Saturday, May 16, 2026

The Rise And Fall Of Big Bazaar: How Debt And Over-expansion Ruined Kishore Biyani's Retail Empire

రిటైల్ రారాజు టు జీరో.. బిగ్ బజార్‌ను నిండా ముంచిన ఒక్క 'అత్యాశ'.. అందరూ తెలుసుకోవాల్సిన జీవిత సత్యం
********************************భారత రిటైల్ రంగాన్ని శాసించిన బిగ్ బజార్, అప్పులు, అతి విస్తరణ అనే తప్పుడు నిర్ణయాల వల్ల పేకమేడలా కూలిపోయింది. కిషోర్ బియానీ స్థాపించిన ఈ సామ్రాజ్యం 2001లో అద్భుత విజయాలతో ప్రారంభమై 2019 నాటికి వార్షిక ఆదాయం రూ.20,000 కోట్లకు చేరుకుంది. కానీ అప్పులు చేసి 20కి పైగా వ్యాపారాల్లోకి ప్రవేశించడం, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ సంస్థల పోటీని తట్టుకోలేకపోవడం వల్ల ఆ భారీ రిటైల్ సామ్రాజ్యం ఎలా కుప్పకూలిందో తెలుసుకుందాం.

సక్సెస్ కావడం కంటే.. దాన్ని నిలబెట్టుకోవడమే చాలా మంది విజేతలకు కష్టమైన పని. బిగ్ బజార్ విషయంలో ఇదే జరిగింది. దేశీయ రిటైల్ రారాజుగా పేరుగాంచిన కిషోర్ బియానీ స్థాపించిన బిగ్ బజార్ ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2001 జనవరి 26న ముంబైలో సబ్సే సస్తా దిన్ పేరుతో ఒక మెగా సేల్ నిర్వహించినప్పుడు, వేల సంఖ్యలో ప్రజలు బారికేడ్లను ఛేదించుకుని మరీ షాపింగ్ కోసం ఎగబడ్డారు. టీవీల నుండి కిరాణా సరకుల వరకు భారీ తగ్గింపులు ఇవ్వడంతో కేవలం కొన్ని గంటల్లోనే రూ.30 కోట్ల రికార్డు స్థాయి అమ్మకాలు జరిగాయి. ఇది భారతీయ షాపింగ్ విధానాన్నే సమూలంగా మార్చేసింది.
big-bazaar

కిషోర్ బియానీ చరిత్ర..
కిషోర్ బియానీ ప్రస్థానం 1981లో తన కళాశాల దశలోనే ప్రారంభమైంది. తన స్నేహితుడు ధరించిన స్టోన్-వాష్డ్ ప్యాంటును చూసి ఆకర్షితుడైన కిషోర్, 200 మీటర్ల ఫ్యాబ్రిక్ కొనుగోలు చేసి దుస్తుల వ్యాపారంలో అడుగుపెట్టారు. 1985 నాటికి సొంత బ్రాండ్‌ను విక్రయించడం మొదలుపెట్టి, 1987లో కేవలం రూ.7 లక్షల పెట్టుబడితో 'ప్యాంటలూన్' ప్రారంభించారు. 1994 నాటికి దేశవ్యాప్తంగా 72 ఫ్రాంచైజీ స్టోర్లను తెరిచి అద్భుతమైన విజయం సాధించారు.

ఆ తర్వాత ప్రజలు దుస్తులతో పాటు నిత్యావసరాలకు కూడా ఒకే చోట షాపింగ్ చేసేలా ఒక స్థానిక మార్కెట్ వాతావరణాన్ని తలపించేలా బిగ్ బజార్ కు రూపకల్పన చేశారు. కస్టమర్లతో ప్రత్యక్ష సంబంధం ఉండే వ్యాపారం చేయాలన్నది కిషోర్ కల.

ఆశ.. అత్యాశగా మారితే..
ఆశ అత్యాశగా మారినప్పుడు పతనం ప్రారంభమవుతుంది. కిషోర్ బియానీ దుస్తుల రంగం నుండి గృహ నిర్మాణం, పుస్తకాలు, బంగారం, బీమా, ఆర్థిక సేవలు వంటి 20కి పైగా విభిన్న వ్యాపారాల్లోకి ప్రవేశించారు. ఈ వేగవంతమైన విస్తరణ కోసం ఆయన సొంత డబ్బు కాకుండా భారీగా అప్పులు చేశారు. సరిగ్గా 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం రావడం, అమ్మకాలు పడిపోవడంతో వడ్డీలు చెల్లించడం భారంగా మారింది.

2012 నాటికి ఆ అప్పుల భారం రూ.12,000 కోట్లకు చేరుకుంది. పరిస్థితులను చక్కదిద్దేందుకు ప్యాంటలూన్‌ను రూ.1,600 కోట్లకు, ఫ్యూచర్ క్యాపిటల్‌ను రూ.4,250 కోట్లకు అమ్ముకోవాల్సి వచ్చింది.

ఈ - కామర్స్ సంస్థలతో పోటీ..
సరిగ్గా అదే సమయంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు మార్కెట్ రూపురేఖలను మార్చేశాయి. వీటికి పోటీగా కిషోర్ 'బిగ్ బజార్ డైరెక్ట్' ప్రారంభించినా, సాంకేతిక సమస్యల వల్ల అది విఫలమైంది. 2015లో 'ఈజీడే' అనే 10 వేల చిన్న కిరాణా దుకాణాలను ప్రారంభించాలని ప్లాన్ చేసినా, స్థానిక దుకాణాలతో పోటీ పడలేకపోయారు. 2019లో అత్యున్నత దశలో ఉన్నప్పుడు బిగ్ బజార్‌కు 300కు పైగా స్టోర్లు ఉండి, వార్షిక ఆదాయం రూ.20 వేల కోట్లకు చేరుకుంది. సుమారు 10,000 నుండి 50,000 మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించింది.

ఆర్థిక సంక్షోభంతో..పెద్ద దుకాణాలు కూడా విజయవంతం అవుతాయని నిరూపించిన కిషోర్ బియానీ సామ్రాజ్యం చివరకు పెరుగుతున్న అప్పులు, సరైన ప్రణాళిక లోపం, ఆన్‌లైన్ మార్కెట్ విస్తరించడంపై అంచనా వేయలేకపోవడం వల్ల కుప్పకూలింది. ఈ ఆర్థిక సంక్షోభం కారణంగా వేలాది మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు. చివరకు ఫ్యూచర్ గ్రూప్ సంస్థను రిలయన్స్ రిటైల్ దక్కించుకుంది. ఆ సంస్థ 2026 నాటికి చాలా వరకు దుకాణాలను స్మార్ట్ బజార్ గా పేరు మార్చింది. ఒకే సమయంలో అనేక పడవలపై కాలు వేయడం ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని ఎలా పాతాళానికి నెట్టివేసిందో చెప్పడానికి బిగ్ బజార్ కథ మంచి ఉదాహరణ.

No comments:

Post a Comment

Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducted by TT&BRU, Northern Railway.

Indian Railways Parcel Offices Indian Railways has decided to modernize Parcel Offices across the network based on a detailed study conducte...