కళ్యాణము చూతము రారండి..!
వరుడు: త్రిమూర్తుల దివ్యస్వరూపం, విధాత చూపిన విజయోన్ముఖపథంలో విజ్ఞతతో నడవడానికి ఉద్యుక్తుడైన సిద్ధ పురుషుడు.
వధువు: లక్ష్మి, సరస్వతి, పార్వతుల ఏకాత్మతా రూపం, పచ్చదనంతో లోకాన్ని చైతన్యపరిచే ప్రకృతి యొక్క శక్తి స్వరూపం.
సుముహూర్తం: శుభ ప్రదమైన దైవిక సమయం, నవగ్రహాల దివ్యశక్తి ప్రసరణ సమయం. అనగా 0-48 నిమిషాల కాలం. ఈ ముహూర్తాన్నే "గడియ" అని కూడా పిలుస్తారు.
బాసికం: మానవుని శరీరంలోని నాడులలో ఇడ, పింగళ, సుషుమ్న అనే మూడు నాడులు ముఖ్యమైనవి. వీటిలో సుషుమ్న అనే నాడికి కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి ఉంటాయి. ఇవి రెండూ కలిసే చోటు ముఖంలోని భ్రూమధ్యం. దీనిపై ఇతరుల దృష్టి దోషం పడకుండా వధూవరులకు ఈ స్థానాన్ని కప్పడానికి బాసిక ధారణ చేస్తారు.
అడ్డు తెర (చూపులు కలిసిన శుభవేళ): దీనికి మరొక పేరు "తెెరసాల". తెల్లని వస్త్రంపై శ్రీ (స్వస్తిక్) అని వ్రాయబడి ఉంటుంది. వధూవరులను తూర్పు పడమరలకు అభిముఖంగా కూర్చోబెట్టి, మంగళవాయిద్యాల మధ్య ముత్తైదువుల మంగళగీతాలు మారుమోగుతుండగా వధూవరులచే మహా సంకల్పం చెప్పిస్తారు.
కన్యాదానం: కన్యాదాన సమయంలో విష్ణు స్వరూపుడవైన నీకు బంగారు ఆభరణాల చేత అలంకరించబడిన కన్యను (నా కుమార్తెను) సమర్పించుకుంటున్నాను అనే భావంతో ఈ శ్లోకం చెబుతారు:
"కన్యాం కనక సంపన్నం కనకా భరణైర్యుతామ్ దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా"
జీలకర్ర బెల్లం: ఈ జీలకర్ర బెల్లం అనేది వధూవరులను పరస్పర ఆకర్షణకు లోను కావడానికి వేద ఋషులు దీనిని నిర్ణయించారు. (ఒక పాజిటివ్ ఎలక్ట్రిక్ ఛార్జర్) సహజీవనానికి నాందిగా నిలవడానికి మేధస్సును చైతన్యపరిచే ఈ జీలకర్ర బెల్లాన్ని తలపై పెట్టుకుంటారు.
మాంగల్య ధారణ:
"మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా, కంఠేబధ్నామి శుభగే త్వంజీవ శరదశ్శతమ్"
నా జీవితానికి ఆధారభూతమైన ఈ సూత్రమును నీ కంఠమున నేను కట్టుచున్నాను. నీవు నూరేళ్లు సుఖసంతోషాలతో ఉండాలి అంటూ వరుడు మాంగల్య ధారణ చేస్తాడు.
అక్షింతలు: నిజానికి అక్షింతలు కోటి శక్తికి సంపూర్ణత్వం చేకూరుతుంది. బియ్యము అంటే అక్షింతలు, అనగా ఎప్పటికీ విడిపోనివి. అమరత్వానికి అది ఒక ఉదాహరణ. తెల్లని బియ్యానికి పసుపు కలిపి అక్షింతలు తయారు చేస్తారు. బియ్యం చంద్రుడికి సంకేతం, పసుపు గురుగ్రహానికి సంకేతం. వీరిద్దరి శక్తిని సిద్ధంపేయడానికి చంద్రుడికి సంకేతంగా బియ్యాన్ని అక్షింతలుగా వాడటం మన ప్రాచీన సంప్రదాయం.
తలంబ్రాలు: పెళ్లి పనులలో ఇది ఎంతో వేడుక కలిగించే కార్యక్రమం. ఇందులో మొదటగా వరుడు "సమాజ శ్రేయస్సును, కుటుంబ వృద్ధిని కాంక్షించే ఉత్తమ సంతానాన్ని అందివ్వమని" దోసిలి ఎత్తి తలంబ్రాలు పోస్తాడు. అందుకు తలవంచి అంగీకరించే వధువు, "ఆ సంతాన జీవన గమనానికి అవసరమైన పాడి, పంటలను సమృద్ధిగా అందించమంటూ" తనవంతుగా వధువు తలంబ్రాలు పోస్తుంది. దానికి సమాధానంగా వరుడు "నేను అందించే ఆర్థిక సంపదను అదుపుగా, సమయోచితంగా వినియోగించమని" తిరిగి తలంబ్రాలు పోస్తాడు. ఆ తరువాత ఇరువురూ త్యాగముతో, ధనముతో సహజీవనం సాగిద్దాము, బ్రతుకు బాధ్యతను సమానంగా పంచుకుందామంటూ ఒకరిపై ఒకరు వరసగా తలంబ్రాలు పోసుకుంటారు.
సప్తపది - ఏడడుగులు: వధూవరులు నిలబడి, ఒక్కో అడుగు వేస్తూ దైవశక్తి మంత్రములు పఠిస్తారు. ప్రణాళికాబద్ధంగా ప్రగతిశీలమైన జీవనము కొరకు అగ్నిసాక్షిగా సంకల్పం తీసుకుంటూ దైవానుగ్రహం జీవితమంతా లభిస్తుందని భావిస్తూ ఏడడుగులు వేస్తారు:
- మొదటి అడుగు - అన్నవృద్ధికి
- రెండవ అడుగు - బలవృద్ధికి
- మూడవ అడుగు - ధనవృద్ధికి
- నాలుగవ అడుగు - సుఖవృద్ధికి
- ఐదవ అడుగు - ప్రజాపాలనకి
- ఆరవ అడుగు - దాంపత్య జీవనానికి
- ఏడవ అడుగు - సంతాన సమృద్ధికి
అరుంధతి దర్శనము: ఈ భూగోళము, ఈ ఉత్పత్తి స్థానము ధ్రువముగా ఉండుగాక! నక్షత్రముల సమూహము అరుంధతీదేవి ధ్రువత్వమును పొంది విలసిల్లును. మహనీయుల ఆశీర్వచనములతో బంధుమిత్రుల అభినందనలతో ఉందురుగాక!
సర్వేజనా సుఖినోభవంతు...
No comments:
Post a Comment