*"జ్ఞానానికి అధిష్ఠాత్రి సరస్వతీమాత"*
*"23-01-2026, శుక్రవారం, శ్రీపంచమి, వసంతపంచమి"*
మానవజాతికి అక్షయమైన సంపదలను ఇచ్చేది అక్షరం. అది సరస్వతీమాత అనుగ్రహ వరదానం. అక్షరాల అధిదేవత అయిన సరస్వతి పుట్టినరోజు శ్రీపంచమికి ఆలయాలలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు. సరస్వతీమాత అనుగ్రహ వరదానం.
విద్యాసంపద గల బృహస్పతి కూడా విద్యాసిద్ధి కోసం వాణిని ఆశ్రయించాడు. ఆదిశేషువును మహాపండితునిగా ఆర్షగ్రంథాలు ఉల్లేఖించాయి. ఆదిశేషుని వద్దకు భూదేవి వచ్చి జ్ఞానభిక్షను అర్థించింది. ఆయన సరస్వతిని ఉపాసించి భూదేవికి జ్ఞానబోధ చేయగలిగాడని బ్రహ్మపురాణంలో ఉంది.
పురాణాల గురించి వాల్మీకిమహర్షి, వ్యాసమహర్షికి సైతం బదులు చెప్పలేక అశక్తతను వెల్లడించాడు. తర్వాత పుష్కరక్షేత్రంలో నూరు సంవత్సరాలు సరస్వతిని ఉపాసించి, వేద విభజన చేయగలిగాడు.
ప్రకృతి మూడో రూపమైన శ్రీమహాసరస్వతి పరబ్రహ్మ నుంచి ఆవిర్భవించింది. ఈమె మాటకు, బుద్ధికి, విద్యకు, జ్ఞానానికి అధిష్టాత్రి. విద్యలన్నీ ఆమె స్వరూపాలే.
సద్బుద్ధి, సత్కవిత్వం, మేధాశక్తి, జ్ఞాపకశక్తి, సత్కీర్తి, సంస్కారదీప్తి అన్నీ ఆమె ప్రసాదితాలే.
సిద్ధాంత భేదాలు, వాదోపవాదాలు, తర్కం, మీమాంసలూ, వ్యాకరణాలూ, వ్యాఖ్యానాలూ, భాష్యాలు ఇలా విభిన్నగతుల్లో సాగిపోయే విజ్ఞాన విధులన్నీ ఆ తల్లి కటాక్ష వీక్షణ విలాసాలే.
పుస్తకం, లేఖిని ఆమె ప్రధాన నివాసాలు. శారదాదేవి మూలస్థానం శశాంకవదనం. ఆమె విగ్రహం శుద్ధ జ్ఞానమయం, ఆనందమయం, తేజోమయం.
సరస్వతీ రహస్యోపనిషత్తు, ప్రపంచసార సంగ్రహం,g శారదాతిలకం మొదలైన గ్రంథాలలో శారదాదేవి ఉపాసనా విధానం వర్ణితమైంది.
No comments:
Post a Comment