Monday, August 23, 2021

శ్రీ గరుత్మంతుడి కధ -13 వ భాగం 💥వైతరణీ_నది

🦅🦅🦅🦅🦅

🌹 శ్రీ గరుత్మంతుడి కధ -13 వ భాగం 

💥వైతరణీ_నది

వైతరణీ నది చూట్టూ గల నరకలోకం
వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో పేర్కొనబడి ఉంది. పాపములు చేసిన వారు చని పోయిన పిమ్మట ఈ నదిని  దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహించును. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోనికి వస్తారని ఇందులో పేర్కొన బడింది.

🌹1_వర్ణన

ఈ నది అతి భయంకరమైనది, దీనిలో నుండి వెళ్లే సమయములో వచ్చే బాధకు పాపాలన్ని గుర్తుకు వస్తాయని పేర్కొనబడింది. ఈ నది కొన్ని వేల యోజనాలు వెడల్పు కలిగి ఉంది. ఈ నదిలో నీరుకి బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉండును. ఈ నదిలో చాలా పెద్ద మొసళ్ళు మరియు మాంసము తినే క్రిములు, జంతువులు, పక్షులు ఉండడము వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్ని ఉండును.

వైతరణీ నదీ వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86 వేల ఆమడల దూరంలో ఉంది. ఆమడ అంటే యోజనం. నాలుగు క్రోసుల దూరం ఒక ఆమడ. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు (మొత్తం ఒక్క రోజు కాలంలో) 247 ఆమడల చొప్పున నడుస్తూ సౌమ్యము, సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వా పద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, శీతాడ్య, బహుభీతి అనే పదహారు పురములను దాటుకుని యమపురికి చేరుతాడు. ఊనషాణ్మాసికం (171 వ రోజు) పిండాలు భుజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరతాడట. అక్కడ నుంచే వైతరణి దాటాలి.

గోదానం చేసినవారు పడవలో ఆ వైతరణి దాటగలరుగాని, లేని వారికి ఆ నదీ జలం సలసల కాగుతూ కనపడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవవలసిందే, ఆ పాపాత్ముని నోట ముల్లు గుచ్చి, చేపను పైకి లాగినట్లు లాగి యమ కింకరులు ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. శీతాడ్యనగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రథమాబ్దికం రోజు పిండోదకాలు తీసుకున్నాక బహుభీతి పురాన్ని చేరతాడు.

హస్త ప్రమాణ పిండరూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయు రూపమైన శరీరాన్ని అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవము కోసం యమభటులతో యమపురికి చేరువవుతాడు. ప్రారబ్ద కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలసి యమపురి చేరతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత క్లేశాలతో కూడినదవుతుందట..

🌹2_దాటడానికి_మార్గాలు

ఈ నదిని దాటుటకు కొన్ని విభిన్న మార్గాలు గలవు. ఐతే ఒక విషయం గమనించవలసింది ఏమిటంటే కేవలము పాపాలు చెసినవారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేయవలసి ఉంటుంది. అనగా ఏ ఒక్క పాపము చెయ్యని వారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారము గుండా రారు, ఇంకా చెప్పాలంటే యమ లోకానికే రారు.

🌹3_నది_దాటాక

ఈ నది దాటిన పిమ్మట పాపులు దక్షిణ ద్వారము నకు చేరుకొందురు.

🌹అబద్ధమాడిన_వారు_నరకాన్ని_చవి_చూడాల్సిందే

ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దోవలో వైతరణి ఎదురైంది. దోవంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమికీటకాలు కనిపిస్తున్నాయి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోయాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నా సోదరులు, భార్య ఈ నరకంలో ఉండటమేమిటి? అన్నాడు ధర్మరాజు. ఇంద్రుడు ధర్మరాజు అనుభవించిన ఆ నరకం కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితమన్నాడు. అశ్వత్థామ హతః అని పెద్దగా అని, కుంజరః అని చిన్నగా పలికి గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి, ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అన్నాడు. అబద్దమాడిన వారికే నరకం తప్పకపోతే, నరహత్య చేసే వాళ్లకు ఎలాంటి శిక్షలుంటాయో?

🦅🦅🦅🦅🦅🦅🦅

No comments:

Post a Comment

Jai Shri Krishna

Excellent information about Bhagwan Shri Krishna: 1) Krishna was born *5252 years ago*  2) Date of *Birth* : *18th July,3228 B.C* 3) Month ...