Sunday, September 20, 2020

స్థిరచిత్తం


స్థిరచిత్తం*

జయాపజయాలతో సంబంధం లేకుండా మొదలుపెట్టిన పనిని పూర్తిచెయ్యాలంటారు పెద్దలు. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రమది. జీవిత గమనంలో మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు. పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక ఉండకపోదు. ఏకాగ్రత, స్థిరచిత్తం పనుల్ని సఫలం చేస్తాయి. ఆధ్యాత్మికత ఆ రెండింటినీ మనిషి వశం చేస్తుంది.

ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది. విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది. అంతలోనే అపజయం ఎదురవుతుంది. పరాజయానికి సమర్థతాలేమి కన్నా సరైన ప్రణాళిక లేకపోవడమే ఎక్కువ కారణమవుతుంది. అర్జునుడు పక్షి కనుగుడ్డుకు గురిపెట్టినప్పుడు, మత్స్యయంత్రం ఛేదనకు పూనుకొన్నప్పుడు అతడి విజయానికి కారణమయ్యింది ప్రతిభ మాత్రమే కాదు- రెప్పపాటు నిడివి సైతం తేడాలేకుండా బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం.

మనసు పరిపరి విధాలైన ఆలోచనల్ని చేస్తుంది. ఏ ఒక్క ఆలోచనా కడవరకు సాగదు. ఉద్రేకపూరిత భావనలు మనసును అల్లకల్లోలం చేస్తాయి. అస్థిరమైన మనసు కార్యసాధనకు ఆటంకమవుతుంది. మనసును వశం చేసుకున్నవాడు విశ్వవిజేత అవుతాడని బుద్ధుడి మాట. విశ్వామిత్రుడు మనోస్థిరత్వాన్ని సాధించలేకపోయాడు. మేనకాధీనుడై చిరకాలం దీనుడిగా మిగిలిపోయాడు. ఊర్వశిని త్యజించిన అర్జునుడు మనసుపై విజయం సాధించాడు. విజయుడిగా స్థిరపడ్డాడు. కార్యసఫలతకు కృషి చేసే సాధకుడు మనో నిబ్బరాన్ని అలవరచుకోవాలి. సమయానుకూలంగా మనసును అధీనంలోకి తెచ్చుకోవడం కోసం ధ్యాన సాధన చేయాలి.

అహంకారం అవరోధాలకు కారణమవుతుంది. లక్ష్యసాధనకోసం పురోగమించే వ్యక్తి అహంకార రహితుడు కావాలి. అధికారం, అహంకారం, మమకారం మత్తు కన్నా ప్రమాదకరమైనవి. ‘నేను వదిలి రా, నేను కనబడతాను’ అంటాడు భగవంతుడు భక్తుడితో. తీవ్రమైన ఆటంకాల వరద ముంచేస్తున్నప్పుడు మహావృక్షంలా అహంకరించినవాడు కూకటి వేళ్లతో సహా కూలిపోతాడు. సమయానుకూలంగా గడ్డిపోచల మాదిరిగా తలదించుకు నిలిచిన వ్యక్తి ఆపదల నుంచి గట్టెక్కుతాడు. కఠినమైన టెంకాయను గుడిలో పగలగొట్టడం అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడి వేడికోలుకు ప్రతీక.

మనిషి తన జీవిత కాలంలో గొప్ప కార్యాలెన్నో తలపెడతాడు. విజయం వరించినా లేకపోయినా పరాజయం మాత్రం కచ్చితంగా నిర్ధారితమై ఉంటుంది. ఓటములకు లోనై అలసట చెందిన మనిషి అంతర్గతంగా మనసు చెప్పే మాటల్ని ఆలకించాలి. పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి. సమయానుకూలమైన నిర్ణయాలను స్వాగతించాలి. నరికిన మోడు నుంచి చిగురించిన పచ్చని మొక్కలా తనను తాను మలచుకోవాలి.

సాధకుడి విజయాలకు పరమార్థం వ్యక్తి ప్రగతి మాత్రమే అయి ఉండదు. సమాజ పురోగతి సైతం అందులో అంతర్లీనమై ఉంటుంది. సమాజ సహకారం, తోడ్పాటు లేనిదే ఏ వ్యక్తీ ఉన్నతుడిగా ఎదగలేడు. లక్ష్య సాధన చేసిన వ్యక్తి విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలి. పంచభూతాలు విశ్వమంతా ఆవరించిన ప్రకృతి నేర్పే విలువైన పాఠం మనిషిని విశాలదృక్పథుడిగా మార్చడమే. భూమి అట్టడుగు పొరల్లో పడి ఉన్న నన్ను ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు ఏమివ్వగలను... సమయానుకూలతను బట్టి ధాన్యరూపంలో నన్ను నేను అర్పించుకోవడం తప్ప- అనుకొని పంటసిరి మురిసిపోతుంది!
👏👏

No comments:

Post a Comment

Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducted by TT&BRU, Northern Railway.

Indian Railways Parcel Offices Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducte...