క్లీన్ చేసే టైం ఇది. అందుకే ఈ టైంలో మెలకువ వస్తే వెంటనే లేవడం మంచిది. లేచి కాలకృత్యాలు తీర్చుకుంటే.. హెల్దీగా, ఫ్రెష్‌‌గా రోజుని స్టార్ట్ చేయడానికి శరీరం రెడీ అవుతుంది. ఈ టైంలో మెలకువ వచ్చినా లేవకుండా అలాగే నిద్రపోతే..  శరీరం తాజాదనాన్ని కోల్పోయి, అలసిపోయినట్టు తయారవుతుంది. ఆ ఎఫెక్ట్ రోజంతా ఉంటుంది.

*ఇవి కూడా..*
ఎక్కువగా టీవీ చూడడం, మొబైల్ వాడడం, జంక్ ఫుడ్ తినడం, మద్యం, సిగరెట్ల లాంటి అలవాట్లు నిద్రను పాడుచేస్తాయి. నిద్ర సరిగా లేకపోతే అవయవాల పనితీరు మందగించి, బీపీ పెరగడం, గుండె సమస్యలు, ఒత్తిడి, ఆందోళన, నరాల బలహీనత, చేతులు తిమ్మిర్లు రావడం, రోగ నిరోధక శక్తి సన్నగిల్లడం లాంటి ఎన్నో సమస్యలు వచ్చే ప్రమాదముంది.

*మంచి నిద్ర కోసం..*
నిద్రకు సరైన టైం టేబుల్ అలవర్చుకోవాలి.
6 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
ఆల్కహాల్​, సిగరెట్‌‌ అలవాట్లకు దూరంగా ఉండాలి.
పడుకునే ముందు స్నానం చేయాలి. రాత్రిళ్లు లైట్ ఫుడ్ తీసుకోవాలి. రాత్రి 8 గంటల లోపే భోజనం ముగించాలి.
రాత్రిళ్లు టీవీ చూడడం, సెల్‌‌ఫోన్‌‌ వాడడం తగ్గించాలి....

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...