Sunday, August 2, 2020

శ్రావణ పౌర్ణమి రోజే రాఖి పండుగ ఎందుకు?

శ్రావణ పౌర్ణమి రోజే రాఖి పండుగ ఎందుకు?
ఈ రక్షాబంధన్ సాక్షిగా దీవిస్తే సంతోషిస్తా..
అన్నయ్యా నన్ను దీవించు..
కలకాలం నన్ను ఇలాగే ప్రేమించు..
ప్రియమైన నీ చెల్లెలు.
దేవతలు, ప్రకృతి ఆరాధన, ఆత్మీయత అనురాగబంధాలు, సకల పూజారాధనలు కారణాలు, చరిత్రలు ఏవైనప్పటికీ ఉన్మాదం, విచక్షణ లాంటి వెకిలి చేష్టలతో మానవతా విలువులు మంటగలుస్తున్న ప్రస్తుత కాలంలో రాఖీ పౌర్ణమి తన విశిష్టతను చాటిచెబుతూ సోదర ప్రేమ పటిష్టతకు దోహదపడుతుంది. తెలుగు రాష్ట్రాల్లో తమ సోదరులకు సోదరి రాఖీ కట్టి, మిఠాయిలు తినిపిస్తారు. మనం రాఖీ పండుగను ఇలానే చేసుకుంటాం.
ఏడాదికి వచ్చే ద్వాదశ పౌర్ణమిల్లో శ్రావణ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించేవారు ఈ రోజునే పాతది వదిలి కొత్త దానిని ధరిస్తారు. దీనినే ఉపాకర్మ అంటారు. ఉపాకర్మను యఙ్ఞోప‌వీతం పేరుతో పిలుస్తారు. దీనికి అంటే యాగ కర్మతో పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమనాథుడు దీనిని నూలి పౌర్ణమి అన్నాడు. ఎందుకంటే నూలుతో తయారుచేసిన జంధ్యాన్ని ధరించడమే దీనికి కారణం. వేద్యాధ్యయనానికి ప్రతీకైన ఉపాకర్మను ఆచరించాలి. దీనికి ముందు ఉపనయనం జరిపించి జంధ్యాన్ని వేయడం ఆచారం.
యఙ్ఞోప‌వీతం ధరించినవారు ద్విజులు. ద్విజులు అంటే రెండు జన్మలు కలవారని అర్థం. తల్లి గర్భం నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం అనంతరం గురువు నుంచి ఙ్ఞానాన్ని పొందడం రెండోది. ఉపనయం సమయంలో యఙ్ఞోపవీతానికి జింక చర్మాన్ని కడతారు. దీనిని ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు వదిలిపెడతారు. ఉపనయనం అయిన వారు జంధ్యాల పౌర్ణమి రోజు గాయత్రీ పూజచేసి కొత్త యఙ్ఞోపవీతాన్ని ధరించి పాతది విసర్జించాలి.
పరిపక్వతకు, పరిశుద్ధతకు యఙ్ఞోపవీతం దివ్యౌషధం. ఇది ఉపనయన సంస్కారం ఉన్నవారికే పరిమితమైనా మిగతావారు కూడా అష్టోత్తరాలతో గాయత్రీదేవిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. అవివాహితులు మూడు పోగుల జంధ్యాన్ని, వివాహమైన వారు మూడు ముడులున్న తొమ్మిది పోగుల జంధ్యాన్ని ధరిస్తారు.
ఈ పండుగ రక్తం పంచుకుని పుట్టిన సోదరుల మధ్యే కాదు. ఏ బంధుత్వం ఉన్నా లేకపోయినా, ఒక సోదరుడు, సోదరి భావనలతో రాఖీ కట్టడం జరుగుతోంది. కేవలం సోదరీసోదరుల అనుబంధానికి గుర్తుగా మాత్రమే కాకుండా ఆత్మీయుల మధ్య కూడా ఐకమత్యానికి పరస్పర సహకారానికి చిహ్నంగా చేసుకోవడం కనిపిస్తుంది.
రాఖీ రోజు ఉద‌యాన్నే త‌లార స్నానం చేసి, కొత్త బ‌ట్ట‌లు వేసుకుని రాఖీకి సిద్ధ‌ప‌డ‌తారు. అక్క‌చెల్లెళ్లంతా బుద్ధిగా కూర్చున్న అన్న‌ద‌మ్ములకి రాఖీని క‌డ‌తారు. రాఖీని క‌ట్టేట‌ప్ప‌డు `‘యేన బద్ధో బలీరాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బధ్నామి రక్షమాచల మాచల’` అనే స్తోత్రాన్ని కూడా చ‌దువుతారు. `ఎలాగైతే ఆ విష్ణుమూర్తి, బ‌లిచక్ర‌వ‌ర్తిని బంధించాడో, నువ్వు అలాగే ఇత‌ణ్ని అన్ని కాలాల‌లోనూ విడ‌వ‌కుండా ఉండు` అని దీని అర్థం. ఆ త‌రువాత హార‌తిని ఇచ్చి, నుదుట‌ తిల‌కాన్ని దిద్దుతారు. దానికి సంతోష‌ప‌డిపోయే సోద‌రులు త‌మ ప్రేమ‌కు గుర్తుగా వారికి చ‌క్క‌టి బ‌హుమ‌తుల‌ను అందిస్తారు.

No comments:

Post a Comment

Welcome to the Telugu Wedding Celebration..!

Welcome to the Wedding Celebration..! The Groom: A divine manifestation of the Trinity (Trimurti), a wise individual ready to walk the path ...